Wednesday 7 February 2018

Press Meet on 06.02.2018

కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా మన రాష్ట్రంలో ఈనెల 8 వతేదీన జరిగే రాష్ట్ర బంద్‌కు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ మద్దత్తునిస్తున్నది. బడ్జెట్‌లో పట్టణాలకు, నగరాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు కేవలం కంపెనీలను బాగు చేయటానికే తప్ప పట్టణ ప్రజలకు నేరుగా ఉపయోగపడేవిధంగా లేవు. స్మార్ట్‌ సిటీ క్రింద ఎంపిక చేసిన 99 నగరాలకు రు.2.04 లక్షలకోట్లు కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు. స్మార్ట్‌ సిటీలకు ఇచ్చే నిధులు నేరుగా పట్టణాలలో పనులు నిర్వహించటానికి రావు. స్మార్ట్‌ సిటీ నిబంధనల ప్రకారం నగరాన్ని కంపెనీలకు అప్పగిస్తారు. ఈ కంపెనీలు నగరంలో పనులు చేసి, వాటికి అయిన ఖర్చును, లాభాలను ప్రజలనుండి రాబట్టుకుంటాయి. ఇప్పుడు కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించిన రు.2.04 కోట్లు ఈ కంపెనీలకు పెట్టుబడిగా చేరి, నగర ప్రజలతో వ్యాపారం చేసుకోవటానికి మాత్రమే ఉపయోగపడతాయి తప్ప నేరుగా నగర ప్రజలకు ఉపయోగపడవు. కాని ప్రజలకు ఎంతోకొంత చేరే అమృత్‌ పథకానికిమాత్రం కేవలం రు.6000కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది పట్టణ ప్రజలను వంచించటమేనని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది.
కేంద్ర ఖజానాకు ఎగ్గొట్టిన రు.7 లక్షల కోట్లు పన్నులనుగాని, బ్యాంకులకు ఎగ్గొట్టిన రు.8 లక్షల కోట్ల బకాయిలను రాబట్టడానికి కాని ఈ బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు లేవు. గత సంవత్సరం కార్పొరేట్‌ కంపెనీలకు సుమారు రు6 లక్షలకోట్లు రాయితీలిచ్చారు. మరల ఈ సంవత్సరం బడ్జెట్‌లో కూడా కొన్ని రాయితీలు ప్రకటించారు. కాని ఉద్యోగులు ఆకాంక్షించిన విధంగా ఆదాయపు పన్ను మినహాయింపులు మాత్రం ఇవ్వలేదు. ఎం.పి.లకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆటోమేటిక్‌గా జీతాలు పెరిగేవిధంగా ఈ బడ్జెట్‌లో ఏర్పాటు చేసుకున్నారు. పెట్రోలు డీజిల్‌ మీద లీటరుకు రు.8లు పన్ను తగ్గించారు. డ్యూటీ సెస్‌ పేరుతో లీటరుకు రు.8లు విధించారు. ఇవన్నీ ప్రజాధనాన్ని కొల్లగొట్టేవిగా ఉన్నాయని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది.
ఈ బడ్జెట్‌ రాష్ట్ర విభజన హామీలను ఏమాత్రం నెరవేర్చేదిగా లేదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. మొదటి సంవత్సరపు బడ్జెట్‌ లోటు, రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చటం, రాష్ట్రానికి ప్రత్యేక ¬దా, పోలవరం డ్యాం నిర్మాణం, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక అభివృధ్ధికి నిధులు, రాష్ట్రంలో ప్రత్యేక రైల్వే జోన్‌, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, మెట్రో రైళ్ళు ఇవన్నీ విభజన హామీలు. వీటిలో కొన్ని చట్టంలో ఉన్నవి వున్నాయి. కొన్ని పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు 2 సంవత్సరాలు రు.50 కోట్లు ఇచ్చారు. ఆతర్వాత అదీలేదు. ఒరిస్సాకోసం మన రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్‌ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా ఐదేళ్ళు కాదు పదేళ్ళు కావాలని డిమాండు చేసింది ఈ బీ.జే.పీ. వారే. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక ¬దా ఇచ్చేది లేదు పొమ్మన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. చివరకు అదీ లేదు. పోలవరం నిర్మిస్తామన్నారు. దానికి కావలసిన నిధుల కేటాయింపులేదు. ఆంధ్రలో మెట్రో రైళ్ళు వదిలేసి, ఇప్పటికే నడుస్తున్న బెంగుళూరు మెట్రోరైలుకు రు.17,000కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో రైల్వే ట్రైనింగ్‌ సెంటర్‌ పెడతామన్నారు. దానిని గాలికొదిలేసి, గుజరాత్‌లోని వడోదరాలో రైల్వే యూనివర్శిటి ఏర్పాటుకు నిధులు కేటాయించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదు.
                   రాష్ట్రానికీ, రాష్ట్రంలోని పట్టణాలకు, పట్టణ ప్రజలకు, ఉద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించే స్థితిలో లేదని స్పష్టమవుతున్నది. ఈనేపధ్యంలో రాష్ట్ర ప్రజలు ఆంధోళనాబాట పట్టడం మినహా వేరే మార్గం లేదు. అందుకే ఈ నెల 8 వతేదీన జరిగే రాష్ట్ర బంద్‌కు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ మద్దత్తునిస్తున్నది. నగరంలోని పన్ను చెల్లింపుదారులందరూ ఈ బంద్‌లో పాల్గొని జయప్రదం చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేస్తున్నది.

వి.సాంబిరెడ్డి                                                          యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                                         కార్యదర్శి