Friday 8 November 2013

టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ చెప్పింది నిజం


రాష్ట్రంలో 2012 నాటికి మున్సిపాలిటీలు, మున్సిప‌ల్ కార్సొరేష‌న్‌లు క‌లిసి 130 ఉన్నాయి.  మొద‌టి రాష్ట్ర   ఫైనాన్స్ క‌మీష‌న్ సిఫార్సుల ప్ర‌కారం రాష్ట్ర ప్ర‌భుత్వం స్థానిక సంస్థ‌ల‌కు నిధులు కేటాయించి ఉన్న‌ట్ల‌యితే  2005-2006 నుండి 2012-2013 వ‌ర‌కు రు. 44,227.71 కోట్లు ఈ 130 ప‌ట్ట‌ణాల‌కు న‌గ‌రాల‌కు వ‌చ్చుండేవి. అదే 2 వ  రాష్ట్ర   ఫైనాన్స్ క‌మీష‌న్ సిఫార్సుల ప్ర‌కారం  కేటాయించి ఉన్న‌ట్ల‌యితే రు.27,672.76 కోట్లు వ‌చ్చుండేవి. కాని రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ 130 ప‌ట్ట‌ణాల‌కు న‌గ‌రాల‌కు వాస్త‌వంగా విడుద‌ల చేసింది  కేవ‌లం రు. 215.22 కోట్లు మాత్ర‌మే.
 మ‌రి ఈ డ‌బ్బంతా ఏమైంది?   రాష్ట్రంలోని 129 ప‌ట్ట‌ణాల‌ను బ‌లిపెట్టి ఆ ఒక్క హైద‌రాబాద్ మీద‌నే ఖ‌ర్చు చేసి అభివృధ్ధి చేశారు.  ఈవిష‌యాన్ని టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ స్ప‌ష్టం చేస్తూ వ‌స్తున్న‌ది. ఇప్పుడ‌ది ఋజువైంది. ఎలా ఋజువైందో 08.11.2013 న ప‌త్రిక‌ల‌లో వ‌చ్చిన ఈ క్రింది వార్త‌ల‌ను చూడండి.
                                      ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
   రాష్ట్ర విభజన నేపథ్యంలో హైద్రాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం ద్వారానే ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చేసినట్లవుతుందని సీమాం ధ్ర మంత్రులు కేంద్రానికి వివరిస్తున్నారు. హైద్రాబాద్‌ను యుటిగా మారిస్తే విభజనకు ఏ విధమైన అడ్డంకులూ ఉండబోవని హామీ ఇస్తున్నారు. ఈమేరకు జీఓంలో సభ్యులుగా ఉన్న కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, చిదంబరంతో కాంగ్రెస్‌ సీమాంధ్ర కేంద్ర మంత్రులు గురువారమిక్కడ సమావేశమయ్యారు.   కేంద్ర మంత్రులు కావూరు సాంబశివరావు, చిరంజీవి, పురంధేశ్వరి, జెడి శీలం తొలుత మొయిలీతోను, తర్వాత చిదంబరంతోనూ విడివిడిగా సమావేశమయ్యారు. మొయిలీతో భేటీ అనంతరం మంత్రి జెడి శీలం విలేకరులతో మాట్లాడుతూ...తెలుగు ప్రజలు ప్రాంతాలుగా విడిపోయినా, ప్రజలుగా కలిసి ఉండాలన్నదే తమ అభిమతమని వ్యాఖ్యానించడం గమనార్హం. ' విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాలకూ న్యాయం చేయాలని మొయిలీని కోరాం. ముఖ్యంగా హైద్రాబాద్‌ నగర భవితవ్యం, నదీజలాల పంపకంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశాం. గత నలభై ఏళ్లుగా తెలుగు ప్రజలందరూ కలిసి హైద్రాబాద్‌ను అభి వృద్ధి చేశారు. గత ఎనిమిదేళ్లలో హైద‌రాబాద్  నగర అభివృద్ధి కోసం 55 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 280 కి.మీ రింగురోడ్డు ఏర్పరిచాం. 456 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వాటి అనుబంధ సంస్థలూ నగరంలో ఉన్నాయి. ఫలితంగా ఇటీవలి కాలంలో అదనంగా 35 లక్షల మంది సీమాంధ్రులు కొత్తగా నగరానికి వచ్చారు. అందువల్లే నియోజకవర్గాల పునర్విభజనలో సీమాంధ్రలో 12 అసెంబ్లీ సీట్లు తగ్గగా, హైద్రాబాద్‌లో 10 సీట్లు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే హైద్రాబాద్‌ అందరిదీ అన్న భరోసా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం ' అని శీలం వివరించారు.


                                    ఆంధ్ర‌జ్యోతి-న్యూఢిల్లీ, నవంబర్ 7 :
 సీమాంధ్ర కేంద్ర మంత్రు లు కుండబద్దలు కొట్టారు. నిన్నటివరకు సమైక్యవాణి వినిపించగా నేడు విడిపోయి కలిసుందామని పిలుపునిచ్చారు. విభజన సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇస్తే ప్రజలను శాంతపరుస్తామని జీవోఎంకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథార్టీ (హెచ్ఎండీఏ) పరిధిని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం జీవోఎం సభ్యులు చిదంబరం, వీరప్ప మొయిలీని కావూరు సాంబశివరావు, చిరంజీవి, జేడీ శీలం, పురందేశ్వరి కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
సీమాంధ్ర కేంద్ర మంత్రుల ప్రధాన డిమాండ్లు..

-రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 40 ఏళ్లలో ఏ నగరాన్నీ అభివృద్ధి చేయలేదు. ఈ ఎనిమిదేళ్లలోనే హైద‌రాబాద్ లో  రూ.50 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించారు. 280 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్‌గల హైదరాబాద్‌వంటి నగరాలు ప్రపంచంలో మరో నాలుగు మాత్రమే. అదే జాతీయంగా అయితే హైదరాబాద్ ఒక్కటే. ఇక్కడ పేరొందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు 456 ఉన్నాయి. ప్రపంచంలోని 150 దేశాలకు మందులు పంపే ఫార్మా కంపెనీలున్నాయి. దీంతో హైదరాబాద్ అందరిదీ అని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణకు ఈ నగరాన్ని ఇచ్చేస్తే మిగతావారిని అన్యాయం చేసినట్లే. కాబట్టి, హైదరాబాద్‌ను యూటీ చేయాలి.

- రాష్ట్రం విడిపోతే నదీజలాల సర్దుబాటు ఎలా చేస్తారనే భయం రైతులను వెంటాడుతోంది. విభజన తర్వాత నీటి సర్దుబాట్లు ఎలా ఉండాలనేదానిపై స్పష్టమైన ప్రణాళికను ముందుగానే వెల్లడించాలి.

-నియోజకవర్గాల పునర్విభజనతో సీమాంధ్రలో 12 స్థానాలు తగ్గి తెలంగాణలో పెరిగాయి. ఒక్కో నియోజకవర్గానికి 2.58 లక్షల మంది ప్రజలని భావించినా 25 లక్షల మంది, అంతకు ముందు నుంచి నివసిస్తున్న వారు మరో 10 లక్షలమంది సీమాం«ద్రులు హైదరాబాద్‌లో ఉన్నారు. వారికి భరోసా ఇవ్వాలంటే యూటీ చేయడమే పరిష్కారం. హైకమాండ్‌ను ఇదే కోరిక కోరామని మరో కేంద్రమంత్రి కిల్లి కృపా రాణి కూడా శ్రీకాకుళం జిల్లా పాలకొండలో చెప్పారు.

        టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్  చెప్పింది నిజ‌మ‌ని మంత్రులే ఋజువు చేశారు.