Thursday 13 December 2018

రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తి పౌరుడిని ఓట‌రుగా న‌మోదు చేయ‌టం ఎన్నిక‌ల క‌మీష‌న్ బాధ్య‌త‌- ప‌క్కా ఓట‌రులిస్టు త‌యారైన త‌ర్వానే 2019 ఎన్నిక‌ల‌కు వెళ్లాలి- టాక్స్ పేయ‌ర్స్ అసోసియేస‌న్ డిమాండ్‌


ప్రచురణార్ధం:                                                                    తేదీ:13.12.2018


2019 ఎలక్షన్ల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో అర్హుడైన ఏ పౌరుడు ఓటు లేకుండా ఉండకూడదని, అందుకోసం పక్కా ఓటర్‌ లిస్టులను తయారు చేసి ఎన్నికలకు వెళ్లాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల అధికారులను డిమాండు చేసింది. ఆమేరకు రాష్ట్ర ఛీప్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఆర్‌.పి. సిసోడియాకు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఒక లేఖ వ్రాశింది. ఇటీవల తెలంగాణా ఎన్నికలలో ప్రతి నియోజక వర్గంలో వేలాది ఓట్లు గల్లంతయ్యాయని ప్రజలు గగ్గొలు పెట్టారని, అక్కడి ఛీప్‌ ఎలకక్షన్‌ ఆఫీసర్‌ ప్రజలను క్షమాపణకోరవలసి వచ్చివందని అలాంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్‌లో తల్తెకుండా ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరింది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వెల్లడించిన ఓటర్‌లిస్టులో అనేక మంది ఓట్లు గల్లంతయ్యాయి. అనేకమంది ఓటుకోసం మరల దరఖాస్తు చేసుకున్నారు. కొంతమందికికి తమ ఓటు ఉన్నదో లేదో కూడా తెలియదు. కొంతమంది తమకు ఓటరు కార్డు ఉంది కనుక తమ ఓటు ఖచ్చితంగా లిస్టులో ఉంటుందన్న ధీమాతో ఉన్నారు. కాని ఓటరు కార్డు ఉన్నప్పటికీ, ఓటరు లిస్టులో పేరులేని వారు గణనీయంగా ఉన్నారన్న విషయాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఛీప్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ దృష్టికి తెచ్చింది. అలాంటివారు ఎన్నికల సమయంలో మాత్రమే తమ ఓటు లేదన్న విషయాన్ని గ్రహిస్తారని, కాని అప్పుడు చేయగలిగిందేమీ లేదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. ఒకే డోర్‌ నెంబర్‌ లో ఉన్న వారి ఓట్లను వివిధ బూతులకు కేటాయించటంతో వారికి తమ ఓటు ఉన్నదో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని, అందువలన ఒకే డోర్‌ నెంబర్‌లో ఉన్న వారందరి ఓట్లును ఒకే బూతుకు కేటాయించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరింది. 
ఓట్ల వెరిఫికేషన్‌ను రాజకీయ పార్టీలకు వదలి వేయటం సరి కాదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. ఇటీవల రాష్ట్ర ముఖ్య మంత్రి నుండి తమ పాలన సంతృప్తిగా ఉన్నదా లేక అసంతృప్తిగా ఉన్నదా తెలుపమని ఫోన్లు వస్తున్నాయని, తాము అసంతృప్తిగా ఉన్నదని చెప్పటం వలననే తమ ఓట్లు తొలగిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఛీప్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ దృష్టికి తెచ్చింది. ఈ విషయంలో ప్రజలలో ఎన్నికల కమీషన్‌ మీద విశ్వాసం కన్నా అధికార పార్టీ పట్ల భయం ఎక్కువగా ఉన్నదని, ఎన్నికల యంత్రాంగం అధికార పార్టీ కనుసన్నలలో పని చేస్తున్నదన్న భావన వారిలో నెలకొని ఉండటమే దీనికి కారణమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. అర్హులైన పౌరులందరి పేర్లను ఓటరు లిస్టులో చేర్చటం ద్వారా ప్రజలలో విశ్వాసం కల్పించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరింది. 2019 ఎన్నికల సమయానికి ఇంకా 3 నెలల సమయం ఉన్నందున ఈ 3 నెలల కాలంలో ఎన్నికల యంత్రాంగాన్ని రంగంలోకి దించి ఇంటింటికీ తిరిగి ఓట్లు వెరిఫికేషన్‌ చేయించాలని, ఓట్లు గల్లంతయిన వారి ఓట్లును తిరిగి చేర్పించాలని, పక్కా ఓటరు లిస్టులతో ఎన్నికలకు వెళ్లాలని ఛీప్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది.

వి.సాంబిరెడ్డి                                                       యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                                కార్యదర్శి 











Tuesday 20 November 2018

"రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను ధ్వంసం చేస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం- వంతపాడుతున్న రాష్ట్ర ప్ర‌భుత్వం"- ఈ క్ష‌ణం వెబ్ ఛాన‌ల్‌తో M.V. Anjaneyulu



"రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను ధ్వంసం చేస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం- వంతపాడుతున్న రాష్ట్ర  ప్ర‌భుత్వం"- ఈ క్ష‌ణం వెబ్ ఛాన‌ల్‌తో M.V. Anjaneyulu




Monday 12 November 2018

ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌ను అప్పుల‌లో ముంచే జీ.వో 336ను ర‌ద్దు చేయాలి- టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ డిమాండ్ 12.11.2018

ప్ర‌చుర‌ణార్ధం
పట్టణ స్థానిక సంస్థలను అప్పులలో ముంచటానికి ఉద్దేశించిన జీ.వో నెం.336ను తక్షణమే ఉపసంహరించు కోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. విజయవాడతో సహా రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక సంస్థలలో వివిధ పనులను చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం రు.12,600 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. అందులో 90 శాతం అంటే రు. 11,340 కోట్లు బ్యాంకులనుండి 8 శాతం వడ్డీకి ఋణం తీసుకోబోతున్నది. మిగతా 10 శాతం అంటే రు.1260కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుంది. పట్టణ స్థానిక సంస్థలలో నీటి సరఫరా, సివరేజి మేనేజ్‌మెంట్‌, వర్షపునీటి కాలువలు, రోడ్ల పునర్నిర్మాణం, శ్మశానవాటికలు, పార్కుల అభివృధ్ధి- ఈ ఆరుపనులు ఈ ఋణంతో చేస్తారట. నిజానికి మున్సిపల్‌ నిధులతో ఈ పనులను చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు చెల్లించిన పన్నులనుండి స్ధానికాభివృధ్ధికోసం మున్సిపాలిటీలకు నిధులను కేటాయించాలి. ఇవేవి చేయకుండా వేలకోట్లరూపాయలు అప్పులుచేసి ఈ పనులు చేస్తామనటం దారుణం. ఇప్పటికే నీటి కనెక్షన్‌ ఇవ్వాలన్నా, డ్రైనేజి కనెక్షన్‌ ఇవ్వాలన్నా డొనేషన్‌లపేరుతో వాటికయ్యే ఖర్చును వసూలు చేస్తున్నారు. నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు భారీగా పెంచి వాటి నిర్వాహణకు అయ్యే ఖర్చును ప్రజల నుండే వసూలు చేస్తున్నారు. పార్కులు ప్రైవేటువారికి ఇస్తున్నారు. ఒకవైపు నిర్మాణ,నిర్వహణా వ్యయాలను ప్రజలనుండి వసూలు చేస్తూ తిరిగి అవే పనులకు వేలాది కోట్లరూపాయలు అప్పులు తెచ్చి చేస్తామనటంలో ఔచిత్యమేమిటని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది.
అయితే ఈ ఋణం తీసుకునేది ప్రభుత్వమైనా భరించేది ప్రభుత్వం కాదు. ఈ పనులకు చేయటానికి ఏ మున్సిపల్‌ సంస్థ పరిధిలో ఎంత ఖర్చు చేస్తారో ఆ మొత్తాన్ని ఆ మున్సిపాలిటీ లేదా ఆ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆ జీ.వోలో నిబంధన విధించారు. దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకుండా మున్సిపల్‌ సంస్థలను అప్పుల ఊబిలోకి నెడుతున్నదని స్పష్టం అవుతున్నది. ఈ ఋణంలో మొదటి దఫాగా రు.3000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే తీసుకోవాలని నిర్ణయించారు. కేవలం 4 నెలలో కాలంలో రు.3000 కోట్లు విలువగలిగిన పనులు ఎలా అవుతాయని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది. విజయవాడలో వర్షపునీటి కాలువల నిర్మాణం కోసం కేంద్రం నుండి రు.461 కోట్లు వచ్చి సుమారు 3 సంవత్సరాలు అవుతున్నా, నేటికీ పనులు అరకొరగా జరుగుతున్నాయే తప్ప పూర్తికాలేదు. ఎన్నికలలోపు పూర్తయ్యే అవకాశంకూడా కనుపించటం లేదు. మూడేళ్ళలో రు.461 కోట్ల విలువ కలిగిన పనులు చేయలేని ప్రభుత్వం, 4 నెలల కాలంలో రు.3000 కోట్లు ఖర్చు చేసి పనులు చేస్తామనటం కేవలం ప్రజలను మభ్యపెట్టడమేనని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. మరో 5 నెలలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఉండగా రు.3000 కోట్లు ఈ ఆర్ధిక సంవత్సరంలోనే తీసుకోవటం మున్సిపాలిటీలలో పనులు చేయటానికి కాదని, ఆ డబ్బును వేరే అవసరాలకు మళ్ళించటానికి వేసిన ఎత్తుగడ అని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చేసే అప్పును పట్ణణాలు, నగరాలలోని ప్రజలే భరించాలి. దానికోసం మున్సిపల్‌ సంస్థలు పట్టణ ప్రజలపై పన్నుల భారం వేసే అవకాశం ఉంది. ఇది ప్రజలకు భారంగా మారబోతున్నది. అదే విధంగా భవిష్యత్తులో స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులను శాశ్వితంగా ఎగ్గొట్టడానికి ఇది మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ కారణాలన్నింటి రీత్యా రాష్ట్ర ప్రభుత్వం ఋణం కోసం విడుదల చేసిన ఈ జీ.వోను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ వ్యతిరేకిస్తున్నది. పట్టణ స్థానిక సంస్థలను అప్పులలో ముంచటానికి, ప్రజలపై భారాలను మోపటానికి ఉద్దేశించిన ఈ జీ.వో ను తక్షణమే ఉప సంహరించుకోవాలని, నగరాలలో పట్టణాలలో ఈ ఆరు పనులకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది.

వి.సాంబి రెడ్డి                                                                               యం.వి. ఆంజ‌నేయులు
అధ్య‌క్షులు                                                                                       కార్య‌ద‌ర్శి













Friday 3 August 2018

మున్సిప‌ల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని అప్ర‌జాస్వామికంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌టంపై గ‌ళం విప్పిన టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్

03.08.2018 న టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్ ప్రెస్‌మీట్‌లో విడుద‌ల‌చేసిన ప్రెస్ నోట్‌

ప్రచురణార్ధం:                                                                                    తేదీ:03.08.2018 
విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ తీర్మానాన్ని రద్దు చేసి మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.వో. ను తక్షణమే ఉపసంహరించుకోవాలని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీకి లేఖ వ్రాశింది. విజయవాడ నగరంలో బృందావన్‌ కాలనీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన 1052.86చ.గ.ల స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి కేటాయించాలని కోరుతూ గత ఏప్రిల్‌లో మున్సిపల్‌ కమీషనర్‌ నగరపాలక సంస్థ కౌన్సిల్‌లో ప్రతిపాదన ప్రవేశపెట్టారు. ఆ ప్రతిపాదనను నగరపాలక సంస్థ కౌన్సిల్‌ తిరస్కరిస్తూ తీర్మానించింది. ఆస్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ కడితే కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుందని కౌన్సిల్‌ తీర్మానించింది. ప్రతిపాదనను తిరస్కరిస్తూ కౌన్సిల్‌ తీర్మానించిన విషయాన్ని కమీషనర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కౌన్సిల్‌ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ, ఆ స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి కేటాయిస్తూ 23.07.2018న జీ.వో.నెంబరు 707ను జారీ చేసింది. ఈ విషయంలో మున్సిపల్‌ కౌన్సిల్‌ చేసిన తీర్మానాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ఆలేఖలో పేర్కొన్నది.

మున్సిపల్‌ కౌన్సిల్‌ చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలంటే కౌన్సిల్‌ తీర్మానం మున్సిపల్‌ చట్టాన్ని గాని, ఇతర చట్టాలనుగాని అతిక్రమించేదిగా ఉండాలి. లేదా ఆతీర్మానం కార్పొరేషన్‌కు నష్టం కలిగించేదిగా ఉండాలి. లేదా ప్రజలకు, ప్రజారోగ్యానికి, ప్రజల భద్రతకు ప్రమాదం కలిగించేదిగా ఉండాలి. ఈ స్థలం విషయంలో కౌన్సిల్‌ చేసిన తీర్మానం కార్పొరేషన్‌కు నష్టంగాని, ప్రజలకు, ప్రజారోగ్యానికి, ప్రజల భద్రతకు ప్రమాదం కలిగించేదిగాలేదు. పైగా కార్పొరేషన్‌కు లాభం చేకూర్చేదిగా ఉంది. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీ.వో వలన కార్పొరేషన్‌కు నష్టం కలుగుతుంది. కౌన్సిల్‌ తీర్మానించిన విధంగా షాపింగ్‌ కాంపెక్స్‌ కడితే కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుంది. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఇస్తే వచ్చే ఆదాయంపోగా, ఆ స్థలాన్ని కార్పొరేన్‌ శాశ్వితంగా కోల్పోతుంది. ఇది కార్పొరేషన్‌కు తీరని నష్టం. ఈ విషయాన్ని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ఈ లేఖ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. కౌన్సిల్‌ చేసిన తీర్మానం మున్సిపల్‌ చట్టాన్నిగాని, ఇతర చట్టాన్నిగాని అతిక్రమించటంలేదు. ఈ విషయంలో చట్టాన్ని అతిక్రమించింది రాష్ట్ర ప్రభుత్వం తప్ప మున్సిపల్‌ కౌన్సిల్‌ కాదు. అందువలన జీ.వో.చట్టవిరుధ్ధమని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ఆలేఖలో పేర్కొన్నది.

మున్సిపల్‌ కౌన్సిల్‌ చేసిన తీర్మానాన్ని రద్దు చేసి, ఆ స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినకారణాన్ని కూడా టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ఆక్షేపించింది. ''క్రొత్తగా ఏర్పడిన రాష్ట్రం ముందు ఉన్న సవాళ్లను దృష్టిలో పెట్టుకొని, శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని విజయవాడలో ఏర్పాటుచేయటం ద్వారా దైవాశీస్సులు పొందటం సముచితంగా ఉంటుందని ఈ స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఇవ్వాలని నిర్ణయించామని'' రాష్ట్ర ప్రభుత్వం ఆ జీ.వో.లో పేర్కొన్నది. వ్యక్తులకు సంబంధించిన నమ్మకాలను, ప్రభుత్వం ప్రజలపై రుద్దటం తప్పని ఆ లేఖలో పేర్కొన్నది. ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్య లౌకిక సూత్రాల ఆధారంగా ఏర్పడిన భారత రాజ్యాంగ విలువలను పెంపొందించేదిగా ఉండాలే తప్ప, వ్యక్తిగత నమ్మకాలకోసం పనిచేసేదిగా ఉండరాదని ఆలేఖలో స్పష్టం చేసింది. ప్రజోపయోగమైన మున్సిపల్‌ స్థలాన్ని మత సంస్థలకు ఇవ్వటం లౌకిక తత్వానికి వ్యతిరేకమని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది.

వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.వో ప్రజాస్వామ్య విరుధ్ధమని, రాజ్యాంగ విరుధ్దమని, చట్ట విరుధ్ధమని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ఆలేఖలో స్పష్టం చేసింది. తక్షణమే ఈ జీ.వోను ఉపసంహరించు కోవాలని, కౌన్సిల్‌ చేసిన తీర్మానాన్ని పునరుధ్దరించాలని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేసింది. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ రాష్ట్రప్రభుత్వం కౌన్సిల్‌ తీర్మానాన్ని రద్దు చేయటంపై స్పందించాలని ఎం.ఎల్‌.ఏలకు, కార్పొరేటర్లకు, రాజకీయ పార్టీలకు టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేస్తున్నది. 

వి.సాంబిరెడ్డి                                                                    యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                                          కార్యదర్శి 

Thursday 19 July 2018

19.07.2018 న టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్ ప్రెస్‌మీట్‌లో విడుద‌ల‌చేసిన ప్రెస్ నోట్‌


విజయవాడ నగరంలో పెంచిన నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ నగరపాలక సంస్థ పాలకులను డిమాండు చేస్తున్నది. నగరంలో నీటి చార్జీలు డ్రైనేజి చార్జీలు గత 5 ఏళ్ల కాలంలో 40 శాతం పెరిగాయి. 5 ఏళ్ల క్రితం స్పెషలాఫీసర్‌ పాలనలో నీటి చార్జీలను ఆస్తి పన్నుతో లింకు పెట్టారు. అపార్టుమెంట్లకు నీటి శ్లాబులు మార్చారు. రేట్లు పెంచారు. ఒక్కొక్క మరుగుదొడ్డికి రు.15లుగా ఉన్న డ్రైనేజి చార్జీనిరు.30లకు పెంచారు. ఇది చాలదన్నట్టు మరల మరల పెంచే పని లేకుండా ఏటా 7 శాతం ఆటోమేటిక్‌గా పెెరిగే నిబంధనను పెట్టారు. ఇప్పుడది తడిచి మోపెడై 40 శాతానికి పెరిగింది. రాబోయేకాలంలో ఇంకా వేగంగా పెరుగుతుంది. ఇప్పటికే భారం అనుకుంటుంటే మరల నీటి చార్జీలను పెంచటానికి రాష్ట్ర ప్రభుత్వమే జి.వో. నెం. 159 ని విడుదల చేసింది. ఈ జి.వో ఆధారంగా త్వరలో నీటి చార్జీలు ఇంకా పెంచబోతున్నారు. ఈ జి.వో ప్రకారం నీటి చార్జీలు వ్యక్తిగత నివాస గృహాలకు ఆస్తి పన్ను నెలకు రు.250/-ల లోపుఉంటే 50 శాతం, నెలకురు.250/-లకు పైన ఉంటే 100 శాతం, అపార్టుమెంట్లకు 150 శాతం పెంచబోతున్నారు. పరిశ్రమలకు 150 శాతం, వాణిజ్య సముదాయాలకు 200శాతం పెంచబోతున్నారు. 
2014 ఎన్నికలకు ముందు నీటిచార్జీలు, డ్రైనేజి చార్జీలు పెంచటం ఘోరమని,ఆస్తి పన్నుతో లింకు పెట్టడం తప్పని, ఏటా 7 శాతం పెంచటం మరీ అన్యాయమని తెలుగు దేశంవారు ఆందోళనలు చేశారు. వీధులలో బ్యానర్లు పట్టుక తిరిగారు. తాము అధికారంలోకి వస్తే ఈ పెంపుదలను రద్దు చేసి, స్పెషలాఫీసర్‌ పాలనకు ముందున్న రేట్లనే అమలు చేస్తామన్నారు. నమ్మి ఓట్లేయమన్నారు. జనం ఓట్లేశారు. వారు అధికారంలోకి వచ్చారు. అంతే నేటివరకు పెంపుదల విషయంలో ఒక్క అంశంకూడా మార్చలేదు. మార్చమని కౌన్సిల్‌ ఎజెండాలో పెడితే ఏదో విధంగా దాటేశారు తప్ప తగ్గించటానికి కనీసం తీర్మానం కూడా చేయలేదు. నీటి చార్జీలను ఆస్తి పన్నుతో లింకుపెట్టడాన్ని అలాగే అపార్టుమెంట్లకు నీటి శ్లాబులు మార్చటం, రేట్లు పెంచటంలాంటివాటిని రద్దుచేయటంమాట అటుంచి కనీసం ఏటా 7 శాతం పెంపుదల నిబంధనను కూడా రద్దు చేయలేదు. ఇది చాలదన్నట్లు నేటి తెలుగు దేశం ప్రభుత్వమే నీటి చార్జీలను పెంచటానికి జి.వో. నెం. 159 ని విడుదల చేశారు. ఇది ఓట్లేసిన జనాన్ని దగా చేయటమేనని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. 
ఇప్పటివరకు నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు స్థానిక సంస్థలు నిర్ణయిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి నీటి చార్జీల ధరల నిర్ణయాన్ని తన చేతులలోకి తీసుకుంటున్నది. త్వరలోనే డ్రైనేజి చార్జీలను కూడా రాష్ట్ర ప్రబుత్వమే లాగేసుకో బోతున్నది. ఇప్పటికే ఆస్తిపన్నును రాష్ట్ర ప్రభుత్వం తన చేతులలోకి తీసుకున్నది. ఇది స్థానిక సంస్థల హక్కులను హరించటమే అవుతుంది. ఇది ప్రజాస్వామ్యవిరుధ్ధం. 
ఇప్పటికైనా సరే నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలని, స్పెషలాఫీసర్‌ పాలనకు ముందున్న చార్జీలనే వర్తింప జేయాలని, నీటి చార్జీలను ఆస్తిపన్నుతో ముడిపెట్టే విధానాన్ని రద్దు చేయాలని, బిల్లులు ఏడాదికి ఒకేసారి కాకుండా గతంలో మాదిరిగానే ప్రతి 6 నెలలకొకసారి ఇవ్వాలని, జి.వో. నెం. 159 ని రద్దు చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది. ఆస్తిపన్నులు, నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల నిర్ణయాధికారం కార్పొరేషన్‌కే ఉంచేవిధంగా పోరాడాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ నగర మేయర్‌, కార్పొరేటర్లను, ఎం.ఎల్‌.ఏలను కోరుతున్నది. 
వి.సాంబిరెడ్డి                                                        యం.వి.ఆంజ‌నేయులు
అధ్య‌క్షులు                                                              కార్య‌ద‌ర్శి



Saturday 14 April 2018

Press Note released at Press meet on 14.4.18

14.04.2018 న టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ విడుదల చేసిన ప్రెస్‌ నోట్‌

ప్రస్తుతమున్న నగరాలు, పట్టణాలలో  సౌకర్యాలు కల్పించటం కోసం ఏమాత్రం చొరవ చూపని రాష్ట్ర ప్రభుత్వం, ఒక్క భవనం కూడా పూర్తికాని అమరావతిలో ఎప్పుడో కల్పించబోయే సౌకర్యాల కోసం కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని ఖర్చుపెట్టి సదస్సులు నిర్వహించటం  ఎవరి ప్రయోజనం కోసమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది. మన రాష్ట్రంలో మున్సిపల్‌ పట్టణాలు, నగరాలు 110  ఉన్నాయి. వీటిలో 2011 జనాభాలెక్కల ప్రకారం 1 కోటీ 36 లక్షల మంది నివశిస్తున్నారు. దాదాపు 30 లక్షల కుటుంబాలున్నాయి. ఈ నగరాలన్నీ మౌలిక సదుపాయాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. వేసవిలో అనేక పట్టణాలలో నీటి కొరత తీవ్రంగా తలెత్తుతున్నది.  అనేక పట్టణాలు నగరాలలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రరూపం దాల్చుతున్నది. పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు లేవు.  సరైన రోడ్లు లేవు. పార్కింగ్‌ సౌకర్యాలు లేవు. సరైన మురుగునీటి వ్యవస్థలేదు. పారిశుధ్యం పరిష్కారానికి దీర్ఘకాలిక చర్యలు లేవు. కాలుష్య నివారణకు చర్యలు లేవు. పబ్లిక్‌ రవాణా వ్యవస్థ కుంచించుక పోతున్నది. విద్య వైద్యం అందుబాటులో లేకుండా పోతున్నది. ఉపాధిó లభించే అవకాశాలు తగ్గిపోతున్నాయి. అనేక చోట్ల పాఠశాలలకు భవనాలు లేవు. అద్దెలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. గృహ సమస్య తీవ్రంగా ఉంది. ఇలా పట్టణాలు, నగరాలలో ఉండే ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.   నివాసయోగ్య పట్టణంగా రూపొందించడం కోసం ప్రతి పట్టణానికి ఒక నిర్థిష్టమైన ప్రణాళిక ఉండాలి. అలాంటి ప్రణాళికలు లేవు. ఇవన్నీ  పట్టించుకోకుండా, వీటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టకుండా, ఎప్పుడో వచ్చే అమరావతికోసం సదస్సులు నిర్వహించటం, హాపీ సిటీ డిక్లరేషన్‌ పేరుతో తీర్మానాలు చేయటం, ఇప్పటికే పట్టణాలలో నివసిస్తున్న ప్రజలను పరిహసించటమేనని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది. ఈసదస్సు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగారు రాజధాని అమరావతిని అత్యంత నివాస యోగ్యమైన, పరిశుభ్రమైన వాతావరణం కలిగిన నగరంగా తీర్చిదిద్దుతామని, అన్నీ బ్యాటరీ వాహనాలే వాడతామని, 70 నుండి 80 శాతం ప్రజా రవాణావ్యవస్థ ద్వారా రవాణా జరుపుతామని, సైకిల్‌ ట్రాక్‌లు నిర్మిస్తామని, సౌరవిద్యుత్‌ను పూర్తిస్థాయిలో వినియోగిస్తామని అన్నారు. ఇలా అమరావతిలో కల్పించే అనేక  సౌకర్యాలగురించి ఏకరువు పెట్టారు. ఇవన్నీ ఇప్పటికే  పట్టణాలలో నివసిస్తున్న ప్రజలకు అవసరంలేదా అని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది.

పట్టణాలలో నగరాలలో సమస్యల పరిష్కారాలకోసం తగిన చర్యలను రూపొందించటానికి ఆర్కిటెక్‌లు, ఇంజనీర్లు, పట్టణ సమస్యలపై పని చేస్తున్న అనుభవజ్ఞులైన అధికారులు, పట్టణ సమస్యలై పనిచేస్తున్న నాన్‌ గవర్నమెంటల్‌ ఆర్గనైజేషన్‌లు కావాలి. అంతేకాని జగ్గీ వాసుదేవ్‌ లాంటి ఆధ్యాత్మిక గురువులు కాదు. పచ్చని అడవులను, పంటపొలాలను నాశనం చేస్తూ పచ్చదనాన్ని గురించి వల్లించటం హాస్యాస్పదం. అదే విధంగా మన పట్టణాలను నగరాలను సౌకర్యవంతంగా రూపొందించటానికి ఉపయోగపడేది మన దేశపు ఆర్కిటెక్‌లు, ఇంజనీర్లే తప్ప విదేశీ సంస్థలుకావు.  ఇప్పటికైనా ఇటువంటి జిమ్మిక్కులు మాని, ముందుగా ఇప్పటికే  పట్టణాలలో నివసిస్తున్న  ప్రజల సమస్యల పరిష్కారంకోసం ఆచరణాత్మక ప్రణాళికలు రూపొందించాలని, అందులో ఖచ్చితంగా మన దేశీయ ఆర్కిటెక్‌లు, ఇంజనీర్లు, పట్టణ సమస్యలపై పని చేస్తున్న అనుభవజ్ఞులైన అధికారులు, పట్టణ సమస్యలై పనిచేస్తున్న నాన్‌ గవర్నమెంటల్‌ ఆర్గనైజేషన్‌లను, వివిధ ప్రజా సంఘాలను, ట్రేడ్‌ యూనియన్లను, రాజకీయపార్టీలను భాగస్వాములను చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నది.                                                   

వి.సాంబిరెడ్డి                            యం.వి.ఆంజనేయులు
   అధ్యక్షులు కార్యదర్శి











Wednesday 7 February 2018

Press Meet on 06.02.2018

కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా మన రాష్ట్రంలో ఈనెల 8 వతేదీన జరిగే రాష్ట్ర బంద్‌కు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ మద్దత్తునిస్తున్నది. బడ్జెట్‌లో పట్టణాలకు, నగరాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు కేవలం కంపెనీలను బాగు చేయటానికే తప్ప పట్టణ ప్రజలకు నేరుగా ఉపయోగపడేవిధంగా లేవు. స్మార్ట్‌ సిటీ క్రింద ఎంపిక చేసిన 99 నగరాలకు రు.2.04 లక్షలకోట్లు కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు. స్మార్ట్‌ సిటీలకు ఇచ్చే నిధులు నేరుగా పట్టణాలలో పనులు నిర్వహించటానికి రావు. స్మార్ట్‌ సిటీ నిబంధనల ప్రకారం నగరాన్ని కంపెనీలకు అప్పగిస్తారు. ఈ కంపెనీలు నగరంలో పనులు చేసి, వాటికి అయిన ఖర్చును, లాభాలను ప్రజలనుండి రాబట్టుకుంటాయి. ఇప్పుడు కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించిన రు.2.04 కోట్లు ఈ కంపెనీలకు పెట్టుబడిగా చేరి, నగర ప్రజలతో వ్యాపారం చేసుకోవటానికి మాత్రమే ఉపయోగపడతాయి తప్ప నేరుగా నగర ప్రజలకు ఉపయోగపడవు. కాని ప్రజలకు ఎంతోకొంత చేరే అమృత్‌ పథకానికిమాత్రం కేవలం రు.6000కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది పట్టణ ప్రజలను వంచించటమేనని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది.
కేంద్ర ఖజానాకు ఎగ్గొట్టిన రు.7 లక్షల కోట్లు పన్నులనుగాని, బ్యాంకులకు ఎగ్గొట్టిన రు.8 లక్షల కోట్ల బకాయిలను రాబట్టడానికి కాని ఈ బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు లేవు. గత సంవత్సరం కార్పొరేట్‌ కంపెనీలకు సుమారు రు6 లక్షలకోట్లు రాయితీలిచ్చారు. మరల ఈ సంవత్సరం బడ్జెట్‌లో కూడా కొన్ని రాయితీలు ప్రకటించారు. కాని ఉద్యోగులు ఆకాంక్షించిన విధంగా ఆదాయపు పన్ను మినహాయింపులు మాత్రం ఇవ్వలేదు. ఎం.పి.లకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆటోమేటిక్‌గా జీతాలు పెరిగేవిధంగా ఈ బడ్జెట్‌లో ఏర్పాటు చేసుకున్నారు. పెట్రోలు డీజిల్‌ మీద లీటరుకు రు.8లు పన్ను తగ్గించారు. డ్యూటీ సెస్‌ పేరుతో లీటరుకు రు.8లు విధించారు. ఇవన్నీ ప్రజాధనాన్ని కొల్లగొట్టేవిగా ఉన్నాయని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది.
ఈ బడ్జెట్‌ రాష్ట్ర విభజన హామీలను ఏమాత్రం నెరవేర్చేదిగా లేదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. మొదటి సంవత్సరపు బడ్జెట్‌ లోటు, రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చటం, రాష్ట్రానికి ప్రత్యేక ¬దా, పోలవరం డ్యాం నిర్మాణం, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక అభివృధ్ధికి నిధులు, రాష్ట్రంలో ప్రత్యేక రైల్వే జోన్‌, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, మెట్రో రైళ్ళు ఇవన్నీ విభజన హామీలు. వీటిలో కొన్ని చట్టంలో ఉన్నవి వున్నాయి. కొన్ని పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు 2 సంవత్సరాలు రు.50 కోట్లు ఇచ్చారు. ఆతర్వాత అదీలేదు. ఒరిస్సాకోసం మన రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్‌ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా ఐదేళ్ళు కాదు పదేళ్ళు కావాలని డిమాండు చేసింది ఈ బీ.జే.పీ. వారే. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక ¬దా ఇచ్చేది లేదు పొమ్మన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. చివరకు అదీ లేదు. పోలవరం నిర్మిస్తామన్నారు. దానికి కావలసిన నిధుల కేటాయింపులేదు. ఆంధ్రలో మెట్రో రైళ్ళు వదిలేసి, ఇప్పటికే నడుస్తున్న బెంగుళూరు మెట్రోరైలుకు రు.17,000కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో రైల్వే ట్రైనింగ్‌ సెంటర్‌ పెడతామన్నారు. దానిని గాలికొదిలేసి, గుజరాత్‌లోని వడోదరాలో రైల్వే యూనివర్శిటి ఏర్పాటుకు నిధులు కేటాయించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదు.
                   రాష్ట్రానికీ, రాష్ట్రంలోని పట్టణాలకు, పట్టణ ప్రజలకు, ఉద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించే స్థితిలో లేదని స్పష్టమవుతున్నది. ఈనేపధ్యంలో రాష్ట్ర ప్రజలు ఆంధోళనాబాట పట్టడం మినహా వేరే మార్గం లేదు. అందుకే ఈ నెల 8 వతేదీన జరిగే రాష్ట్ర బంద్‌కు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ మద్దత్తునిస్తున్నది. నగరంలోని పన్ను చెల్లింపుదారులందరూ ఈ బంద్‌లో పాల్గొని జయప్రదం చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేస్తున్నది.

వి.సాంబిరెడ్డి                                                          యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                                         కార్యదర్శి