Sunday 18 December 2016

విజయవాడ, గుంటూరు నగరాలో మౌలిక సదుపాయాల ప్రైవేటీక‌ర‌ణ‌


ప్రచురణార్ధం:                                                                                                                 తేదీ:18.12.2016 



విజయవాడ, గుంటూరు నగరాలో మౌలిక సదుపాయాలన్నింటినీ ప్రైవేటీకరించటం కోసమే '' విజయవాడ, గుంటూరు ఇన్ఫ్రాడెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌''ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఈ కార్పొరేషన్‌ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. 
రాష్ట్రంలోని నగరాలను పట్టణాలను ప్రైవేటీకరించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన '' ఆంధ్ర ప్రదేశ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అస్సెట్‌ మేనేజ్‌ మెంట్‌ లిమిటెడ్‌ ( APUIAML) '' అనే కంపెనీని గత జులై నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ రాష్ట్రంలో ఉన్న అన్ని నగరాలు, పట్టణాలలో జరిగే పనులకు సంబంధించిన ప్రాజెక్టులను రూపొందిస్తుంది. కావలసిన ఆర్ధిక వనరులను ఈ కంపెనీయే సమకూర్చుకుంటుంది. పట్టణ ప్రాంతాలకు నీటి సరఫరా, మురుగునీటి పారుదల, పట్టణ ప్రాంత రవాణా, ఘనవ్యర్ధాల నిర్వహణ, ఆకర్షణీయ నగరాల ఏర్పాటు, జలవనరుల సంరక్షణ, నదీ అభిముఖ ప్రాంతాల అభివృధ్ధి తదితర ప్రాజెక్టులను ఈ కంపెనీ చేపడుతుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలకు, నిర్వహణకు అయ్యే ఖర్చుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వవు. పూర్తిగా ఆ నగర ప్రజలనుండే వసూలు చేస్తారు. ఈ కంపెనీకి అనుబంధంగానే విజయవాడ, గుంటూరు ఇన్ఫ్రాడెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌'' ఏర్పాటు చేస్తున్నారని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఆ కంపెనీ ఏర్పాటు చేస్తే విజయవాడ, గుంటూరు నగరాలలో ఉండే అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఈ కంపెనీ క్రిందకు వెళ్లి పోతాయి. 
'' ఆంధ్ర ప్రదేశ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అస్సెట్‌ మేనేజ్‌ మెంట్‌ లిమిటెడ్‌ (APUIAML) '' అనేది కంపెనీ చట్టం ప్రకారం రిజిస్టర్‌ చేయబడిన కంపెనీ. ఈ కంపెనీలో ప్రైవేటు కంపెనీలు కూడా పెట్టుబడి పెట్టి ఈక్విటీ వాటాను పొందటం ద్వారా భాగస్వాములు కావచ్చు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, ప్రైవేటు కంపెనీలు పెట్టే పెట్టుబడులు అన్నీ కూడా ఈ కంపెనీలో మూలధనపు వాటాలుగానే ఉంటాయి. అంటే ఈ కంపెనీలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు వాటా దారులుగా ఉంటారన్నమాట. ఇక ఈ కంపెనీ చేపట్టే పనులు అన్నీ ప్రైవేటు భాగస్వామ్యం తోనే జరుగుతాయి. మంచి నీటి సరఫరా, మురుగునీటి పారుదల, పట్టణ ప్రాంత రవాణా, ఘన వ్యర్ధాల నిర్వహణ ఆకర్షణీయ నగరాల ఏర్పాటు, జల వనరుల సంరక్షణ, నదీ అభిముఖ ప్రాంతాల అభివృద్ది లాంటి పౌర సదుపాయాలన్నింటినీ వ్యాపారమయం చేసి, ప్రజల ముక్కుపిండి వసూలు చేసినప్పుడే లాభాలు వస్తాయి. మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణకు అయ్యే ఖర్చులతోబాటుగా వాటాదారుల లాభాలు కూడా నగర ప్రజలనుండే వసూలు చేస్తారు. ఎంత ఎక్కువగా వీటి చార్జీలు పెంచితే, ఎంత ఎక్కువగా ప్రజల మీద భారం వేస్తే అంత ఎక్కువగా లాభాలు వస్తాయి. పెట్టుబడి పెట్టిన వారికి అంత ఎక్కువగా డివిడెండ్లు వస్తాయి. అందువలన ఈ కంపెనీ వాటా దారుల లాభాలను దృష్టిలో పెట్టుకొని నగరంలో ఏర్పాటుచేసే పౌర సదుపాయాల చార్జీలను, ధరలను నిర్ణయిస్తారు. ఇది నగరాలలో. పట్టణాలలో ఉండే పేద, మధ్యతరగతి ప్రజలకు మరణ శాసనం కాబోతున్నది. ఈపథకంలో భాగంగా ముందుగా విజయవాడ గుంటూరు నగరాల ప్రజల బ్రతుకులను కంపెనీకి అప్ప జెప్పబోతున్నారు. దీని కోసమే APUIAMLకు అనుబంధంగా '' విజయవాడ, గుంటూరు ఇన్ఫ్రాడెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌''ను ఏర్పాటు చేస్తున్నారని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది. 
విజయవాడ, గుంటూరు నగరాలకు చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలను కలిపి '' విజయవాడ, గుంటూరు ఇన్ఫ్రాడెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌''ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌ చట్టాన్ని 2008 లోనే రద్దు చేశారు. కాని గ్రామాలలో ఇప్పటికీ లాండ్‌ సీలింగ్‌ చట్టం ఉంది. ఇప్పుడు చుట్టు ప్రక్కల గ్రామాలను గుంటూరు, విజయవాడలలో కలిపితే ఆ గ్రామాల భూములు లాండ్‌ సీలింగ్‌ చట్ట పరిధిలో ఉండవు. తద్వారా ఆ భూములు ధనవంతులకు, కంపెనీలకు అందుబాటులోకి వస్తాయి. ఆ గ్రామాల ప్రజలుకూడా నగరాల పరిధిలోకి వస్తారు. అప్పుడు ఈ కంపెనీకి మరిన్ని లాభాలు వస్తాయి. కేవలం భూములకోసం, కంపెనీ లాభాలకోసం ఈ నిర్ణయం చేశారని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. 
ఈ కంపెనీ ఏర్పాటు చేస్తే ప్రజల బ్రతుకులు కంపెనీల పాలవుతాయి. ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ప్రజలెన్నుకున్న మున్సిపల్‌ కార్పొరేషన్లు నిర్వీర్యమైపోయి ప్రజాసామ్యం నశించి పోతుంది. కేవలం కంపెనీల లాభాలకోసమే ప్రజలు బ్రతకవలసి వస్తుంది. ఇది నియంతృత్వచర్య. ప్రజలకు కావలసింది ప్రజాస్వామ్యపాలనే కాని కంపెనీల పాలనకాదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిరంకుశ నిర్ణయాన్ని ప్రతిఘటించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ విజయవాడ, గుంటూరు నగర ప్రజలకు పిలుపునిస్తున్నది. 


(వి.సాంబిరెడ్డి)                                                            (యం.వి.ఆంజనేయులు) 
అధ్యక్షులు                                                                       కార్యదర్శి

Thursday 8 December 2016

పెద్దనోట్ల రద్దు నల్లడబ్బు వెలికి తీయటం కోసమేనా?

 
పాలకులు తమ దోపిడీని కొనసాగించటం కోసం ప్రజలకు సమస్యలు సృష్టిస్తారు. ప్రజలకు సమస్యలు సృష్టించకపోతే తమ దోపిడీ కొనసాగదు. ఆ సమస్యలతో ప్రజలు బాధపడుతూ వారిలో అసహనం పెరుగుతున్నప్పుడు, ఆ సమస్యలకు తామే పరిఫ్కర్తలమని గొంతు చించుకొని అరుస్తారు.ప్రజలను నమ్మిస్తారు. ఆ సమస్యలనే ఆయుధంగా చేసుకొని మరింత దోపిడీకి పాల్పడతారు. అలాంటి వాటిలో ఒక సమస్యే నల్లధనం సమస్య.
.
పెద్దనోట్లు చెల్లవు అని ప్రధాని మోడీ ప్రకటించిన తర్వాత డబ్బులకోసం బ్యాంకుల వద్ద, ఎ.టీ.యంల వద్ద జనం పడిగాపులు పడటం తెలిసిందే. ఒక బ్యాంకువద్ద క్యూలో నిలబడిన ఒక వ్యక్తి అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ '' మమ్మల్ని కొల్లగొట్టి, దేశాన్ని దోచి నల్ల డబ్బు సంపాదించారు. వాళ్ళని వదిలేసి మమ్ములను ఎందుకు ఇక్కట్ల పాలు చేస్తున్నారు? మమ్ములను తిప్పలు పెడితే నల్లధనం బయటకు వస్తుందా? ఆ నల్లధనం బయటకు వచ్చినందున నాకొరిగేదేంటి? నల్లధనం బయటకు వస్తే మాదగ్గర కొల్లగొట్టిన డబ్బు మాకిస్తారా? ఇక మీదట మమ్మల్ని దోచుకు తినటం ఆపేస్తారా? దేశాన్ని దోచుకు తినటం ఆపేస్తారా?ఇక మీదట నల్లధనం ఏర్పడదా? అట్ల జరిగితే చెప్పమనండి ఏడాదైనా ఇబ్బంది పడతాం? ఎందుకు మాకీ తిప్పలు?'' అంటూ ప్రభుత్వంపై తిట్ల దండకాన్ని లంకించుకున్నాడు. ఇది సామాన్యుని ఘోష. ఒక సామ్యాడు వేశిన ఈ ప్రశ్నలు మనలను ఆలోచింప జేస్తున్నాయి. ఈ సమస్యపై కూలంకషంగా చర్చించమంటున్నాయి. పరిష్కారం వెతకమంటున్నాయి.

కేంద్ర ప్రభుత్వం రు.1000, రు.500లు నోట్లు రద్దు చేసినప్పటినుండి నల్లధనంపై చర్చ జోరుగా సాగుతున్నది. అసలు నల్లధనమంటే ఏమిటీ? పన్ను కట్టకుండా దాచిన సొమ్మును నల్లధనం అంటారని చాలమందిలో ఉన్న అభిప్రాయం. అంటే పన్ను కట్టి ఎంత దోచుకు తిన్నా అది నల్లధనం కాదు. తెల్ల ధనమే అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వంకూడా అదే చెబుతున్నది. '' 31 డిశంబరు 2016 లోపల తమదగ్గర ఉన్న నల్లధనాన్ని స్వఛ్ఛందంగా వెల్లడిస్తే 50 శాతం పన్ను వేస్తాం. అలా వెల్లడించకుండా మా ఆదాయపుపన్ను అధికారులు పట్టుకుంటే 85 శాతం పన్ను వేస్తాం'' అని ప్రకటించింది. అంటే డిశంబరు నెలాఖరులోపు నల్లధనం బయటకు తీసి 50 శాతం పన్ను కడితే మిగిలిన 50 శాతం తెల్లధనంగా మారి పోతుంది. అధికారులు పట్టుకుంటే 15 శాతం తెల్లధనంగా మారుతుంది. అంటే ''దోచుకోండి. మాకు కొంతపన్నుకట్టండి. మిగిలినది మీరు అనుభవించండి'' అని ప్రభుత్వం వారు సెలవిస్తున్నారు. అది అక్రమ డబ్బు అనుకున్నప్పుడు మొత్తం స్వాధీనం చేసుకోవాలి. అంతే కాని ''కొంతమాకివ్వండి. మిగిలినది మీరు అనుభవించండి'' అనటం ఏమిటి? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవటం అంటే ఇదే. దీనిని మరింత లోతుగా పరిశీలిద్దాం.

కరెన్సీ నోట్లు చెల్లకుండా చేయటాన్ని ఇంగ్లీషులో డీ-మోనిటైజేషన్‌ (Demonetization) అంటారు. ఈ పదం ప్రజలకు ఇప్పుడు బాగా తెలిసిన పదంగా మారింది. డీ-మోనిటైజేషన్‌ అనేది, మోనిటైజేషన్‌ (Monetization ) అనే పదానికి వ్యతిరేక పదం. సాధారణ భాషలో చెప్పాలంటే మోనిటైజేషన్‌ అనగా ఒక వస్తువు యొక్క విలువకు చెల్లుబాటయ్యే ధనరూపం ఇవ్వటం. మరి వస్తువు యొక్క విలువను ఎలా నిర్ణయిస్తారు? ఒక వస్తువుయొక్క విలువను ఆ వస్తువు తయారు చేయటానికి మనిషి వినియోగించిన శ్రమ ఆధారంగా నిర్ణయిస్తారు. కనుక మొత్తం వస్తువుల యొక్క విలువ ఎంతుందో లెక్కగట్టి ఆ విలువకు సమాన విలువతో చెల్లుబాటయ్యే విధంగా కరెన్సీ ఉండాలి. ఉత్పత్తి అయ్యే వస్తువుల విలువకంటే తక్కువ విలువకు కరెన్సీ ఉంటే వస్తువుల ధరలు పడి పోతాయి. ఎందుకంటే కొనటానికి జనం వద్ద కరెన్సీ ఉండదు. వస్తువుల ఉత్పత్తిదారులు నష్టపోతారు. దీనితో ఉత్పత్తి సాధ్యంకాదు. ఉత్పత్తి లేకపోతే సమాజం నడవదు. కనుక ఉత్పత్తి అయ్యే వస్తువుల విలువకంటే తక్కువ విలువకు కరెన్సీ ఉండకూడదు. ఇక ఉత్పత్తి అయ్యే వస్తువుల విలువ కంటే ఎక్కువ విలువకు కరెన్సీ ఉంటే వస్తువుల ధరలు పెరిగి పోతాయి. ఎందుకంటే కరెన్సీ నోట్లు ఎక్కువ ఉంటాయి. సరుకు తక్కువ ఉంటుంది. వినియోగదారుడు తాను పొందిన వస్తువు విలువకన్నా ఎక్కువ విలువను చెల్లించవలసి వస్తుంది. అంటే వినియోగదారుడు తాను పొందిన వస్తువు విలువతో బాటుగా అదనంగా కొంత ధనం కోల్పోతాడు. వస్తువు విలువతో బాటుగా ఆ అదనపు ధనం కూడా ఉత్పత్తిదారుని వద్దకు చేరుతుంది. ఈ అదనపు ధనం ఇతరులనుండి అధికంగా కాజేసిన ధనం. ఇది నల్ల డబ్బుగా ఉంటుంది.

అయితే ప్రభుత్వం దీనిని నల్లడబ్బుగా పరిగణించటం లేదు. కేవలం పన్ను కట్టకుండా ఉంచుకున్న ధనాన్ని మాత్రమే ప్రభుత్వం నల్లడబ్బుగా పరిగణిస్తున్నది. ఇది తప్పు. ప్రస్తుతం మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల విలువకంటే ఎక్కువ విలువకు కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. అందుకే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వస్తువుల ధరలు పెంచటం కోసం, కంపెనీలకు లాభాలు చేకూర్చటం కోసం ప్రభుత్వమే కరెన్సీనోట్లు విపరీతంగా ముద్రించింది. ఈ అదనపు ధనం ఉత్పత్తిదారుల వద్దకు విపరీతంగా చేరుతున్నది. ఉదాహరణకు ఒక టూత్‌ పేస్టు ఉత్పత్తి చేసేవాడు తన టూత్‌ పేస్టు ధరను నిర్ణయించగలడు. రు.5 ల విలువగలిగిన టూత్‌ పేస్టును రు.40లకు అమ్మినా ప్రభుత్వానికి పన్ను కడితే అది తెల్లధనమే అవుతుంది. ఒక ఎరువుల కంపెనీవాడు 30 రు.లు విలువ చేసే ఎరువును 500రు.లకు అమ్మినా ప్రభుత్వానికి పన్ను కడితే అది తెల్లధనమే అవుతుంది. అది తెలుపైనా నలుపైనా నష్టపోతునష్టపోతున్నది వినియోగ దారులే. అలా వివినియోగదారులనుండి అధికంగా కాజేసిన ధనం పన్నుకడితే తెల్లధనం అవుతుంది. పన్ను కట్టకపోతే నల్లధనం అవుతుంది. అంతేతప్ప వినియోగదారులనుండి అదనంగా కాజేసే స్వభావంలో మాత్రం మార్పుఉండదు.

ఈ అదనపుధనం ఎవరివద్ద పోగుపడుతుంది? ఎవరు ధరలను నిర్ణయించగలుగుతారో వారివద్దే అదనపు ధనం పోగుపడుతుంది. మనదేశంలో కార్మికులకు ధరలు నిర్ణయించే అధికారంలేదు. కనుక కార్మికుల వద్ద పోగుపడే అవకాశంలేదు. ఇక తాను ఉత్పత్తి చేసిన పంటకు ధర నిర్ణయించే అధికారం రైతుకు లేదు. అందువలన ఆహారధాన్యాల ధరలు పెరుగుతున్నా, రైతుకు వచ్చేదేమీ లేదు. కనుకనే ధరల పెరుగుదల వలన పారిశ్రామిక వర్గాల వద్దకు ధనం విపరీతంగా చేరుతుంటే రైతులు మాత్రం చితికి పోతున్నారు. కనుక నల్లధనం పారిశ్రామిక వర్గాలు, వారి అనుమాయుల వద్ద విపరీతంగా పోగుపడుతున్నది. నల్లధనానికి ప్రధాన కారణం ఉత్పత్తి అయ్యే వస్తువుల విలువ కంటే ఎక్కువ విలువకు కరెన్సీనోట్లు ముద్రించటమే. వస్తువుల విలువను నిర్ణయించటంలో ఉన్న లోపమే నల్లధనం సృష్టికి మూలకారణం. కనుక నల్లధనం అంటే పన్ను ఎగవేశింది మాత్రమేకాదు. ప్రజలను కొల్లగొట్టి దాచింది నల్లధనం. ఇది ఏ ఆర్ధిక వేత్తా చెప్పడు. ''కొంతమాకివ్వండి. మిగిలినది మీరు అనుభవించండి'' అని పాలకులు చెప్పటాకి గల కారణం కరెన్సీ అంటే శ్రమ విలువ అని, అది ప్రజలదని గుర్తించకుండా, కరెన్సీ అంటే కేవలం సంపాదనేనన్న భావన పాలకులలో పాదుకొని ఉండటమే.

''పన్నుకడితే తెల్లధనం, పన్ను కట్టకుండా దాచుకుంటే అది నల్లధనం'' అనే ప్రభుత్వ నిర్వచనాన్నే తీసుకుని పరిశీలిద్దాం.
నల్లధనం బయటకు వచ్చినందున నాకొరిగేదేంటి? అని క్యూలో నిలబడిన వ్యక్తి అడిగిన ప్రశ్నకు పాలకుల సమాధానం చూద్దాం. నల్లధనం వెలికితీస్తే ప్రభుత్వానికి పన్ను రూపేణా ఆదాయం వస్తుందనీ, దీని ద్వారా దేశంలో అనేక అభివృధ్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని ఏలినవారు సెలవిస్తున్నారు. ఆ అభివృధ్ధిని అనుభవించే వారిలో నీవుకూడా ఉంటావు కదా అని ప్రశ్నిస్తున్నారు. వీరి వాదననే అంగీకరిద్దాం.

మోడీకి ముందు కూడా పన్నుల ఎగవేతలు ఈ దేశంలో ఉన్నాయి అయితే మోడీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ పన్ను ఎగవేతలు విపరీతంగా పెరిగి పోయాయని లోక్‌ సభలో ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే తెలియజెబుతున్నాయి. నవంబరు 18న, బీ.జే.పీ యం.పి కంభంపాటి హరిబాబు అడిగిన ప్రశ్నకు ( ప్రశ్న నెం. 640) కేంద్ర ఆర్ధిక శాఖ ఇచ్చిన లిఖిత పూర్వక సమాచారం ఈ క్రింది విధంగా ఉంది.

ఆర్ధిక సం||                        వసూలైన ప్రత్యక్ష పన్నులు            వసూలుకాని ప్రత్యక్ష పన్నులు
                                            (కోట్ల రూ.లలో)                               (కోట్ల రూ.లలో)
2013-14                                  638596                                      674916
2014-15                                  695792                                      827690
2015-16                                  742295                                      929972
2016-17 (సెప్టెంబరు వరకు)         377045                                      903048

పైఅంకెలు చూస్తే వసూలైన పన్నులకన్నా వసూలుకాని పన్నులు విపరీతంగా పెరిగి పోతున్నాయని స్పష్టం అవుతున్నది. ఈ ఎగవేతలు మోడీ పాలనా కాలంలో ఊపందుకున్నాయని ఈ లెక్కలు తెలియజేస్తున్నాయి. వసూలు కాని పన్నులు అంటే, ''ఆదాయాన్నీ, దానిమీద పన్నునూ'' నిర్ధారించిన తరువాత, నిర్ధారించిన పన్ను కట్టకుండా ఎగవేసిన పన్ను అన్నమాట. ''పన్ను కట్టకుండా దాచుకుంటే అది నల్లధనం'' అన్న ప్రభుత్వ నిర్వచనం ప్రకారం ఈ పన్నుకు సంబంధించిన ఆదాయం కూడా నల్లధనమే అవుతుంది. ఇలాంటి నల్లధనం ఉద్యోగుల వద్ద చేరదు. ఎందుకంటే ఉద్యోగులు పన్నులు ఎగవేసే అవకాశం ఏమాత్రంలేదు. ప్రతి ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌లోనే ఉద్యోగి యొక్క సంవత్సర ఆదాయం లెక్కించి దాని మీద పన్ను నిర్ధారించి, దామాషా ప్రకారం ప్రతినెలా వసూలు చేస్తారు. కనీసం ప్రతి 3 నెలలకొకసారి ఉద్యోగుల ఆదాయాన్ని సమీక్షించి ఆదాయాల పెరుగుదలను అంచనా వేసి పన్ను నిర్ధారిస్తారు. ఉద్యోగుల వద్దనుండి మార్చి 31 నాటికి ఆ సంవత్సరం ఆదాయంపై పూర్తిగా పన్ను వసూలు చేస్తారు. దీనిని బట్టి ఈ పన్నుల ఎగవేతకు పాల్పడింది ఉద్యోగులు కాదని, పారిశ్రామిక వేత్తలు, వారి అనుమాయులేనని స్పష్టమవుతున్నది.నిర్ధారించిన పన్నును కట్టలేదంటే, ఆపన్నుకు సంబంధించిన ఆదాయాన్ని, పన్ను కట్టకుండానే ఆ సంస్ధల యజమానులు అనుభవిస్తున్నారన్నమాట.

నిర్ధారించిన ఈ పన్నులను వసూలు చేయకపోగా, మోడీ పాలనా కాలంలో ఇదే పారిశ్రామిక వేత్తలకు 2014-15లో రు.5,54,349 కోట్లు, 2015-16లో రు.6,11,128 కోట్లు, 2016-17లో రు.6,67,907 కోట్లు పన్నుల రాయితీలిచ్చారు. పన్ను రాయితీలివ్వటమంటే దానర్ధం ఆ పన్నుకు సంబంధించిన ఆదాయాన్ని ఆ కంపెనీలు పన్ను చెల్లించకుండా అనుభవించడమే. ఖజానాకు రావలసిన పన్ను రాకుండా పోవటమే. నల్లధనం వెలికితీస్తే ప్రభుత్వానికి పన్ను రూపేణా ఆదాయం వస్తుందనీ, దీని ద్వారా దేశంలో అనేక అభివృధ్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చన్న పాలకుల ప్రచారంలో నిజాయితీ ఉంటే ముందుగా నిర్ధారించిన ఈ పన్నులను వసూలు చేయాలి. కంపెనీలకు ఇస్తున్న లక్షల కోట్లరూపాయల పన్ను రాయితీలను రద్దు చేయాలి. అప్పుడు ఖజానాకు పూర్తిగా ధనం చేకూరుతుంది. దేశంలో అనేక అభివృధ్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చు. ఒకవైపు నిర్ధారించిన పన్నులను వసూలు చేయకుండా, మరో వైపు లక్షలకోట్లరూపాయల పన్ను రాయితీలిస్తూ, తద్వారా ఖజానాను నష్టపరుస్తూ, వెలికి వస్తుందో రాదో తెలియని నల్లధనం మీద వచ్చిన పన్నుతో దేశాభివృధ్ధి చేస్తామనటం, దానికోసం పెద్ద నోట్లను రద్దు చేశామనటం బూటకం.

ఇక దేశాభివృధ్ధికి ధనం చేకూరే మరోమార్గం బ్యాంకుల ద్వారా సమకూరేధనం. మోడీ 2014 మే 29 న ప్రధానిగా అధికారం చేపట్టారు. అంటే ఆరోజున బీ.జే.పీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఏ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. మోడీ అధికారం చేపట్టేనాటికి బ్యాంకులలో ఉన్న మొండి బకాయీలు రు.2,50,643 కోట్లు. అది ఏ మాత్రం తగ్గక పోగా పెరిగి 2016 సెప్టెంబరు నాటికి రు.6,24,000 కోట్లు అయ్యింది. అంటే మోడీ అధికారంలోకి వచ్చిన రెండున్న సంవత్సరాలలో (6,24,000-2,50,643 ) రు.3,73,357 కోట్లు పెరిగాయి. అంటే 149 % పెరిగాయి. ఇది బ్యాంకులు రద్దు చేసిన రు.1,14,000 కోట్లు పోను మిగిలిన పెరుగుదల. రద్దు చేసిన ఈ రు.1,14,000 కోట్లు కలుపుకుంటే ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రజలసొమ్ము. ప్రజలసొమ్మును తీసుకొని ఎగవేస్తున్న పారిశ్రామిక వేత్తల ఆస్తులను జప్తుచేసి నిర్థాక్షిణ్యంగా వసూలు చేయటానికి బదులుగా వారి బకాయీలను రద్దు చేస్తున్నారు. ఈ ఎగ్గొట్టిన సొమ్ముకూడా నల్లడబ్బుగా మారుతున్నది. బ్యాంకు బకాయీలనే వసూలు చేయలేనివారు, నల్లధనాన్ని బయటకు తీసి దేశాభివృధ్ధి చేస్తామనటం హాస్యాస్పదం.

ప్రభుత్వ నిర్వచనం ప్రకారం ఏర్పడే నల్లడబ్బుకు మరో మార్గం, విదేశీ వ్యాపారం. విదేశీ వ్యాపారాలలో అసలు విలువ కన్నా తక్కువ లేదా ఎక్కువ విలువకు ఇన్‌వాయిస్‌లు చూపించటం ద్వారా నల్లడబ్బు ఏర్పడుతుంది. ఆ డబ్బు ఇక్కడి వ్యాపారికి ప్రధానంగా విదేశాలలో ముడుతుంది. అది ఎక్కువ భాగం ఆదేశాలలో ఉన్న తమ ఎకౌంట్లలోకి వెళుతుంది. కొంత భాగం తిరిగి మన దేశంలోకి మనదేశంలోకి పెట్టుబడుల రూపంలో వస్తుంది. ఇది ప్రధానంగా విదేశీ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా జరుగుతుంది. ప్రభుత్వాలు అనుమతిస్తున్న పార్టిసిపేటరీ నోట్ల విధానం, ద్వంద్వ పన్నుల ఒప్పందాలు, సరళీకరణ విధానాలు ఈ విధమైన నల్లడబ్బు ఏర్పడటానికి రాచమార్గాన్ని ఏర్పాటు చేశాయి.


నల్లడబ్బు ఎలా ఏర్పడుతుందో తెలుసుకున్నాము. ఇప్పుడు నల్లడబ్బు ఏఏ రూపాలలో అది ఉంటుందో చూద్దాం. సినిమాలలోనో, టీ.వీలలోనో చూపించిన విధంగా నల్లడబ్బు కట్టలు కట్టి, బీరువాలలో, పరుపుల క్రింద, దిండ్ల క్రింద దాచి ఉండదు. అలా ఉండేది చాలా కొద్ది భాగం మాత్రమే. అత్యధిక భాగం ఇతర రూపాలలోకి మారి పోతుంది. అందులో ప్రధానమైనవి భూమి మరియు నిర్మాణ రంగం. 1976లో ఆ నాటి కేంద్ర ప్రభుత్వం అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌ చట్టం చేసింది. ఈ చట్టప్రకారం మున్సిపాలిటీల స్థాయిని బట్టి పట్టణాలలో 1000 చ.మీ. లనుండి 2000 చ.మీ.లవరకు ఉండవచ్చు. అంతకు మించి ఒక వ్యక్తి కొనుక్కునే అవకాశంలేదు. కాని 1999లో వాజ్‌పేయి నాయకత్వంలోని బి.జే.పీ ప్రభుత్వం ఈ చట్టాన్ని సెంట్రల్‌ యాక్టు 15 ఆఫ్‌ 1999 ద్వారా రద్దు చేశింది. అయితే భూమి విషయాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి కనుక రాష్ట్రాలుకూడా ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టరద్దును ఆమోదించమని రాష్ట్రాలపై వత్తిడి తెచ్చింది. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈచట్టం రద్దును ఆమోదిస్తూ అసెంబ్లీలో 27.3.2008న తీర్మానం చేసింది. ఫలింతగా ఆంధ్ర, తెలంగాణాలలో పట్టణ భూపరిమితి చట్టం రద్దయింది. దీనితో డబ్బున్న వాళ్ళు పట్టణాలలో ఎంత భూమైనా కొనుక్కునే అవకాశం లభించింది. ఇది కేవలం నల్లడబ్బు ఉన్నవాళ్ళు ఆ డబ్బును భూమిరూపంలోకి మార్చుకోవటానికి అవకాశమిస్తూ తీసుకున్న చర్య. అయితే ఈ నల్ల డబ్బుకలిగిన వారికి ఇప్పటికే పట్టణాలలో ఉన్న భూమి చాలదు. అందుకే చుట్టు ప్రక్కల మండలాలలోని గ్రామాలను కలిపి గ్రేటర్‌ నగరాలుగా మార్చుతున్నారు. అప్పటికే మున్సిపాలిటీలుగా ఉన్న వాటిని మున్సిపల్‌ కార్పొరేషన్లుగా మార్చుతున్నారు. ఈవిధంగా గ్రామాలను పట్టణాలలో కలిపిన వెంటనే ఆగ్రామాల పరిధిలో ఉన్న భూములు పట్టణ భూములుగా మారి పోతాయి. అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌ చట్టం లేదు కనుక ఈ భూములను ఈ నల్ల కుబేరులు కొనుక్కొవచ్చు.

ఇక గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇదే తంతు నడుస్తున్నది. ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం 1973 ప్రకారం ఒక కుటుంబానికి మాగాణి 27 ఎకరాలు, మెట్టభూమి అయితే 54 ఎకరాలు వ్యవసాయ భూమి ఉండవచ్చు. కాని ఇటీవల కాలంలో ఈ చట్టానికి తూట్లు పొడిచారు. వందల ఎకరాల భూమిని కొంటున్నారు. నల్లధనం దాచినవారు మారుమూల గ్రామాలలో సైతం వ్యవసాయ భూములుకొన్నారు. కొంటున్నారు. కేవలం లక్ష రూపాయల విలువ చేయని భూములునుకూడా ఎకరం 30 లక్షలకు పైగా కొన్న సందర్భాలున్నాయి. కొన్ని చోట్ల కోట్లు పెట్టి కొన్నారు. ఈ కొనుగోళ్ళు కేవలం నల్లడబ్బును భూమి రూపంలోకి మార్చుకోవటం కోసం జరిగాయి తప్ప అక్కడేదో వ్యవసాయం చేద్దామని కాదనేది స్పష్టం. ఈ విధంగా అటు బీ.జే.పి. ఇటు కాంగ్రెస్‌లు నల్లడబ్బును భూమి రూపం లోకి మార్చుకోవడానికి తగిన ఏర్పాట్లు చేశాయి.

ఇక నల్ల డబ్బు మార్పిడికి మరో మార్గం బంగారం. గతంలో బంగారం అంటే ఆభరణాల రూపంలో ఉండేది. నల్లడబ్బు వేగం పెరిగిన తర్వాత అది బిస్కెట్ల రూపంలో ఉంది. దానికి ప్రభుత్వాలు విదేశాలనుండి బంగారం దిగుమతి చేసుకునే విధానాలు సరళీకరించటంతో, బంగారం లభ్యత పెరిగింది. బంగారాన్ని బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేసి దాచుకునే వేగంకూడా పెరిగింది. దాచుకోవటానికి లాకర్లు అందుబాటులో ఉండటంకూడా దీనికి దోహదం చేసింది. బంగారానికి నల్లడబ్బు వినియోగించడం పెరగటంతో బంగారం ధర కూడాపెరిగింది.

నల్లడబ్బు మార్చుకోవటానికి అవకాశమిచ్చిన మరోవిధానం విదేశీ మారక ద్రవ్య విధానం. విదేశాలకు తీసుకు వెళ్ళే డబ్బుపై అనేక పరిమితులను విధిస్తూ 1973లో ''ఫారన్‌ ఎక్సేంజ్‌ రెగ్యులేషన్‌ చట్టాన్ని'' రూపొందించారు. వాజ్‌పేయీ నాయకత్వంలో బీ.జే.పి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో ''ఫారన్‌ ఎక్సేంజ్‌ రెగ్యులేషన్‌ మెనేజ్‌మెంట్‌ చట్టం 1999'' ని తీసుకు వచ్చారు. ఆతర్వాత రిజర్వు బ్యాంకు ''లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీం'' ను ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం మనదేశం నుండి విదేశాలలో నివశించేవారు అక్కడి ఖర్చులకోసం ప్రతివ్యక్తి మన కరెన్సీతో 25,000 డాలర్లు కొనుక్కొని తీసుకెళ్లవచ్చు. ఈ నిబంధనను 4 ఫిబ్రవరి 2004న చేశారు.ఆతరువాత బీ.జే.పి. ప్రతిపక్షంలోకి వచ్చింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఈ పరిమితిని 50,000డాలర్లకు, ఆతరువాత 75,000 డాలర్లకు పెంచింది. ఈ నిబంధన వలన మన దేశ డబ్బు బ్లాక్‌ మనీ రూపంలో విదేశాలకు పోతుందని బీ.జే.పి.గోల పెట్టింది. అసలు ఈ విధానాన్నే రద్దు చేయాలని బీ.జే.పి డిమాండు చేసింది. 2014లో మరల బీ.జే.పి.అధికారంలోకి వచ్చింది. రద్దు చేయటం మాట అటుంచి ఈ మొత్తాన్ని జూన్‌ 3,2014 న 1,25,000డాలర్లకు, మే 26, 2015 నుండి 2,50,000 డాలర్లు (సుమారు 1 కోటి62 లక్షల రూపాయలు)కు పెంచారు. అంటే కుటుంబంలో 4గురు విదేశాలకు వెళితే సుమారు 7 కోట్ల రూపాయలు డాలర్ల రూపంలో విదేశాలకు తీసుకెళ్ల వచ్చు. ఒక అంచనా ప్రకారం ఈ విధానంద్వారా 2013-2014 లో రు. 10,700 కోట్లు, 2014-2015లో రు. 30,800కోట్లు, 2015-2016లో రు. 33,500 కోట్లు విదేశాలకు తరలివెళ్ళిందని అంచనా. ఇదంతా చేసింది బీ.జే.పి.నే.
నల్లడబ్బు ఎలా ఏర్పడుతుందో, ఏఏరూపాలలోకి మారి పోతుందో తెలుసుకున్నాం. మరి ఈ నల్లడబ్బు వెలికి రావాలంటే ఏం చేయాలి? నల్లడబ్బు వెలికి రావాలంటే 01. ముందుగా నల్లడబ్బు తయారీకి దోహదపడుతున్న విధానాలు మార్చాలి. వస్తువుల యొక్క విలువ ఎంతుందో లెక్కగట్టి ఆ విలువకు సమాన విలువతో చెల్లుబాటయ్యే విధంగా మాత్రమే కరెన్సీ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. 02.''మాకు కొంత పన్నుకట్టండి. మిగిలినది మీరు అనుభవించండి'' అనేవిధానానికి స్వస్తి పలికి, అది అక్రమ డబ్బు అనుకున్నప్పుడు మొత్తం స్వాధీనం చేసుకోవాలి. 03. ఇప్పటికే ఉన్న పన్ను బకాయీలను నిర్ధాక్షిణ్యంగా వసూలు చేయాలి. కంపెనీలకు ఇస్తున్న పన్ను రాయితీలను నిలిపి వేయాలి. 04. బ్యాంకులకున్న మొండి బకాయీలను అవరోహణా క్రమంలో వసూలు చేయాలి. వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి.05.లాండ్‌ సీలింగ్‌ చట్టాన్ని పునరుధ్ధరించాలి. ప్రతికుటుంబానికి ఎంత భూమి ఉందని తెలిసేవిధంగా పారదర్శక పధ్ధతులను రూపొందించాలి. 06 విదేశీ మారక ద్రవ్యవిధానం కఠినతరం చేయాలి. 07. బంగారం కొనుగోళ్ళపై సీలింగ్‌ కఠినంగా అమలు జరపాలి. 08. వీటన్నింటికి అనుగుణంగా చట్టాలను మార్చాలి.

ఇవన్నీ చేయకుండా కేవలం నోట్ల రద్దువలన నల్లధనం బయట పడుతుందనీ బీ.జే.పి. చెప్పటం ప్రజలను వంచించటమే. ఈ నాడు మనం చెప్పుకునే నల్లధనం సరళీకృత ఆర్ధిక విధానాల ఫలితం. సరళీకృత ఆర్ధిక విధానాలను మార్చకుండా నల్లధనం సమస్య పరిష్కారం కాదు.

అయితే మరి మోడీ ప్రభుత్వం ఈచర్య ఎందుకు తీసున్నట్లు? మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య నల్లధనాన్ని అరికట్టడం కోసం తీసుకున్న చర్య కానే కాదు. ''నల్ల ధనాన్ని అరికట్టడం కోసం'' అని చెప్పటం కేవలం ప్రజలను వంచించడం కోసమే. ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత ఆర్ధిక విధానాలలో భాగంగా స్వదేశీ, విదేశీ కంపెనీల కోసమే ఈ చర్య తీసుకున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ పెట్టుబడులను దేశంలోకి విపరీతంగా అనుమతించింది. అందులో ఒక ముఖ్యమైనది రిటైల్‌ రంగం ( అంటే చిల్లర వర్తకం)లోకి విదేశీ పెట్టుబడులను అనుమతించడం. దగ్గరలో ఉన్న చిల్లర దుకాణాల నుండి సరుకులు, రోడ్డు ప్రక్కన అమ్మేవారినుండి కూరలు కొనుక్కోవటం మన భారతీయులకు ఉన్న అలవాటు. ఈ అలవాటును అలా కొనసాగనిస్తే చిల్లర వర్తకంలోకి ప్రవేశించిన విదేశీ కంపెనీలకు లాభాలు రావు. అందువలన ప్రజల అలవాటును మాల్స్‌ వైపుకు మళ్ళించాలి. చివరకు తోటకూరకట్ట, కరివేపాకు కొనాలన్నా మాల్‌కు వేళ్ళేటట్లు చేయాలి. ఇది జరగాలంటే ప్రజలు డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు , మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌లు వినియోగించే విధంగా చేయాలి. అలా చేయాలంటే ప్రజల దగ్గర మారకం నోట్లు లేకుండా చేస్తే ప్రతివాడిలో డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌లు ఉపయోగించాలన్న ఆలోచన వస్తుంది. కార్డులతో సరుకులు కొనాలంటే దుకాణదారుల వద్ద స్వైపింగ్‌ మిషన్లు ఉండాలి. స్వైపింగ్‌ మిషన్లు పెద్ద దుకాణదారులే ఉంచగలరు. కనుక ప్రజలు తప్పనిసరిగా మాల్స్‌ వైపుకు మళ్ళుతారు. దీనితో చిల్లర దుకాణాలు మూతపడతాయి. నోట్ల రద్దు యొక్క లక్ష్యం నల్లధనాన్ని వెలికి తీయటం కాదు. చిల్లర దుకాణాలను మూయించడమే దీని లక్ష్యం. ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణా ముఖ్య మంత్రి కే.సి.ఆర్‌లు డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు , మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌లు వాడమని ప్రచారం చేయటం వెనుక అంతరార్ధం అదే.

-యం.వి. ఆంజనేయులు, కార్యదర్శి,   టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌, విజయవాడ
తేదీ: 28.11.2016



Monday 28 November 2016

నోట్ల రద్దు యొక్క లక్ష్యం నల్లధనాన్ని వెలికి తీయటం కాదు. చిల్లర దుకాణాలను మూయించడమే దీని లక్ష్యం.

నవంబరు 8 వతేదీ సాయంత్రం 1000 రు.లు, 500రు.లు నోట్లు చెల్లవని దేశ ప్రధాని నరేంద్ర మోడీ హఠాత్తుగా ప్రకటించాడు. అప్పటికే తమదగ్గర ఉన్న 1000 రు.లు, 500రు.లు నోట్లను డిశంబరు 31 లోపు బ్యాంకులలో మార్చుకోవచ్చని ప్రకటించారు. దానితో ప్రజలపాట్లు మొదలయ్యాయి. ప్రజలు పనులు వదలుకొని నగదు మార్పిడి కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాయవలసి వచ్చింది. పాత నోట్ల బ్యాంకులో వేసినప్పటికీ తగినంత నగదు బ్యాంకులలో లేకపోవటంతో డబ్బుతీసుకోవటంపై పరిమితి విధించారు. అయినా ప్రజల అవసరాలకు డబ్బులు అందలేదు. బ్యాంకులవద్ద నగదుకోసం పడిగాపులు పడి ఎదురు చూస్తూ 70 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. వత్తిడికి తట్టుకోలేక 12 మందికి పైగా బ్యాంకు అధికారులు, ఉద్యోగులు ప్రాణాలు వదిలారు. చిన్న పరిశ్రమలు, చిరు వ్యాపారాలు, చేతివృత్తులు నిలచి పోయాయి. పరిశ్రమలలో ఉత్పత్తి నిలచి పోతున్నది. పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. రైతులవద్ద వ్యవసాయానికి డబ్బులేక పోవటంతో పంటలు ఎండిపోతున్నాయి. ప్రయాణాలు నిలచి పోయాయి. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు, వైద్యం చేయించుకోలేక రోగులు తల్లడిల్లుతున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్తే అతలాకుతలమవుతున్నది. ఇదే కొంత కాలం కొనసాగితే దేశ ఆర్ధిక వ్యవస్త కుప్పకూలిపోతుందని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే కొనసాగితే దేశంలో అల్లర్లు చెలరేగే అవకాశముందని సుప్రింకోర్టు వ్యాఖ్యానించింది.
ఇంత హఠాత్తుగా ప్రభుత్వం ఎందుకు నిర్ణయంతీసుకున్నది? దేశంలో విపరీతంగా నల్లధనాన్ని వెలికితీయటం కోసమే ఈ నిర్ణయంతీసుకున్నామని ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడు, ఇతర మంత్రులు పదేపదే చెబుతున్నారు. ప్రజలు కూడా ఏమో నల్ల్లధనం వెలికి తీయటం కోసం ఈ చర్య తీసుకున్నారేమో అని భ్రమపడేవారూ గణనీయంగానే ఉన్నారు. ఈ చర్య వెనుక ఉన్న ఉద్దేశ్యం నల్లధనం వెలికితీయటం కాదని, దీనికి వెనుక కొంతమంది ప్రయోజనాలున్నాయని అంటే తమపై ఎక్కడ జాతివ్యతిరేకులుగా ముద్ర వేస్తారోనని కొంతమంది ఆర్థిక వేత్తలుకూడా ఇది నల్ల్లధనం వెలికి తీయటం కోసం తీసుకున్న చర్యేనని, కాకపోతే కొన్ని చర్యలు చేపట్టి ఉండాల్సిందేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అందుకే ఈ విషయాన్ని కూలంకషంగా పరిశీలించాలి.
నల్లధనం ఎక్కడ ఉన్నది, ఎలా ఉత్పత్తి అవుతుందో ముందుగా పరిశీలిద్దాం. పన్నుకట్టకుండా దానిన సొమ్మును నల్లధనం అంటారని చాలమందిలో ఉన్న అభిప్రాయం. అంటే పన్ను కట్టి ఎంత దోచుకు తిన్నా అది నల్లధనం కాదు. తెల్లధనమే అవుతుంది. ఇది తప్పు. కరెన్సీ నోట్లు చెల్లకుండా చేయటాన్ని ఇంగ్లీషులో డీ మోనిటేజేషన్‌ (సవఎశీఅవ్‌ఱఓa్‌ఱశీఅ) అంటారు. డీ మోనిటేజేషన్‌ అనేది మోనిటైజేషన్‌కు (వీశీఅవ్‌ఱఓa్‌ఱశీఅ ) వ్యతిరేక పదం. సాధారణ భాషలో చెప్పాలంటే మోనిటైజేషన్‌ అనగా ఒక వస్తువు యొక్క విలువకు చెల్లుబాటయ్యే ధనరూపం ఇవ్వటం. అంటే వస్తువు యొక్క విలువకు సమాన విలువతో చెల్లుబాటయ్యే విధంగా కరెన్సీ ఉండాలి. ఉత్పత్తి అయ్యే వస్తువుల విలువకంటే తక్కువ విలువకు కరెన్సీ ఉంటే వస్తువుల ధర పడి పోతుంది. వస్తువుల ఉత్పత్తిదారులు నష్టపోతారు. ఉత్పత్తి అయ్యే వస్తువుల విలువకంటే ఎక్కువ విలువకు కరెన్సీ ఉంటే వస్తువుల ధరలు పెరిగి పోతుంది. వినియోగదారుడు తాను పొందిన వస్తువు విలువకన్నా ఎక్కువ విలువను చెల్లించవలసి వస్తుంది. అంటే వినియోగదారుడు తాను పొందిన వస్తువు విలువతో బాటుగా అదనంగా ధనం కోల్పోతాడు. వస్తువు విలువతో బాటుగా ఆ ఆదనపుధనం కూడా ఉత్పత్తిదారుని వద్దకు చేరుతుంది. ఈ అదనపుధనం ఇతరులనుండి కాజేసిన ధనం. ఇది నల్ల డబ్బుగా ఉంటుంది. అయితే ప్రభుత్వం దీనిని నల్లడబ్బుగా పరిగణించటం లేదు. కేవలం పన్ను కట్టకుండా ఉంచుకున్న ధనాన్ని మాత్రమే ప్రభుత్వం నల్లడబ్డుగా పరిగణిస్తున్నది. ఇది తప్పు. ప్రస్తుతం మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల విలువకంటే ఎక్కువ విలువకు కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. అందుకేధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదనపుధనం ఉత్పత్తిదారుల వద్దకు విపరీతంగా చేరుతున్నది. దీనికి రైతులు మినహాయింపు. ఒక టూత్‌ పేస్టు ఉత్పత్తి చేసేవాడు తన టూత్‌ పేస్టు ధరను నిర్ణయించగలడు. రు.5 ల విలువగలిగిన టూత్‌ పేస్టును రు.40లకు అమ్మినా ప్రభుత్వానికి పన్ను కడితే అది తెల్లధనమే అవుతుంది. కాని రైతుకు తాను ఉత్పత్తి చేసిన పంటకు ధర నిర్ణయించే అధికారం రైతుకు లేదు. అందువలన ఆహారధాన్యాల ధరలు పెరుగుతున్నా, రైతుకు వచ్చేదేమీ లేదు. కనుకనే ధరల పెరుగుదల వలన పారిశ్రామిక వర్గాల వద్దకు ధనం విపరీతంగా చేరుతుంటే రైతులు చితికి పోతున్నారు. కనుక నల్లధనం పారిశ్రామిక వర్గాలు, వారి అనుమాయుల వద్ద విపరీతంగా పోగుపడుతున్నది.
పన్నుకడితే తెల్లధనం, పన్ను కట్టకుండా దాచుకుంటే అది నల్లధనం అనే ప్రభుత్వ నిర్వచనాన్నే తీసుకుంటే మోడీ అధికారంలోకి వచ్చిన అనంతరం పన్ను ఎగవేతలు విపరీతంగా పెరిగి పోయాయని లోక్‌ సభలో ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే తెలియజెబుతున్నాయి. నవంబరు 18న, బీ.జే.పీ యం.పి కంభంపాటి హరిబాబు అడిగిన ప్రశ్నకు ( ప్రశ్న నెం. 640) కేంద్ర ఆర్ధిక శాఖ ఇచ్చిన సమాచారం ఈ క్రింది విధంగా ఉంది.
ఆర్ధిక సం|| వసూలైన ప్రత్యక్ష పన్నులు వసూలుకాని ప్రత్యక్ష పన్నులు
(కోట్ల రూ.లలో) (కోట్ల రూ.లలో)
2013-14 638596 674916
2014-15 695792 827690
2015-16 742295 929972
2016-17 377045 903048(సెప్టెంబరు వరకు)
పైఅంకెలు చూస్తే వసూలైన పన్నులకన్నా వసూలుకాని పన్నులు విపరీతంగా పెరిగి పోతున్నాయని స్పష్టం అవుతున్నది. ఈ ఎగవేతలు మోడీ పాలనా కాలంలో ఊపందున్నదన్నది స్పష్టం అవుతున్నది. వసూలు కాని పన్నులు అంటే ఆదాయాన్ని, దానిమీద పన్ను నిర్ధారించిన అనంతరం కట్టకుండా ఎగవేసిన పన్ను అన్నమాట. ఉద్యోగులు పన్నులు ఎగవేసే అవకాశం ఏమాత్రంలేదు. ఎందుకంటే ప్రతి 3 నెలలకొకసారి సమీక్షిస్తూ ఉద్యోగుల వద్దనుండి మార్చి 31 నాటికి పూర్తిగా పన్ను వసూలు చేస్తారు. ఈ పన్నుల ఎగవేతకు పాల్పడింది పారిశ్రామిక వేత్తలు, వారి అనుమాయులేనని స్పష్టమవుతున్నది.
ఒకవైపు పారిశ్రామిక వేత్తలు పన్నులు ఎగవేతలకు ప్పాలడుతుంటే మరోవైపు మోడీ పాలనా కాలంలో ఇదే పారిశ్రామిక వేత్తలకు 2014-15లో రు. 554349 కోట్లు, 2015-16లో రు. 611128 కోట్లు, 2016-17లో రు. 667907 కోట్లు పన్నుల రాయితీలిచ్చారు.
రిజర్వు బ్యాంకు నివేదికలు చూస్తే మరిన్ని అంశాలు బయటపడతాయి. మోడీ 2014 మే 29 న ప్రధానిగా అధికారం చేపట్టారు. అంటే ఆరోజున బీ.జే.పీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఏ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. మోడీ అధికారం చేపట్టేనాటికి బ్యాంకులలో ఉన్న మొండి బకాయీలు రు.250643 కోట్లు. అది ఏ మాత్రం తగ్గక పోగా పెరిగి 2016 సెప్టెంబరు నాటికి రు.624000 కోట్లు అయ్యింది. అంటే మోడీ అధికారంలోకి వచ్చిన రెండున్న సంవత్సరాలలో 624000-250643 =రు.373357 కోట్లు పెరిగాయి. అంటే 149 % పెరిగాయి. ఇది బ్యాంకులు రద్దు చేసిన రు.1,14,000 కోట్లు పోను మిగిలిన పెరుగుదల. నిజానికి రు.1,14,000 కోట్లు రద్దు చేయకపోయి ఉండుంటే ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉండేది.
దశాబ్దాల కాలంలో పెరిగి రు.250643 కోట్లుగా ఉన్న మొండి బకాయీలు, మోడీ రెండున్నర ఏళ్ళ పాలనలోనే ఎందుకంత విపరీతంగా పెరిగి రు.624000కోట్లకు (149%) చేరాయి? మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల ఎగవేతలు ఎందుకింత వేగంగా పెరిగాయి? కారణం ఒక్కటే.
మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి తాను పరిశ్రమాధిపతులకు, బడా కంపెనీలకు అనుకూలమని బాహాటంగానే ప్రకటిస్తూ వచ్చాడు. ముఖ్యంగా ఆదానీ , అంబానీలతో మరింత సాన్నిహిత్యంగా ఉంటూ వచ్చాడు. అధికారంలోకి వచ్చిన అనంతరం తీసుకున్న చర్యలుకూడా స్వదేశీ, విదేశీ కంపెనీలకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఈ దేశ ప్రజలు ఏమైపోయినా పరవాలేదు, స్వదేశీ, విదేశీ కంపెనీల అభివృధ్దే దేశ అభివృధ్ధి అనే విధంగా అతని చర్యలున్నాయి.
మోడీ రెండున్నరేళ్ళ కాలంలో దేశంలో ఆర్ధిక వ్యవస్థ తిరోగమనంలో ఉన్నది. మేకిన్‌ ఇండియాలాంటి నినాదాలిచ్చినా, ఆనినాదాలు వాగాడంబరాలేనని స్పష్టమయింది. ఉపాధి పెరగక పోగా, ఉన్న ఉపాధులు పోతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతున్నది. దేశంలో పారిశ్రామికోత్పత్తి పడి పోతున్నది. ప్రతిదానికీ విదేశాలమీద ఆధారపడవలసి వస్తున్నది. ఇవన్నీ చూచిన పారిశ్రామిక వేత్తలకు మోడీకి మాటల పసేతప్ప మంత్రాల పస లేదన్న విషయం బాగా అర్ధమైంది. దానితో వారిలో ఋణం ఎగ్గొట్టినా, పన్నులు ఎగ్గొట్టినా అడిగే నాధుడు లేడన్న నిర్భీతి వారిలో పెరిగింది, ఫలింతగా బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టడం పెరిగింది. దానితో మొండి బకాయీలు రు. 2,50,643 కోట్లనుండి రు.6,24,000కోట్లకు (149%) కు పెరిగాయి. పన్నుల ఎగవేతలు 6.74లక్షల కోట్లునుండి 9 లక్షల కోట్లకు పైగా పెరిగాయి.
పన్నుల ఎగవేతదారుల ఆస్తులను, బ్యాంకులకు ఋణాలు ఎగవేసిన వారి ఆస్తులను జప్తుచేసి బకాయీలను నిర్ధాక్షిణ్యంగా బకాయీలను వసూలు చేయలేని మోడీ ప్రభుత్వం నల్లధనాన్ని వెలికితీస్తుందంటే నమ్మాలా? పన్నుల ఎగవేత దారులు, బ్యాంకులకు ఋణ ఎగవేతదారులపై చేయవలసిన దాడి ప్రజలపై చేసి ఇది నల్లధనం వెలికితీసేటందుకేననటం హాస్యాస్పదం.
అయితే మరి మోడీ ప్రభుత్వం ఈచర్య ఎందుకు తీసున్నట్లు? ఇది కూడా స్వదేశీ, విదేశీ కంపెనీల కోసమే. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ పెట్టుబడులను దేశంలోకి విపరీతంగా అనుమతించింది. అందులో ఒక ముఖ్యమైనది రిటైల్‌ రంగం ( అంటే చిల్లర వర్తకం)లోకి విదేశీ పెట్టుబడులను అనుమతించడం. దగ్గరలో ఉన్న దుకాణంలనుండి సరుకులు, రోడ్డు ప్రక్కన అమ్మేవారినుండి కూరలు కొనుక్కోవటం మన భారతీయులను ఉన్న అలవాటు. ఈ అలవాటును అలా ఉంచితే చిల్లర వర్తకంలోకి ప్రవేశించిన విదేశీ కంపెనీలకు లాభాలు రావు. అందువలన ప్రజల అలవాటును మాల్స్‌ వైపుకు మళ్ళించాలి. చివరకు తోటకూరకట్ట, కరివేపాకు కొనాలన్నా మాల్‌ కు వేళ్ళే టట్లు చేయాలి. ఇది జరగాలంటే ప్రజలు డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు వినియూగించేవిధంగా చేయాలి. అలా చేయాలంటే ప్రజల దగ్గర మారకం నోట్లు లేకుండా చేస్తే ప్రతివాడిలో డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు ఉపయోగించాలన్న ఆలోచన వస్తుంది. కార్డులతో వస్తుకొనాలంటే దుకాణదారుల వద్ద స్వైపింగ్‌ మిషన్లు ఉండాలి. స్వైపింగ్‌ మిషన్లు పెద్ద దుకాణదారులే ఉంచగలరు. కనుక ప్రజలు తప్పనిసరిగా మాల్స్‌ వైపుకు మళ్ళుతారు. దీనితో చిల్లర దుకాణాలు మూతపడతాయి. నోట్ల రద్దు యొక్క లక్ష్యం నల్లధనాన్ని వెలికి తీయటం కాదు. చిల్లర దుకాణాలను మూయించడమే దీని లక్ష్యం.


-యం.వి. ఆంజనేయులు

Sunday 23 October 2016

ఈ రోజు (23.10.2016) విజ‌యవాడ అయోధ్య న‌గ‌ర్‌లో టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌తినిధుల ప‌ర్య‌ట‌న‌






స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ రోజు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ బృదం అయోధ్యనగర్‌లో పర్యటించి అక్కడి శానిటేషన్‌, సైడ్‌ డ్రైన్లను పరిశీలించింది. టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ నగర కార్యదర్శి యం.వి.ఆంజనేయులు, సహాయ కార్యదర్శి వి.శ్రీనివాస్‌, కోశాధికారి వి.ఎస్‌. రామరాజు, టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్థానిక నాయకులు యం. వసంత ఈ బృందంలో ఉన్నారు. ఈ బృందం అక్కడి స్థానికులతో శానిటేషన్‌, సైడ్‌ డ్రైన్లను గురించి చర్చించింది. అయోధ్యనగర్‌లోని అనేక వీధులలో సైడ్‌ డ్రైన్లు పూడిపోయి ఉండటం, డ్రైన్లు ఉన్నచోట నీరుపోయే అవకాశంలేక ఎక్కడికక్కడ నిలిచి పోయి ఉండటాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ గమనించింది. మున్సిపల్‌ సిబ్బంది డ్రైన్ల పూడిక తీయటం, రోడ్లు శుభ్రం చేయటం మానివేశారని, తగినంతమంది సిబ్బంది లేకపోవటం వలననే తాము చేయటం లేదని మున్సిపల్‌ సిబ్బంది అంటున్నారని స్థానికులు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ దృష్టికి తీసుకు వచ్చారు. భవానీ అనే గృహిణి మాట్లాడుతూ బయట డ్రైన్లు పూడుక పోయి ఉండటంతో తమ ఇంటిలో వాడిన నీరు బయటకు పోవటం లేదని, కొన్ని సమయాలలో బయట నీరు తమ ఇంట్లోకి వస్తున్నదని అన్నారు. తమ ఇంట్లోకి బయటి మురుగునీరు రావటాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ బృందానికి చూపించారు. తమ ఇంటి ఆవరణలో తొమ్మిది కుటుంబాలు నివాసం ఉంటున్నాయని నీరు బయటకు పోకపోవటంతో ఇంట్లోనే తడిలో నడవవలసి వస్తున్నదని, వృధ్ధులు పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీ అనే మహిళ మాట్లాడుతూ దోమల వలన తమ ఇంటికి వచ్చిన బంధువులు సైతం జ్వరాలపాలయ్యారని అన్నారు. గతంలో ఉన్న డ్రైన్లను సైతం కొంతమంది ఆక్రమించిన వైనాన్ని స్థానికులు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ బృందానికి వివరించారు. తాము స్థానిక కార్పొరేటర్‌కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటంలేదని, కార్పొరేషన్‌కు ఫిర్యాదుచేస్తే సమస్యను పరిష్కరించకుండానే పరిష్కారమైనట్లు వ్రాసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుడమేరు కట్టకు దగ్గరలో ఉన్న వారి పరిస్థితి మరీ నరకప్రాయంగా ఉంది. నీళ్ళన్ని అక్కడ నిల్వ చేరి మురుగునీటి తటాకాలుగా ఉన్నాయి. మున్సిపల్‌ సిబ్బంది ఆ మురుగునీటి గుంటలలో దేమల మందు చల్ల్లటానికి కూడా డబ్బులు అడుగుతున్నారని చెప్పారు. ఆ మురుగునీటి గుంటలలోనే మంచినీటి పైపులను వేసిన వైనాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ పరిశీలించింది. నీరు బుడమేరులో కలవటానికి రైల్వే ట్రాక్‌కు దగ్గరలో లాకులు ఏర్పాటు చేశారు. కాని ఏర్పాటు చేసిన లాక్‌కు తలుపు అమర్చలేదు. వర్షం వలన బుడమేరు ఏమాత్రం వచ్చినా బుడమేటినీరు అయోధ్యనగర్‌లోకి ప్రవేశించి అయోధ్యనగర్‌ ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. సమస్య పరిష్కారమయ్యేవరకు దీనిపై ఆంధోళన చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావించింది. మరోసారి కార్పొరేటర్‌కు, కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేయాలని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఈ సమస్యలపై తదుపరి కార్యానరణను రూపొందించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది.

Sunday 16 October 2016

ఈ రోజు (16.10.2016) టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ప్రెస్ మీట్‌లో ఇచ్చిన ప్రెస్ నోట్.


               విజయవాడ నగరంలో మున్సిపల్‌ వ్యర్ధాలను నిర్మూలించడానికి శాశ్వత చర్యలు చేపట్టాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ విజయవాడ నగర పాలక సంస్థ పాలకులను, అధికారులను కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని పట్టణ ప్రాంతాలలో చెత్త నిర్మూలనకు శాశ్వత పరిష్కారదిశగా చర్యలు చేపట్టాలని  టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది.

ప్రజా ఉద్యమానికి తలొగ్గి సింగ్‌ నగర్‌ ఎక్సెల్‌ ప్లాంట్‌ ఆవరణలో విజయవాడ నగరంలోని చెత్త డంపింగ్‌ చేయటం నిలిపి వేశారు. నగర శివారు ప్రాంతాలైన  కొలనుకొండ, పాతపాడు ప్రాంతాలకు విజయవాడ నగర చెత్తను తరలించే ఏర్పాటు చేశారు. అయితే ఇది తాత్కాలిక చర్యేనని  టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌  భావిస్తున్నది. గతంలోనే కొలనుకొండ, పాతపాడు ప్రాంతాలకు చెత్త తరలించాలని ప్రయత్నించినప్పుడు ఆ ప్రాంతాల ప్రజలు వ్యతిరేకించారు. అందువలన ఆనాడు ఆప్రాంతాలకు తరలించడం విరమించుకోవలసి వచ్చింది. ఇప్పుడు మరల అదే ప్రాంతాలకు తరలిస్తున్నారు.  అక్కడి ప్రజలనుండి వ్యతిరేకత మరల వ్యక్తమయ్యే అవకాశముంది. ఒక చోట  ప్రజలు వ్యతిరేకిస్తే మరోచోటకు తరలించటం, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది.

పట్టణ ప్రాంతాలలో చెత్త విషయమై మొత్తం మున్సిపల్‌ శాఖలోనే  అవగాహనా లోపం ఉందని టాక్స్‌ పేయర్స్‌  అసోసియేషన్‌ అభిప్రాయపడుతున్నది. రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేషన్లు , మున్సిపాలిటీలు కలిపి మొత్తం  110 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఈ 110 పట్టణ స్థానిక సంస్థలలో వేలాది టన్నుల చెత్త ప్రతి రోజూ ఉత్పత్తి  అవుతున్నది. ఇంటి నుండి చెత్తను సేకరించి, డంపింగ్‌ యార్డుకు చేర్చటంతోనే తమ బాధ్యత తీరి పోతుందన్న భావన పట్టణ స్థానిక సంస్థలలో నెలకొని ఉన్నది. డంపింగ్‌ యార్డుకు తరలించిన చెత్తను నిర్మూలించటం తమ బాధ్యతగా భావించడంలేదు. అందుకే చెత్త డంపింగ్‌ చేసే ప్రదేశాలకోసం అన్వేషిస్తున్నారు తప్ప చెత్తనిర్మూలన కోసం అనుసరించవలసిన పధ్ధతులపై సీరియస్‌గా ప్రయత్నం చేయటం లేదని టాక్స్‌ పేయర్స్‌  అసోసియేషన్‌ అభిప్రాయపడుతున్నది.

చెత్త ఎంతవేగంగా ఉత్పత్తి అవుతుందో, అంతే వేగంగా దానిని నిర్మూలించాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దీనికోసం వ్యర్థాలనుండి పెల్లెట్లు తయారు చేయాలి. తయారైన పెల్లెట్ల వినియోగంపట్ల సంబంధిత వినియోగదారులకు అవగాహన కల్పించటం ద్వారా వాటిని మార్కెటింగ్‌ చేయాలి. కొన్నిరకాల ఫర్నెస్‌లలో పెల్లెట్ల వినియోగాన్ని నిర్బంధం చేయాలి. అలా చేసినప్పుడే ఈ చెత్త నిర్మూలించబడుతుంది. ఇవన్నీ చేయాలంటే కేవలం స్థానిక సంస్థలు చేయలేవు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రత్యేక బాధ్యతగా చేపట్టినప్పుడే ఈ సమస్య పరిష్కామవుతుంది. ప్రభుత్వం చెత్తనిర్మూలన బాధ్యతను ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని ప్రయత్నిస్తున్నది. గుంటూరు సమీపంలోని నాయుడుపేట వద్ద  చెత్త నిర్మూలనకు ప్యాక్టరీ నెలకొల్పడానికి జిందాల్‌  కంపెనీతో ఒప్పదం కుదుర్చుకున్నారు. లాభాలొచ్చినన్ని రోజులు ప్రైవేటు కంపెనీలు పని చేస్తాయి. లాభాలు రాక పోతే ప్రైవేటు కంపెనీలు మూసేస్తాయి. వాటికి ఏసామాజిక బాధ్యత ఉండదు. విజయవాడలో ఎక్సెల్‌ ఇండస్ట్రీస్‌, శ్రీరామ్‌ ఎనర్జీస్‌  అనుభవం కూడా అదే. లాభాలు రావటంలేదని మూసి వేశారు.  రేపు జిందాల్‌ కంపెనీ కూడా లాభం వస్తే పని చేస్తుంది. లేకుంటే మూసి వేస్తారు. మరల సమస్య పునరావృతమవుతుంది. అందువలన చెత్త నిర్మూలనను  ప్రభుత్వ రంగంలో చేపట్టినప్పుడే ఈ సమస్య పరిష్కారమవుతుందని టాక్స్‌ పేయర్స్‌  అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వం అనేక విషయాలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నది. కాని పట్టణ  ప్రాంతాలలో ఉన్న చెత్త నిర్మూలన సమస్యపై సమీక్షా సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు అనేక దేశాలు తిరుగుతున్నారు. కాని చాలా దేశాలలో చెత్త నిర్మూలనా పధ్ధతులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కాని వాటిని మాత్రం వీరు పరిశీలించి వాటిని అనుసరించాలన్న ఆలోచనలేదు. ఫలితంగా పట్టణాలలో చెత్త సమస్య తీవ్రమవుతున్నది.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్రంలోని పట్టణాలలో చెత్తతొలగింపు సమస్యపై ప్రత్యేక శ్రధ్ధ వహించాలని,  విజయవాడ నగరంలోని చెత్త నిర్మూలనకు శాశ్వత పరిష్కారదిశగా చర్యలు చేపట్టాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది.

యం.వి.ఆంజనేయులు
 కార్యదర్శి  
వి.ఎస్‌. రామరాజు
కోశాధికారి




Sunday 9 October 2016

09.10.2016 న‌ సింగ్ న‌గ‌ర్ ఎక్సెల్ ప్లాంట్ లో చెత్త‌ డంపింగ్ ప్రాంతంలో న్యాయ‌వాదులు, టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ నాయ‌కుల ప‌ర్య‌ట‌న- న్యాయ‌పోరాటం చేయాల‌ని నిర్ణ‌యం.

ఈరోజు న్యాయ‌వాదులు, టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ నాయ‌కులతో కూడిన బృందం  సింగ్ న‌గ‌ర్ ఎక్సెల్ ప్లాంట్ లో చెత్త‌ డంపింగ్ జ‌రుగుతున్న‌ ప్రాంతంలో ప‌ర్య‌టించింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో న్యాయ‌వాదులు శ్రీ‌మ‌తి యం.వ‌సంత‌గారు, శ్రీ సోముకృష్ణ‌మూర్తిగారు, శ్రీ వ‌ల్ల‌భ‌నేని స‌త్య‌న్నారాయ‌ణ‌గారు, టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు శ్రీ వి.సాంబిరెడ్డి గారు, కార్య‌ద‌ర్శి యం.వి.ఆంజ‌నేయులు గారు, స‌హాయ కార్య‌ద‌ర్శి శ్రీ వేదాంతం శ్రీ‌నివాస్ గారు పాల్గోన్నారు. ఎక్సెల్ ప్లాంట్ లోప‌ల‌కు వెళ్ళి చెత్త‌ డంపింగ్ చేస్తున్న వైనాన్ని ప‌రిశీలించారు. అక్క‌డ స్తానికుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. చెత్త‌డంపింగ్‌వ‌ల‌న త‌మ ఆరోగ్యాలు  చెడిపోతున్నాయని స్తానికులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చెత్త‌ డంపింగ్ వ‌ల‌న వెలువ‌డుతున్న దుర్గంధాన్ని తాము భ‌రించ‌లేక పోతున్నామ‌ని, భోజ‌నంకూడా చేయ‌లేక పోతున్నామ‌ని, శ‌రీరంపై దుర‌ద‌లు వ‌స్తున్నాయ‌ని అన్నారు.  కుక్క‌లు చెత్త‌ను, చెత్తోబాటు కుళ్ళిన జంతు శ‌రీర‌భాగాల‌ను తీసుక‌వ‌చ్చి రోడ్డు మీద ప‌డేస్తున్నాయ‌ని, పిల్ల‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని అన్నారు. తినేప‌దార్ధాల‌పై దుమ్ము ప‌డుతుంద‌ని అన్నారు. దుర్వాస‌న‌కు భ‌రించ‌లేక కొంత‌మంది ఇళ్ళు ఖాళీచేసి వెళ్ళిపోతున్నార‌ని, చుట్టాలుకూడా త‌మ ఇళ్ళ‌కు రావ‌టానికి భ‌య‌ప‌డుతున్నార‌ని అన్నారు.. చెత్త‌ డంపింగ్‌ను ప‌రిశిలించి,  స్తానికుల బాధ‌ల‌న్నీ విన్న బృందం జ‌నావాసాల మ‌ధ్య చెత్త‌పోయ‌టం అంటే అక్క‌డి ప్ర‌జ‌ల‌ జీవించే హ‌క్కును కాల‌రాయ‌ట‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘ‌న క్రింద‌కు వ‌స్తుంద‌ని భావించింది. త‌క్ష‌ణ‌మే అక్క‌డ చెత్త‌డంపింగ్ చేయ‌టాన్ని నిలిపివేసి, డంపింగ్ యార్డును అక్క‌డ‌నుండి తొల‌గించాల‌ని డిమాండు చేసింది. న్యాయ‌వాది శ్రీ‌మ‌తి వ‌సంత‌గారు మాట్లాడుతూ, డంపింగ్‌యార్డును అక్క‌డ‌నుండి తొల‌గించాలి లేదా అధికారుల‌కు ఈ యార్డు ప్ర‌క్క‌న నివాసాలు ఇవ్వాల‌ని డిమాండు చేశారు. డంపింగ్‌యార్డును అక్క‌డ‌నుండి తొల‌గించ‌క‌పోతే యం.య‌ల్‌.ఎలు, ఎం.పి.లుకూడా ఈ యార్డు ప్ర‌క్క‌నే జ‌నంతో పాటు నివాసం  ఉండాల‌ని డిమాండు చేశారు. ప్ర‌జా సేవ‌కులుగా ఉండే యం.య‌ల్‌.ఎలు, ఎంపిలు, అధికారులు  మాత్రం కాలుష్యంలేకుండా సుఖంగా ఉంటూ , ప్ర‌జ‌లనుమాత్రం కాలుష్యంలో ముంచ‌టం దారుణ‌మ‌ని అన్నారు. మ‌రో న్యాయ‌వాది శ్రీ సోముకృష్ణ‌మూర్తిగారు మాట్లాడుతూ దీనిపై న్యాయ‌పోరాటం చేద్దామ‌న్నారు. హానిక‌ర‌మైన ఈ డంపింగ్ యార్డుకు వ్య‌తిరేకంగా  స్తానికులు చేస్తున్న‌పోరాటాల‌కు  మ‌ద్ద‌త్తునిస్తూ, న్యాయ‌పోరాటం చేయాల‌ని ఈ బృందం నిర్ణ‌యించింది.








Friday 15 July 2016

ఆస్తి ప‌న్నుసంవ‌త్స‌రానికి ఒకేసారి క‌ట్టాల‌ని నోటీసులు పంప‌టం చ‌ట్ట‌విరుధ్ద‌మ‌ని తెలియజేస్తూ మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్‌కు, మేయ‌ర్‌కు వ్రాశిన లేఖ‌

                                                                

ప్రెస్ మీట్‌లో లేఖ‌ను విడుద‌ల చేస్తున్న టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ నాయ‌కులు  


                                      లేఖ‌                                                 

                                                       తేదీ: 15.07.2016
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి,

ఆర్యా,
విషయం: ఆస్తిపన్ను సంవత్సరం మొత్తానికి ఒకేసారి చెల్లించాలని డిమాండు పంపటం చట్టవిరుధ్ధమని తెలియజేస్తూ వ్రాస్తున్న లేఖ.

                 2016-2017 ఆర్ధిక సంవత్సరంలో మొదటి అర్ధ సంవత్సరానికి చెల్లించవలశిన ఆస్తిపన్ను నోటీసులను పంపుతున్నారు. అయితే ఆ నోటీసులలో మొదటి అర్ధ సంవత్సరానికి బదులుగా అనగా 01.04.2016 నుండి 30.09.2016 వరకు చెల్లించవలసిన ఆస్తిపన్ను, నీటి చార్జీలు , డ్రైనేజి చార్జీలు, యూజర్‌ చార్జీలు, సర్వీస్‌ చార్జీల తోబాటుగా 01.10.2016 నుండి 31.03.2017 వరకు చెల్లించవలసిన ఆస్తిపన్ను, నీటి చార్జీలు , డ్రైనేజి చార్జీలు, యూజర్‌ చార్జీలు, సర్వీస్‌ చార్జీలు కలిపి మొత్తం సంవత్సరానికి ఒకేసారి చెల్లించాలని ఆదేశిస్తూ డిమాండు నోటీసులను పంపుతున్నారు. ఇది చట్టవిరుధ్ధమన్న విషయాన్ని మీదృష్టికి తీసుక వస్తున్నాము.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955, సెక్షన్‌ 264 లో ఈ క్రింది విధంగా ఉన్నది.
                                Collection of Taxes
Sec264: Property taxes how payable:- Each of the property taxes shall be payable in advance either in half-yearly or quarterly installments as the corporation may decide.
(2) In case of-
(a) half-yearly installments, the taxes shall be payable in advance on each first day of    April and October
(b) quarterly installments, the taxes shall be payable on each first day of April and July and each first day of October and January.

                     పై సెక్షన్‌ ప్రకారం ఆస్తిపన్ను అర్ధ సంవత్సరానికి కాని లేదా మూడు నెలలకు ఒకసారి కాని వసూలు చేయాలి. అంతేకాని, సంవత్సరానికి ఒకేసారి వసూలు చేయమని చట్టంలో లేదు. అర్ధ సంవత్సరానికి ఒకసారి ఆస్తిపన్ను వసూలు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ ఏనాడో నిర్ణయించి ఇప్పటివరకు అమలు జరుపుతున్నది. ఈ నిర్ణయానికనుగుణంగానే, ఆస్తిపన్నును మదింపు చేసినప్పుడు అర్ధసంవత్సరానికి మదింపు చేసి స్పెషల్‌ నోటీసులను పంపారు. గృహ యజమానులు కూడా అంగీకరించారు. దానికనుగుణంగానే ఇప్పటివరకు కార్పొరేషన్‌ ప్రతి అర్ధ సంవత్సరం డిమాండు నోటీసులను జారీ చేసి పన్నులను వసూలు చేస్తున్నది. 2016-2017 లో అందుకు భిన్నంగా సంవత్సరానికి ఒకేసారి ఆస్తిపన్ను కట్టమని నోటీసులను పంపుతున్నారు. ఒకసారి మదింపు చేసి పంపిన ఆస్తిపన్ను నోటీసులను మార్చాలంటే ముందుగా కౌన్సిల్‌లో నిర్ణయం చేయాలి. సవరణ నోటీసులను పంపటం ద్వారా గృహ యజమానులకు తెలియ జేయాలి. వారి నుండి అభ్యంతరాలను స్వీకరించాలి. పరిష్కరించాలి. ఇవేవీ చేయకుండా 2016-2017 లో సంవత్సరానికి ఒకేసారి కట్టమని ఆస్తిపన్ను నోటీసులను పంపటం చట్టవిరుధ్ధం.

                      సంవత్సరానికి ఒకేసారి కట్టమని ఆస్తిపన్ను నోటీసులను పంపటం వెనుక, నిజాయితీగా క్రమం తప్పకుండా ఆస్తిపన్ను చెల్లించేవారిపైననే భారంమోపి వారినుండి ఒకేసారి ఆస్తిపన్ను రాబట్టుకోవాలన్న ఆతృత కనుపిస్తున్నది. కాని దశాబ్దాలతరబడి ఆస్తిపన్నును చెల్లించకుండా బకాయీలు పడిన వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల నుండి ఆస్తిపన్ను రాబట్టడానికి ఇంత ఆతృత ఎందుకు చూపటంలేదని ప్రశ్నిస్తున్నాము.

                పైవిషయాలను దృష్టిలో ఉంచుకొని, సంవత్సరానికి ఒకేసారి కట్టమని ప్రస్తుతం జారీ చేస్తున్న ఆస్తిపన్ను డిమాండు నోటీసులను ఉపసంహరించుకొని, అర్ధ సంవత్సరానికి చెల్లించేవిధంగా డిమాండు నోటీసులను జారీ చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా దశాబ్దాలతరబడి ఆస్తిపన్నును చెల్లించకుండా బకాయీలు పడిన వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల నుండి ఆస్తిపన్ను రాబట్టడానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నాము.
                                        అభివందనాలతో

వి.సాంబిరెడ్డి                                              యంవి ఆంజనేయులు
అధ్యక్షులు                                                            కార్యదర్శి

గ‌మ‌నికః ఇదే లేఖ‌ను న‌గ‌ర మేయ‌ర్ గారికి కూడా పంపించాము.

Sunday 22 May 2016

Press Clippings 23.05.2016








Open Letter

                                                                                                తేదీ: 22.05.2016
అధ్యయన యాత్రకు వెళ్ళిన విజయవాడ కార్పొరేటర్లకు 
టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ బహిరంగ లేఖ. 
ఆర్యా! 
మీరు 29.04.2016 నుండి 13.05.2016 వరకు అధ్యయన యాత్రపేరుతో ఉత్తర భారతదేశంలోని 7 కార్పొరేషన్లను సందర్శించారు. ప్రజలు చెల్లించిన పన్నులనుండి ఖర్చు చేసి మీరు ఈ యాత్రకు వెళ్ళారన్న విషయం మీకు తెలియంది కాదు. కనుక మీ అధ్యయనం విజయవాడ నగర ప్రజలకు ఉపయోగపడాలి. అందువలన మీ యాత్రలో మీరు అధ్యయనం చేసిన విషయాలు, అవి విజయవాడ నగరానికి ఎలా ఉపయోగపడతాయో నగరప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మీమీద ఉన్నది. 

ముందుగా మీ టూర్‌కు నిర్దేశించిన అంశాలు ఏమిటి? ఏఏ అంశాలను అధ్యయనం చేయటానికి మిమ్ములను టూర్‌కు పంపారు? అన్న విషయాలను బహిర్గతం చేయవలసిందిగా కోరుతున్నాము. సాధారణంగా అధ్యయనానికి కొద్దిమంది వెళ్తే సరిపోతుంది. కాని 35 మంది కార్పొరేటర్లు టూర్‌కు వెళ్ళారు. ఎక్కువ మంది వెళితే అధ్యయనం మరింత ఎక్కువగా జరిగుండాలి. అది విజయవాడ నగర ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాము. అందువలన మీ అధ్యయనానికి సంబంధించి కొన్ని అంశాలను మీనుండి తెలుసుకోగోరుతున్నాము. 

01. మన విజయవాడనగరం కృష్ణా నది ఒడ్డున ఉన్న విధంగానే, ఢిల్లీ నగరం యమునా నది ఒడ్డున ఉన్నది. ఢిల్లీ జనాభా 1.86 కోట్లు. అంటే సుమారు 37 లక్షల 20 వేల కుటుంబాలు ఉన్నాయి. అంత జనాభా ఉన్న ఢిల్లీ నగరంలో ప్రతి ఇంటికీ నెలకు 20 కిలో లీటర్లు ( మనిషికి రోజుకు సుమారు 150 లీటర్లు) నీరు ఉచితంగా ఇస్తున్నారు. అంటే నెలకు సుమారు 7.44 కోట్ల కిలో లీటర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఢిల్లీ లాంటి మహానగరంలో అది ఎలా సాధ్యపడుతుందో అధ్యయనం చేశారా? మన విజయవాడ నగరంలో నీరు ఉచితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే ఎందుకు లేవో వివరించగలరు. 

మన విజయవాడ నగరంలో అపార్టుమెంట్లకు నీటి మీటర్లు ఉన్నాయి. మనకు ప్రస్తుతం ఉన్న నీటి చార్జీల రేట్ల ప్రకారం 20 కిలోలీటర్లు వాడితే రు.505.94 అవుతుంది. కాని ఢిల్లీలో గృహ అవసరాలకు 20 కిలోలీటర్ల వరకు కిలోలీటరు కనీస చార్జీ రు.4.39 గా నిర్ణయించికూడా ఉచితంగానే ఇస్తున్నారు. పూనేలో 22.5 కిలో లీటర్ల వరకు కిలోలీటరు రు.4.50కు ఇస్తున్నారు. సిమ్లా టౌన్‌లో కిలోలీటర్‌ రు.2.50కి ఇస్తున్నారు. ఛండీఘర్‌లో 15 కిలో.లీ. వరకు కిలో లీటర్‌ రు.2.లు, ఆపైన 30 కిలో.లీ.వరకు కిలోలీటర్‌ రు.4లకు ఇస్తున్నారు. ఇవన్నీ మన విజయవాడ నగరంలోని నీటి చార్జీలకంటే బాగా తక్కువ. వీటన్నింటిని పరిశీలిస్తే మన నగరంలో అపార్టుమెంట్ల వారికి నీటి చార్జీలు తగ్గించడానికి అవకాశాలున్నాయని స్పష్టమవుతున్నది. నీటి చార్జీలు తక్కువగా ఉంచడానికి ఆయా మున్సిపల్‌ కార్పొరేషన్లు తీసుకుంటున్న చర్యలేమిటీ? అక్కడ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేమిటీ? ఆయా మున్సిపల్‌ కార్పొరేషన్ల అనుభవాలను, పధ్ధతులను మీరేం అధ్యయనం చేశారు? అధ్యయనం వివరాలను బహిర్గతం చేయాలని కోరుతున్నాము. 

02. విజయవాడ నగరంలో 3 కొండలు ఉన్నాయి. నగర జనాభాలో సుమారు 10 శాతం మంది కొండలమీద నివశిస్తున్నారు. మిగిలిన 90 శాతం జనాభా మైదాన ప్రాంతాలలో నివశిస్తున్నారు. కొండల మీద నివశించేవారికి దశాబ్దాల క్రితం నుండే బూస్టర్ల ద్వారా నీటిని అందిస్తున్న చరిత్ర విజయవాడ నగరపాలక సంస్థకు ఉన్నది. విజయవాడ నగరానికి భిన్నంగా సిమ్లా నగరం పూర్తిగా కొండలపైన ఉన్నది. అక్కడ నీటి సౌకర్యాలను ఎలా కల్పిస్తున్నారు? నీటి చార్జీలు ఎలా ఉన్నాయి? మనకంటే మెరుగ్గా అక్కడి నీటి వ్యవస్థ ఎలా ఉన్నది? 

హిమాచల్‌ ప్రదేశ్‌ ఇరిగేషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డిపార్టుమెంట్‌ సిమ్లా మున్సిపల్‌ కార్పొరేషన్‌కు నీరు సరఫరా చేస్తున్నది. ఏ ధరకు నీరు సరఫరా చేస్తున్నది? సిమ్లా మున్సిపల్‌ కార్పొరేషన్‌కు నిర్వహణ చార్జీలు ఎంతవుతున్నాయి? గృహావసరాలకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏ ధరకు నీరు సరఫరా చేస్తున్నది అధ్యయనం చేశారా? అంత కొండలమీదకు సైతం నీటిని చౌకగా ఎలా ఇవ్వగలుగుతున్నారో అధ్యయనం చేశారా? వివరాలను బహిర్గతం చేయాలని కోరుతున్నాము. 
03. జాతీయ రాజధానిగా ఉన్న ఢిల్లీలో 80 శాతం పాఠశాలలకు ఆటస్థలాలు ఉన్నాయి. మన విజయవాడ నగరంలో అనేక పాఠశాలలకు ఆటస్థలాలు లేవు. వీటిని మీరు అధ్యయనం చేశారా? అక్కడ '' రైట్‌ టు ప్లే'' అన్న నినాదంతో మరిన్ని గ్రౌండ్స్‌ కోసం ప్రజలు డిమాండు చేస్తున్న విషయాన్ని మీరు అధ్యయనం చేశారా? మన విజయవాడలో మన పిల్లలకు '' రైట్‌ టు ప్లే'' (ఆడుకునే హక్కు) ఎందుకు అమలు చేయలేము? 

04. ఢిల్లీలో అనేక వీధులలో 40 అడుగుల రోడ్లలో సైతం రెండు వైపుల 10 అడుగుల వెడల్పు గలిగిన ఫుట్‌ పాత్‌లు వేశారు. అవి ఎలా వేశారో, వాటి ప్రయోజానాలేమిటో, అవి ట్రాఫిక్‌ నియంత్రణకు ఎలా ఉపయోగ పడుతున్నాయో అధ్యయనం చేశారా? మన విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణకు అలాంటి ఫుట్‌ పాత్‌లు ఎందుకు వేయలేకపోతున్నామో అధ్యయనం చేశారా? 

05. ఢిల్లీ నగరంలో ఫుల్‌పాత్‌ల మీద వృక్షజాతి మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మన నగరంలో వృక్షజాతి మొక్కలను నరికి వేశి, చిన్న చిన్న మొక్కలను నాటుతున్నారు. ఢిల్లీ మాదిరిగా విజయవాడలో వృక్ష జాతి మొక్కలను ఎందుకు నాటలేము? వృక్ష జాతి మొక్కలను నాటడానికి ఢిల్లీలో ఉన్న అవకాశాలు ఏమిటీ? విజయవాడలో లేనివి ఏమిటి? 

06. ఢిల్లీ నగరంలో పురాతన వారసత్వ సంపదను కాపాడుతున్నారు. అమృతసర్‌లో జలియన్‌ వాలా బాగ్‌లాంటి చారిత్రక ప్రదేశాలను కాపాడుతున్నారు. సిమ్లాలో ఇండియా-పాకిస్తాన్‌ ఒప్పందం జరిగిన ప్రదేశాలను, బ్రిటీష్‌వారి విడిది ప్రదేశాలను చారిత్రక స్థలాలుగా కాపాడుతున్నారు. జైపూర్‌లో అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిని కాపాడుకుంటున్నారు. అందుకు భిన్నంగా మన విజయవాడ నగరంలో చారిత్రకంగా ఉన్న స్వరాజ్య మైదానాన్ని సైతం లేకుండా చేయబోతున్నారు. అవి చూచిన తరువాత స్వరాజ్య మైదానాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీకు ఉన్నదనిపిస్తున్నదా? లేదా? 

07. ఢిల్లీ నగరంతోబాటుగా, కొండల మీద ఉన్న నగరం సిమ్లాలో సైతం వివిధ అవసరాలకోసం గ్రౌండ్లను ఏర్పాటుచేసి కాపాడుతున్నారు. చండిఘర్‌లో విస్తారమైన గ్రౌండ్‌లు ఉన్నాయి. మన నగరంలో ఉన్న గ్రౌండ్లను కూడా లేకుండా చేస్తున్నారు. గ్రౌండ్లను కాపాడుకోవటం, క్రొత్త గ్రౌండ్లను ఏర్పాటు చేయటంపై మీరేమి అధ్యయనం చేశారు? 

08. ఢిల్లీ నగరంలో బి.ఆర్‌.టి.యస్‌. ఎక్కడనుండి ఎక్కడవరకు ఎన్ని కిలోమీటర్లు వేశారు. అది జయప్రదమయిందా లేక విఫలమయిందా? జయప్రదమయితే ఎలా జయప్రదమైంది, విఫలమయితే ఎందుకు విఫలమయింది, మన విజయవాడలో బి.ఆర్‌.టి.యస్‌.కు, ఢిల్లీ బి.ఆర్‌.టి.యస్‌.కు ఉన్న సారూప్యత ఏమిటీ, విజయవాడలో బి.ఆర్‌.టి.యస్‌.ను జయప్రదం చేయటానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు తదితర అంశాలను అధ్యయనం చేశారా? చేస్తే వివరాలను బహిర్గతం చేయగలరు. 

09. మన విజయవాడ నగరంలో మెట్రోరైలు వేయాలని నిర్ణయించారు. ఢిల్లీ నగరంలో ఇప్పటికే మెట్రోరైలు వేశారు. ఢిల్లీలో ఎంత నిడివి వేశారు? ఎన్ని స్టేషన్లలతో వేశారు? అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత? ఢిల్లీ మెట్రో లాభాలలో ఉన్నదా? లేక నష్టాలలో ఉన్నదా? నష్టాలలో ఉంటే ఆనష్టాలను ఎలా పూడ్చగలుగుతున్నారు? గత 5 సంవత్సరాలుగా ఢిల్లీ మెట్రో చార్జీలను పెంచారా? మీ అధ్యయన వివరాలను బహిర్గతం చేయగలరు. 
10. ఢిల్లీ నగరంలో ఒక ప్రైవేటు సంస్థ కూడా మెట్రోరైలు వేశింది. ఎక్కడనుండి ఎక్కడకు వేశారు? చార్జీలు ఎలా ఉన్నాయి? ఆ రైలు లాభాలలో ఉన్నదా లేక నష్టాలలో ఉన్నదా? ఆ ప్రైవేటు సంస్థ ఆ రైలును నడపగలుగుతున్నదా? ఢిల్లీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ వేశిన మెట్రోరైలుకు, ప్రైవేటు సంస్థ వేశిన మెట్రోరైలుకు మధ్య తేడా ఏమిటి? ఈ విషయాలను అధ్యయనం చేశారా? వివరాలను బహిర్గతం చేయగలరు. 

11. ఢిల్లీలో మెట్రో రైలు పరిస్ధితిని అధ్యయనం చేసిన తర్వాత, మన విజయవాడ నగరంలో వేయబోతున్న మెట్రోరైలు లాభాలలో ఉంటుందని అనుకుంటున్నారా? నగర ప్రజలకు చౌకైన రవాణాగా ఉంటుందని మీరు భావిస్తున్నారా? భావిస్తే ఎలాగో వివరించగలరు? 

12. మెట్రో రైలు వలన ఢిల్లీ నగర ప్రజలపై భారాలేమైనా పడ్డాయా? పడితే ఏవిధంగా భారాలు పడ్డాయి? వివరించగలరు. 

13. విజయవాడ నగరానికి పనికి వచ్చే క్రొత్త అంశాలు ఇంకేమేం అధ్యయనం చేశారు? వివరాలను బహిర్గతం చేయగలరు. 
                                         అభివందనాలతో 

(వి.సాంబిరెడ్డి)                                                      (యంవి ఆంజనేయులు)
అధ్యక్షులు                                                                  కార్యదర్శి