Thursday 5 October 2017

విజ‌య‌వాడ‌లోని సుమారు 47 ఎక‌రాల ప‌బ్లిక్ స్థ‌లాల‌ను ప్రైవేటు వ్య‌క్తుల‌కు, సంస్థ‌ల‌కు క‌ట్టబెట్టే విధంగా మున్సిప‌ల్ కౌన్సిల్ చేసిన తీర్మానాల‌కు వ్య‌తిరేకంగా 02.10.2017 న టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ ప్రెస్ మీట్‌

ప్రచురణార్ధం:                                                                     తేదీ:02.10.2017
విజయవాడ నగరంలో సుమారు 47 ఎకరాల ప్రభుత్వ స్ధలాలను, నగర ప్రజల ప్రయోజనాలకు కాకుండా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం కోసం నగరపాలక సంస్థ నిర్ణయం చేయటం పట్ల టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. స్వరాజ్యమైదానం 26 ఎకరాలు, నరపాలక సంస్థ ప్రాంతంలో ఉన్న పూలమార్కెట్‌, కూరగాయల  హోల్‌సేల్‌ మార్కెట్‌ మొత్తం ఎ.3.80లు, నగరపాలక సంస్థ స్థలం ఎ.3.22లు, సబ్‌స్టేషన్‌ ఎ.1.14లు, రాజీవ్‌గాంధి పార్కు ఎ.9.01లు , రైల్వే స్థలం ఎ.3.51లు మొత్తం ఎ.46.68లు నగర ప్రజలకు దక్కకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్ట బోతున్నారు. కేవలం నగరంలోని విలువైన పబ్లిక్‌ స్థలాలను తమ అనుమాయులకు, బడా పారిశ్రామిక వేత్తలకు, విదేశీ కంపెనీలకు కట్టబెట్టటం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రగా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభివర్ణిస్తున్నది. నగరంలో వాహనాలసంఖ్య నానాటికీ పెరుగుతున్నది. సరైన పార్కింగ్‌ స్థలాలులేవు. అనేక ప్రభుత్వ కార్యాలయాలు అద్దెభవనాలలో నడుస్తున్నాయి. నగరంలో సరైన క్రీడా మైదానాలు లేవు. ఏదైనా విపత్తు సంభవిస్తే తలదాచుకోవటానికి స్థలాలు లేవు. విజ్ఞాన,వినోద కార్యక్రమాలకు స్ధలాలు లేవు. ఇలా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలకు స్థలాలను ఏర్పాటు చేయవలసిన ప్రభుత్వం, నగరపాలకులు, అందుకు భిన్నంగా ఇప్పటికే ఉన్న స్థలాలలో రిటైల్‌ మాల్స్‌, ఎగ్జిబిషన్‌ హాల్స్‌, బహుళ అంతస్తుల నిర్మాణాలు చేయటం, టవర్లు కట్టడం లాంటి వాటివలన చేయటం వలన ప్రైవేటు వ్యక్తుల, సంస్థల ప్రయోజనాలు నెరవేరుతాయి తప్ప నగర ప్రజల ప్రయోజనాలు నెరవేరవు. ఇప్పటికే ఆర్‌.టి.సి స్థలాలు క్రమేణా ప్రైవేటు వ్యక్తు చేతులలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇరిగేషన్‌ స్థలాలు, నగరపాలక సంస్థ స్థలాలను కాజేయబోతున్నారు. ఇది నగరానికి తీరని నష్టం వాటిల్లుతుందని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టంచేస్తున్నది. నగర ప్రయోజనాలు ఏమాత్రం పట్టించుకోకుండా కార్పొరేటర్లు కూడా కౌన్సిల్‌లో ఈ తీర్మానాలకు ఓటువేయటం దారుణం. ఇప్పటికైనా నగరప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నగరపాలక సంస్థ పాలకులు తమ నిర్ణయాలను వెనుక్కు తీసుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది. నగరానికి నిధులిచ్చి అభివృధ్ధి చేయాల్సిన ప్రభుత్వం, నిధులు ఇవ్వకపోగా, అభివృధ్ధికి వికృతి నిర్వచనాలిచ్చి, నగర ప్రజలకు ఉపయోగపడే స్థలాలను కాజేయటం మానుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది.

వి.సాంబిరెడ్డి                                                      యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                              కార్యదర్శి