Sunday 6 December 2015

Press Note

PRESS NOTE                                                             DATE   07.12.2015
స్వరాజ్య మైదానాన్ని నగరంలోని ప్రజాతంత్ర కార్యక్రమాలకు, విజ్ఞాన వినోదకార్యక్రమాలకోసం అందుబాటులో ఉండేవిధంగా ఖాళీస్ధలంగానే ఉంచాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. రైతుబజారుతో సహా అందరినీ తొలగించి ఈ గ్రౌండును పార్కుగా చేయాలని అధికారులు భావిస్తున్నట్లుగా వస్తున్న వార్తల పట్ల టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆంధోళన వ్యక్తం చేస్తున్నది. దీపావళి సమయంలో బాణసంచా అమ్ముకునేవారిని అనుమతించకపోవటం, బుక్‌ ఎగ్జిబిషన్‌ వారిని కూడా అనేక తర్జన భర్జనల అనంతరం కొద్దిభాగంలో అనుమతించటం, డ్రైవింగ్‌ స్కూల్‌ వారిని జనవరిలో ఖాళీ చేయమని చెప్పటం, హెలీపాడ్‌లు నిర్మించడం లాంటిచర్యలు ఈ వార్తలకు బలం చేకూర్చుతున్నాయని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది. 
ఈ గ్రౌండ్‌ నగరానికి ఎన్నోవిధాలుగా ఉపయోగపడుతున్నది.బుక్‌ ఎగ్జిబిషన్‌లాంటి విజ్ఞాన కార్యక్రమాలకు, భిన్నమతాలవారి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల బహిరంగ సభలకు పారిశ్రామిక, వ్యవసాయ ఎగ్జిబిషన్‌లకు, హస్తకళలను ప్రోత్సహించే హస్తకళల ఎగ్జిబిషన్‌లకు, సెలవుదినాలలో పిల్లలు ఆడుకోవటానికి, డ్రైవింగ్‌ నేర్చుకునేవారికి, రైతుబజార్‌ ద్వారా ప్రజలకు, ఇలా ఎన్నోవిధాలుగా నగరప్రజలకు ఉపయోగనడుతున్నది.దీపావళి సమయంలో బాణసంచా అమ్మకాలకు ఉపయోగపడుతున్నది. గతంలో ఈ గ్రౌెండ్‌లోనే రూపవాణీ లాంటి జాతీయ సంస్థలు గొప్పజాతీయ కళారూపాలు ప్రదర్శించారు. వినోద కార్యక్రమాలైన సర్కస్‌లు లాంటివి జరుగుతున్నాయి. ఇన్నివిధాలుగా దశాబ్దాలుగా మనకు ఉపయోగపడుతున్న ఈ గ్రౌండును ఇప్పుడు విజయవాడ ప్రజల అవసరాలకు అందుబాటులో లేకుండా చేయాలనుకోవటం దారుణం. ఇవేవీ లేకుండా విజయవాడ ప్రజలు ఎడారి బ్రతుకులు ఎందుకు బ్రతకాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది. 
నగరంలో ఇప్పటికే చిన్నవి పెద్దవి అన్నీకలిపి126 పార్కులున్నాయి.వీటన్నింటి సక్రమంగా నిర్వహిస్తే ప్రజలకు వారివారి ప్రాంతాలలోనే పార్కులు అందుబాటులోఉంటాయి. మరల క్రొత్తపార్కును నిర్మించవలసిన అవసరంలేదు. ఈ గ్రౌండును పార్కుగా మార్చితేే ఇది ప్రైవేటు వ్యక్తుల చేతులలోకి వెళ్ళటం ఖాయం. ఇప్పటికే నగరంలో ఉన్న లాభాలొచ్చే పార్కులను ప్రైవేటువారికి ఇచ్చారు. పార్కులను ప్రైవేటువారికి అప్పగించంటం ప్రభుత్వ విధానంగా ఉన్నది.ఇప్పుడు ఇది కూడా పార్కుగా మారితే అది ఖచ్చితంగా ప్రైవేటు వారి చేతులలోకి వెళుతుంది. ఈ గ్రౌండును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టటానికే ఈ ఆలోచన అని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. 
విజయవాడ రాజధానిలో భాగంగా మారింది. రాష్ట్రపాలన ఇక్కడనుండే మొదలయింది. దీనితో నగరంలోని స్థలాలపై కొంతమంది కన్ను పడింది. ఇటీవల విద్యాధరపురంలో ఉన్న ఆర్‌.టీ.సి స్థలాన్ని, ఆర్టీసీ ఉద్యోగుల ఆసుపత్రికి కాకుండా, ఇండో అమెరికన్‌ డెంటల్‌ ఆసుపత్రికి కట్టాబెట్టాలని ఆర్‌.టీ.సి ప్రయత్నించింది. ఇప్పుడు స్వరాజ్య మైదానం వంతు వచ్చింది. ఇలా నగరంలోని ఖాళీస్థలాలన్నింటనీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టమవుతున్నది. 
నగరంలో జనసంఖ్య పెరుగుతున్నది.దానితో అవసరాలు పెరుగుతున్నాయి. అందువలన స్వరాజ్యమైదానాన్ని పూర్తిస్థాయిలో ప్రజల ప్రయోజనార్ధం ఖాళీస్థలంగానే ఉంచాలని, సభలు సమావేశాలకు ఉచితంగా ఇవ్వాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తున్నది. 

(వి.సాంబిరెడ్డి)                                  (యం.వి.ఆంజనేయులు) 
అధ్యక్షులు                                                కార్యదర్శి

Saturday 5 December 2015

విజయవాడ నగరంలో ఏకైక పెద్ద గ్రౌండు స్వరాజ్యమైదానం. 
దానిని కాపాడుకోవటం మనందరి బాధ్యత 
స్వరాజ్య మైదానాన్ని (PWD గ్రౌండ్‌ను) కాపాడుకుందాం. 

సోదరీ సోదరులారా! 
మన విజయవాడ నగరం 10 లక్షల జనాభాగల పెద్దనగరం. ఇంత పెద్ద నగరంలో ప్రజల అవసరాల కోసం అనేక గ్రౌండ్లు కావాలి. కాని మన నగరానికి ఉన్న ఏకైక పెద్ద గ్రౌండు స్వరాజ్య మైదానం (ూఔణ గ్రౌండ్‌) మాత్రమే. ఇదికూడా మన చేయిజారిపోతే? ఇది అన్యాక్రాంతమైపోతే మన నగరం పరిస్థితి ఏమిటి? 
ఇది మన నగరానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నదో చూడండి. 
01. బుక్‌ ఎగ్జిబిషన్‌లాంటి విజ్ఞాన కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నది. 
02. భిన్నమతాలవారి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నది. 
03. ఈ గ్రౌండ్‌లో ఎందరో మహాను భావుల బహిరంగ సభలు జరిగాయి. వివిధ రాజకీయ 
పార్టీలు, ప్రజాసంఘాల బహిరంగ సభలు జరుగుతున్నాయి. ఆవిధంగా అది 
ప్రజాస్వామ్య కార్య క్రమాలకు ఉపయోగపడుతున్నది. 
04. పారిశ్రామిక, వ్యవసాయ ఎగ్జిబిషన్‌లకు ఉపయోగపడుతున్నది. 
05. హస్తకళలను ప్రోత్సహించే హస్తకళల ఎగ్జిబిషన్‌లకు ఉపయోగపడుతున్నది. 
06. సెలవుదినాలలో పిల్లలు ఆడుకోవటానికి ఉపయోగపడుతున్నది. 
07. డ్రైవింగ్‌ నేర్చుకునేవారికి ఉపయోగపడు తున్నది. 
08. రైతుబజార్‌ ద్వారా ప్రజలకు ఉపయోగపడుతున్నది. 
09. దీపావళి సమయంలో బాణసంచా అమ్మకాలకు ఉపయోగపడుతున్నది. 
10. గతంలో ఈ గ్రౌెండ్‌లోనే రూపావాణీ వారు గొప్పజాతీయ కళారూపాలు ప్రదర్శించారు. 11. వినోద కార్యక్రమాలైన సర్కస్‌లు లాంటివి జరుగుతున్నాయి. 
ఇలాంటి అనేక కార్యక్రమాలకు ఈ గ్రౌండు ఉపయోగపడుతున్నది. 
ఇన్నివిధాలుగా దశాబ్దాలుగా మనకు ఉపయోగపడుతున్న ఈ గ్రౌండును ఇప్పుడు మన ప్రజల అవసరాలకు అందుబాటులో లేకుండా చేయబోతున్నారు. ఇటీవల జరిగిన దీపావళి సమయంలో బాణసంచా అమ్ముకునేవారిని అనుమతించలేదు. బుక్‌ ఎగ్జిబిషన్‌ వారిని కూడా అనేక తర్జన భర్జనల అనంతరం కొద్దిభాగంలో అనుమతించారు. గతంలోలాగా మొత్తం గ్రౌండులో అనుమతించలేదు. డ్రైవింగ్‌ స్కూల్‌ వారిని జనవరిలో ఖాళీ చేయమని చెప్పినట్టు భోగట్టా. 
గతంలో ఎవరైనా హెలీకాప్టర్‌లో వస్తే వారికి హెలీపాడ్‌ ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఈ గ్రౌండులోనే హెలీపాడ్‌లు ఏర్పాటుచేశారు. రైతుబజారుతో సహా అందరినీ తొలగించి ఈ గ్రౌండును పార్కుగా మార్చబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే ఇది ప్రైవేటు వ్యక్తుల చేతులలోకి వెళ్ళటం ఖాయం. ఇప్పటికే నగరంలో ఉన్న లాభాలొచ్చే పార్కులను ప్రైవేటువారికి ఇచ్చారు. పార్కులను ప్రైవేటువారికి అప్పగించటం ప్రభుత్వ విధానంగా ఉన్నది.ఇప్పుడు ఇది కూడా పార్కుగా మారితే అది ఖచ్చితంగా ప్రైవేటు వారి చేతులలోకి వెళుతుంది. అంటే ఈ గ్రౌండును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడతారన్నమాట. 
మన నగరం రాజధానిలో భాగంగా మారింది. దీనితో నగరంలోని స్థలాలపై కొంతమంది కన్ను పడింది. ఇటీవల విద్యాధరపురంలో ఉన్న ఆర్‌.టీ.సి స్థలాన్ని, ఆర్టీసీ ఉద్యోగుల ఆసుపత్రికి కాకుండా, ఇండో అమెరికన్‌ డెంటల్‌ ఆసుపత్రికి కట్టాబెట్టాలని ఆర్‌.టీ.సి ప్రయత్నించింది. ఇప్పుడు స్వరాజ్య మైదానం వంతు వచ్చింది. ఇలా గ్రౌండ్‌లన్నీ ప్రజల అవసరాలకు లేకుండా చేస్తే నగర ప్రజలు కాలుతీసి కాలు పెట్టడానికి స్థలం ఉండదు. 
నగరంలో జనసంఖ్య పెరుగుతున్నది.దానితో అవసరాలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలకు మరిన్ని గ్రౌండ్లు కావాలి. అందుకు భిన్నంగా మనకున్న ఆ ఒక్క గ్రౌెండు కూడా లేకుండా పోతే మన నగర పరిస్థితి ఏమిటి? వినోద విజ్ఞాన కార్యక్రమాలు లేకుండా, రాజకీయ, సామాజిక సభలు సమావేశాలు జరగకుండా, ఆధ్యాత్మిక అవసరాలు తీరకుండా నగరంలో మనం ఎడారి బ్రతుకులు బ్రతకాలా? ఇవన్నీ జరగాలంటే గ్రౌండ్‌ కావాలి కదా? 
అందుకే విజయవాడ పౌరులుగా మనం మేల్కొనాలి. నగరంలోని ఖాళీ స్థలాలను కాపాడుకోవాలి. నగరానికి మకుటాయమానంగా ఉన్న స్వరాజ్య మైదానాన్ని కాపాడుకోవటం నగరంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. స్వరాజ్యమైదాన పరిరక్షణ వేదిక చేపట్టే కార్యక్రమాలలో కలసి రమ్మని విజ్ఞప్తి చేస్తున్నాం.సమైక్యంగా కదులుదాం.స్వరాజ్య మైదానాన్ని కాపాడుకుందాం. 
అభివందనాలతో 
స్వరాజ్య మైదాన పరిరక్షణ వేదిక-విజయవాడ 

Wednesday 18 November 2015

PRESS NOTE                                                     DATE: 18.11.2015

          విద్యాధరపురంలోని ఆర్‌టిసికి చెందిన స్థలాన్ని ఇండో అమెరికన్‌ డెంటల్‌ ఇస్టిట్యూట్‌కు అప్పగించాలని ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది. ఆ స్థలం ఆర్‌టిసికి అవసరంలేకపోతే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చి వేయాలని డిమాండు చేస్తున్నది. ఇండో అమెరికన్‌ డెంటల్‌ ఇస్టిట్యూట్‌ అనేది వైద్యరంగంలో ఒక కార్పొరేట్‌ వ్యాపార సంస్థ. ప్రైవేటు వ్యాపార సంస్థ కోసం ఆర్‌టిసి స్థలాన్ని ఇవ్వవలసిన అవసరం ఏమిటని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థల కార్యకలాపాల నిర్వహణకోసం ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తుంది. ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలు ఉంటే వాటిని కేటాయిస్తుంది. లేదా ప్రైవేటు ఆస్తులను భూసేకరణ చట్టప్రకారం సేకరించి కేటాయిస్తుంది. ఏవిధంగా కేటాయించిన్పటికీ అవి ప్రభుత్వ ఆస్తులే. అంటే ప్రజల ఉమ్మడి ఆస్తులు. ఏ ప్రభుత్వరంగ సంస్థ అయినా తనకు కేటాయించిన భూమి తన కార్యకలాపాలకు వాడుకోవాలి. తనకు అవసరంలేకపోతే తిరిగి ఆ స్థలాన్ని ప్రభుత్వానికి వాపసుచేయాలి లేదా స్థానిక సంస్థకు అప్పగించాలి. అంతేకాని ఇష్టారాజ్యంగా ప్రైవేటుసంస్థలకు అప్పగించడానికి, అది ఆర్‌టిసి అధికారుల సొంత ఆస్తికాదు. విజయవాడను రాజధానిలో భాగంగా గుర్తించిన తర్వాత వివిధ డిపార్టుమెంట్లకు చెందిన విలువైన స్థలాలను కాజేయటానికి అనేకమంది ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు వాటికి ఊతమిస్తున్నాయి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న పి.పి.పి విధానాలు, లీజువిధానాలు, ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను ప్రైవేటు సంస్థలు కాజేయటానికి ఉపకరిస్తున్నాయి. రాష్ట్ర పరిపాలన విజయవాడనుండి సాగుతున్న తరుణంలో వివిధ కార్యాలయాలకు, క్వార్టర్సుకు స్థలాలు అవసరమవుతున్నాయి. ఆర్టీసీ తోసహా మరే ప్రభుత్వ రంగసంస్థకు చెందిన స్థలమైనా , ఆసంస్థ వినియోగించుకోకుండా నిరుపయోగంగా ఉంటే ఆ స్థలాలలో ప్రభుత్వ కార్యాలను నిర్మించుకొని వాడుకోవచ్చు. లేదా ప్రభుత్వ ఉద్యోగులకు వసతిగృహాలు నిర్మించవచ్చు. ఇళ్ళ స్థలాలుగా మార్చి ఇళ్లలేనివారికి కేటాయించవచ్చు. అంతేగాని ప్రభుత్వ అవసరాలకు గాని, సంస్థ అవసరాలకుగాని వినియోగించుకోకుండా ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రజల ఆస్తులను కొల్లగొట్టడమే అవుతుంది. అందువలన ఆర్‌టీసికి అవసరంలేని స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తమ కార్యాలయాలు లేదా ఉద్యోగుల క్వార్టర్సు నిర్మించి వినియోగించుకోవాలని, లేదా లేఅవుట్‌ వేసి పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నది.

Sunday 16 August 2015

ఎ.పి ఎక్స్‌ ప్రెస్‌ను విశాఖ పట్టణాన్నుండి ప్రారంభించడం పట్ల టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం

ఎ.పి ఎక్స్‌ ప్రెస్‌ను రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడనుండి కాకుండా విశాఖ పట్టణాన్నుండి ప్రారంభించడం పట్ల టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. విశాఖ పట్టణాన్నుండి ప్రారంభించడానికి రైల్వేశాఖ, ప్రజా ప్రతినిధులు చెప్పిన కారణం సహేతుకంగాలేదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. విజయవాడనుండి బయలుదేరితే కేవలం అరగంటలోనే తెలంగాణోకి ప్రవేశిస్తుందని, దానివలన ఆంధ్ర ప్రజలకు ఒరిగేదేమీలేదని, అదే విశాఖ పట్టణాన్నుండి బయలు దేరితే ఆంధ్రలో కొన్ని జిల్లాలకు ఉపయోగమని అందుకే విశాఖపట్టణం నుండి ప్రారంభించామని చెబుతున్నారు. నిజానికి ఈ వాదనే నిజమైతే అనంతపురం నుండి విఖాఖపట్టణంమీదుగా నడిపితే రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలకు ఈ రైలు ఉపయోగపడుతుంది. విశాఖపట్టణం నుండే నడుపవలసిన అవసరంలేదు. నిజానికి విశాఖ పట్టణాన్నుండి ఢిల్లీకి వెళ్ళటానికి సమత ఎక్స్‌ప్రెస్‌ ( నం.12807), స్వర్ణజయంతి ఎక్స్‌ ప్రెస్‌ ( నం.12803), విశాఖ-న్యూ డిల్లీ ఎక్స్‌ ప్రెస్‌ ( నం.22415), లింక్‌ దక్షిణ్‌ ఎక్స్‌ ప్రెస్‌ ( నం.12861), విశాఖ -అమృత్‌ సర్‌ ఎక్స్‌ ప్రెస్‌ ( నం.12507) లు ఉన్నాయి. ఆవన్నీ విశాఖ పట్టణం నుండి బయలు దేరేవే. ఇప్పుడు మరో క్రొత్త రైలును విశాఖనుండే ప్రారంభించనవలసరంలేదు. కాని దేశరాజధానికి విజయవాడనుండి బయలుదేరే ఒక్క ఎక్స్‌ప్రెస్‌కూడా లేదు. విజయవాడనుండి దేశరాజధానికి ఒక సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలన్న డిమాండు ఎప్పటి నుండో ఉన్నది. ప్రజాప్రతి నిధులు కాని, రైల్వే శాఖ కాని ఏనాడూ ఆ డిమాండును పట్టించుకోలేదు. కాని విజయవాడ రాష్ట్ర రాజధాని అయిన తర్వాత ఎ.పి ఎక్స్‌ ప్రెస్‌ విజయవాడనుండి ప్రారంభమవుతుందని విజయవాడ ప్రజలు భావించారు. 2014 లో విజయవాడనుండి ఎ.పి ఎక్స్‌ ప్రెస్‌ నడుస్తుందని కేంద్రమంత్రులు ప్రకటించడంతో విజయవాడ నగర ప్రజల ఆకాంక్షకు బలం చేకూరింది. ఇప్పుడు విజయవాడనుండి కాకుండా విశాఖ నుండి ప్రారంభించడంతో విజయవాడ నగర ప్రజల ఆశలు అడియాశలుగా మారాయి. నిజానికి ఈ దౌర్భాగ్యస్థితి దేశంలో ఏరాష్ట్ర రాజధానికీలేదు. రాష్ట్ర రాజధాని విజయవాడ నుండి నడవవలసిన ఎ.పి ఎక్స్‌ ప్రెస్‌ను విశాఖపట్టణంనుండి నడపడానికి కారణం కేవలం విశాఖ పట్టణంలో జి.జే.పీ.కి చెందిన పార్లమెంటు సభ్యుడు ఉండటమే తప్ప మరో కారణంలేదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడుతున్నది. ఎ.పి ఎక్స్‌ ప్రెస్‌ విజయవాడనుండి కాకుండా విశాఖకు తరలి పోవటానికి విజయవాడ పార్లమెంటు సభ్యుని వైఫల్యంకూడా ఇందులో కొట్టొచ్చినట్లుగా కనుపిస్తున్నది. రాష్ట్ర రాజధానినుండి దేశరాజధానికి బయలు దేరే రైలు లేకపోవటం రాష్ట్ర ప్రభుత్వం కూడా సిగ్గుపడవలసిన విషయం. ఇప్పటికైనా ఎ.పి ఎక్స్‌ ప్రెస్‌ విజయవాడనుండి నడపటానికి విజయవాడ పార్లమెంటు సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది.

(యం.వి.ఆంజనేయులు)
కార్యదర్శి

Tuesday 11 August 2015

13.08.2015 న ప్ర‌జాశ‌క్తి దిన ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైన వ్యాసం

                                                         
                                  స్మార్ట్ సిటీ       

   ''స్మార్ట్‌ సిటీ'' ఇది అత్యంత ఆకర్షణీయమైన పేరు. భ్రమలకు వేదిక. ఆకాశాన్నంటే భవంతులు, విశాలమైన రోడ్లు, రయ్యిన దూసుకు వెళ్ళే కార్లు, మెట్రో రైళ్ళు, ఆఫీసులకు వెళ్ళకుండా ఇంట్లోకూర్చునే ఏపనైనా సమకూర్చుకునే విధంగా పధ్ధతులు, అందమైన పార్కులు, నీటి ఫౌంటైన్లు, ఈత కొలనులూ, పచ్చటి చెట్లు, జిగేల్‌ మనే లైట్లు- 'వావ్‌' ఎంత అందమైన నగరం. ఇలాంటి నగరం కావాలని ఎవరికి మాత్రం ఉండదూ? ఇవన్నీ స్మార్ట్‌ సిటీలో ఉంటాయని చాలామంది భావిస్తున్నారు. నిజంగా ఇవన్నీ స్మార్ట్‌ సిటీలో ఉంటాయా? లేక స్మార్ట్‌ సిటీ అన్న భ్రమలో మరేమైనా జరుగ బోతుందా? ఈ విషయాలను తెలుసుకోవాలంటే 25.06.2015 న ప్రధాన మంత్రి విడుదలచేసిన స్మార్ట్‌ సిటీ మార్గదర్శకాలను ( గైడ్‌ లైన్స్‌) క్షుణ్ణంగా పరిశీలించవలశిందే.
భారత దేశంలో 100 నగరాలను స్మార్ట్‌ సిటీలు రూపొందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరో 500 పట్టణాలను అమృత్‌ పథకం క్రింద అభివృధ్ధి చేస్తామని ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్‌లో 3 నగరాలను, తెలంగాణాలో 2 నగరాలను స్మార్ట్‌ సిటీలు గా ఎంపిక చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో విశాఖ పట్టణం, కాకినాడ, తిరుపతి నగరాలను, తెలంగాణాలో హైదరాబాద్‌, వరంగల్‌ నగరాలను స్మార్ట్‌ సిటీలుగా ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ సిటీలో చేరాలంటే ముందుగా ''స్మార్ట్‌ సిటీలో చేరటానికి ఆమోదిస్తున్నామని'' కౌన్సిల్‌ తీర్మానం చేయాలి, అలా తీర్మానం చేయమని ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని కార్పోరేషన్లను ఆదేశింవచింది. విజయవాడ నగరపాలక సంస్థ ఇమేరకు ఒకతీర్మానం కూడా చేసింది. ఈ పధకం 2015-16 నుండి 2019-2020 వరకు అంటే 5 ఏళ ్ళపాటు అమలులో ఉంటుంది.
అసలు స్మార్ట్‌ సిటీ అంటే ఏమిటీ? ఈ ప్రశ్నకు సర్వత్రా ఆమోదయోగ్యమైన నిర్వచనమేమీ లేదని, భిన్న ప్రజలకు భిన్న సౌకర్యాలు ఉంటాయని గైడ్‌ లైన్స్‌ ప్రారంభంలోనే పేర్కొన్నారు. అంటే నిర్ధిష్టమైన నిర్వచనమేమీ లేదన్నమాట. అయితే 10 ముఖ్యమైన అంశాలుంటాయని పేర్కొన్నారు. అవి 01) అవసరాలకు సరిపడా నీటిసరఫరా, 02) నిరంతర విద్యుత్‌ సరఫరా, 03) సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంటుతో సహా పారిశుధ్యం , 04)ప్రజారవాణాతో సహా సమర్ధవంతమైన రవాణాసదుపాయాలు,05) భరించగలిగిన ధరలలో, ముఖ్యంగా పేదవారికి గృహ సదుపాయం 06) బలమైన ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, డిజిటలైజేషన్‌, 07) సుపరిపాలన ముఖ్యంగా ఈ గవర్నెన్స్‌-ప్రజల భాగస్వామ్యం, 08) మంచి పర్యావరణం, 09) పౌరులకు, ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు, వృధ్ధులకు రక్షణ, 10) విద్య వైద్యం. ఈ 10 సదుపాయాలు ఉంటాయని ఆ గైడ్‌ లైన్స్‌లో స్పష్టంచేశారు,
ఈ 10 పనులను గమనిస్తే అందులో కొన్ని స్థానిక సంస్థలు చేసేవి, కొన్ని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చేసేవి ఉన్నాయి ఇందులో క్రొత్తగా ప్రతిపాదించిన సదుపాయాలేమీ లేవు. ఇవన్నీ ఇప్పటికే నగరాలలో ఎంతో కొంత మేర అమలు జరుగుతున్నాయి. కాకుంటే వాటిని మరింత పటిష్టంగా అమలు జరపటానికి చర్యలు తీసుకుంటామనేది వారి భావనగా పరిగణిద్దాం..
ఈ 10 అంశాలను అమలు జరపటం కోసం కొన్ని స్మార్ట్‌ పరిష్కారాలనుకూడా చూపించారు. ఉదాహరకు నీటిసరఫరాకు స్మార్ట్‌ నీటి మీటర్లు బిగించటం, లీకేజీలను అరికట్టడం, నీటి నాణ్యతను పరిశీలించటం, అలాగే పారిశుధ్ధ్యం కోసం చెత్తనుండి విద్యుత్‌తయారీ, చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చటం, మరుగునీటిని శుధ్ధి చేయటం- ఇలా పై 10అంశాలకు స్మార్ట్‌ పరిష్కారాలను పేర్కొన్నారు. స్థలాభావంవలన 10 పనులకు వారు పేర్కొన్న స్మార్ట్‌ పరిష్కారాలను పూర్తిగా ఇవ్వటం సాధ్యం కావటం లేదు. నిజానికి గైడ్‌ లైన్స్‌లో పేర్కొన్న ఈ స్మార్ట్‌ పరిష్కారాలను పరిశీలిస్తే ఇప్పటివరకు ప్రభుత్వాలు చెబుతున్న పాత పరిష్కారాలే తప్ప ప్రత్యేకించి క్రొత్త పరిష్కారాలేవీ లేవు.
పని, పరిష్కారం రెండూ క్రొత్తవి కానప్పుడు మరి స్మార్ట్‌సిటీ పధకంలో క్రొత్త ఏమిటి?
క్రొత్త ఏమిటంటే ఈ పనులను చేయటానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయటం. ఇప్పటివరకూ ఈ పనులను మున్సిపాలిటీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయటం చూశాము. ఇక మీదట ఈ పనులన్నీ కంపెనీ నిర్వహిస్తుంది. దీనిని మరింత లోతుగా పరిశీలిద్దాం.
స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో ఇచ్చిన పనులను అమలు జరపడం కోసం స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు ఎంపికైన ప్రతి నగరానికీ ఒక కంపెనీని ఏర్పాటు చేస్తారు.దీనికి స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ అని ముద్దు పేరు పెట్టారు. ఈ కంపెనీ 2013 కంపెనీ చట్టం ప్రకారం ఏర్పాటు అవుతుంది. దీనికి ఒక పూర్తికాలపు సి.ఇ.వో (ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌) ఉంటాడు. దీనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున, మున్సిపల్‌ కార్పొరేషన్‌ తరఫున కొంతమంది, వీటితో సంబంధంలేనివారు కొంతమంది డైరెక్టర్లుగా ఉంటారు. ఈ కంపెనీలో ప్రాధమికంగా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్‌ కార్పొరేషన్‌ చెరిసగం వాటాలను (50:50) కలిగి ఉంటాయి. అతరువాత ఆ కంపెనీ 40 శాతం వరకు షేర్లు అమ్మవచ్చు. అంటే ఈ కంపెనీని ప్రభుత్వం నెలకొల్పినప్పటికీ, షేర్లు కొనటం ద్వారా ప్రైవేటు సంస్థలు కంపెనీ యాజమాన్యంలోకి చేరతాయన్నమాట.
ఈ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టును నిర్వహించటానికి దేశ స్థాయిలో ఒక అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో 8 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. ఇందులో బ్యూరోక్రాట్లే తప్ప ఎన్నికైన ప్రజా ప్రతినిధులెవరూ ఉండరు. వీరు తమ సమావేశాలకు ఐక్యరాజ్య సమితీ ప్రతినిధులను, ప్రపంచబ్యాంకు, టి.ఇ.ఆర్‌.ఐ. సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌, బెంగుళూరుకు చెందిన సెంటర్‌ ఫర్‌ స్మార్ట్‌ సిటీస్‌కు చెందిన ప్రతినిధులను ఆహ్వానించవచ్చు. అలాగే ద్వైపాక్షిక, బహుళ పాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్న వారి ప్రతినిధులను, పట్టణ ప్రణాళిక నిపుణులను పిలువవచ్చు,. అలాగే రాష్ట్ర స్థాయిలో 8 మంది బ్యూరోక్రాట్లతో కూడిన హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ ఉంటుంది, నగర స్థాయిలో 2013 కంపెనీ చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన కంపెనీ ఉంటుంది. ఈ మొత్తంలో ఎక్కడా ప్రజాస్వామ్య బధ్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు స్థానంలేదు.
2013 కంపెనీ చట్టం ప్రకారం నగర స్థాయిలో ఏర్పాటు చేసిన కంపెనీ స్మార్ట్‌సిటీలో జరిగే పనులను నిర్వహిస్తుంది. అయితే మున్సిపల్‌ కార్పొరేషన్‌, అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ డిపార్టుమెంట్‌, రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టబధ్ధమైన కొన్ని అధికారాలు ఉన్నాయి. నిర్ణయాలు చేసే అధికారాలు ఉన్నాయి. వీటికి చట్టబధ్దమైన అధికారాలున్నంతకాలం కంపెనీ స్వేఛ్చగా పని చేయలేదు. అందుకోసం స్మార్ట్‌ సిటీ గైడ్‌ లైన్స్‌లో ఒక స్మార్ట్‌ పరిష్కారాన్ని పొందుపరిచారు.
1) స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పనులకు సంబంధించి మున్సిపల్‌ కౌన్సిల్‌ కు ఉన్న హక్కులు, బాధ్యతలు నగరస్థాయి కంపెనీకి బదలాయించాలి.
2) మున్సిపల్‌ చట్టప్రకారం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఉన్న నిర్ణయాలు చేసే హక్కును ఆ కంపెనీకి బదలాయించాలి.
3) పట్టణాభివృధ్ధి శాఖకు ఉన్న నిర్ణయం చేసేహక్కు ,ఆమోదించే హక్కులను ఆకంపెనీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లకు బదలాయించాలి.
4) రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అవసరమైన విషయాలలో, ఆమోదించే హక్కును రాష్ట్ర ప్రభుత్వాన్నుండి ఈ స్మార్ట్‌ సిటీలకోసం ఏర్పడే రాష్ట్ర స్థాయి హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీకి బదలాయించాలి.
అంటే మున్సిపాలిటీకి, మున్సిపల్‌ శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులన్నీ ఈ కంపెనీలకు బదలాయించాలన్నమాట. నగరపాలనకు సంబంధించి కౌన్సిల్‌, మున్సిపల్‌ డిపార్టుమెంటు, రాష్ట్ర ప్రభుత్వం తన హక్కులను పూర్తిగా కోల్పోతాయి.కార్పొరేషన్‌ ఇక చేయగలిగింది ఏమీ ఉండదు. ఎన్నికైన కౌన్సిళ్ళు ఏపని చేయాలన్నా కంపెనీల దయాదాక్షిణ్యాలమీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఏపని కావాలన్నా మున్సిపల్‌ అధికారులు కూడా ఆ కంపెనీలమీదనే ఆధారపడాలి.
నగరంలో జరిగే ఈ పనులన్నింటికీ సంబంధించి ప్లానింగ్‌, మదింపు, ఆమోదం, నిధులు విడుదలచేయటం, అమలు జరపటం, నిర్వహించటం లాంటి సర్వాధికారాలు ఈకంపెనీకే ఉంటాయని స్మార్ట్‌ సిటీ గైడ్‌ లైన్స్‌లో స్పష్టం చేసారు. మరి ఈ కంపెనీకి నిధులు ఎలా వస్తాయి?
కేంద్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం రు|| 194 కోట్లు, అక్కడనుండి ప్రతి ఏటా రు|| 98 కోట్ల చొప్పున 3 ఏళ్ళు ( అంటే 294 కోట్లు) ఇస్తుంది. అంటే మొత్తం 4 ఏళ్ళలో 488 కోట్లు ఇస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, దానికి మ్యాచింగ్‌ గా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇచ్చేది ప్రాజెక్టు ఖర్చులో కొద్ది భాగం మాత్రమేనని గైడ్‌ లైన్స్‌లోనే స్పష్టం చేశారు. ఇంకా చెప్పాలంటే ఇది కంపెనీకి కార్పస్‌ ఫండ్‌ మాత్రమే. ప్రాజెక్టు ఖర్చును యూజర్‌ చార్జీలు. లబ్ధి దారుల చార్జీలు, ఇంపాక్టు ఫీజులు, భూవినియోగం,అప్పులు చేయటం, లోన్లు తదితర మార్గాల ద్వారా సమకూర్చుకోవాలి. 14వ ఆర్ధిక సంఘం నిధులు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు వచ్చే డబ్బును వాడుకోవాలి. మున్సిపల్‌ బాండ్లను విడుదలచేయటం, పన్నులనిరంతర పెంపుదల వ్యవస్థను ఏర్పాటు చేయటం ద్వారా సమకూర్చుకోవాలి. అంటే స్మార్ట్‌ సిటీకి అయ్యే ఖర్చు మొత్తం వివిధ రూపాలలో ప్రజలు చెల్లించాల్సిందే.
స్మార్ట్‌ సిటీని ఆమోదిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా నశిస్తుంది. నగరపాలన కంపెనీ పాలనగా మారుతుంది. నగరంలో జరిగే పనులకు అయ్యేఖర్చును పూర్తిగా నగర ప్రజలే భరించవలసి వస్తుంది. నగరంలో జరిగే పనులకు అయ్యేఖర్చును మాత్రమే కాదు. కంపెనీలో షేర్‌ ¬ల్డర్ల లాభాలనుకూడా నగర ప్రజలే భరించాలి. రాష్ట్రాభివృధ్ది కోసం ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు. ఆ పన్నులనుండి నగరాల అభివృధ్ధికి ఖచ్చితంగా వాటా ఇవ్వాలి. ఎందుకంటే స్థానికంగా జరిగే అభివృధ్ధి లేకుండా రాష్ట్రాభివృధ్ధి ఉండదు. కనక స్థానిక అభివృధ్ధికి రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా నిధులు ఇవ్వవలసిందే. నిజానికి రాష్ట్ర ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సులలో పేర్కొన్న విధంగారాష్ట్ర ప్రభుత్వం ఆదాయంనుండి 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు కేటాయిస్తే, స్మార్ట్‌ సిటీ పథకంతో సంబంధంలేకుండా ఆంధ్ర, తెలంగాణాలలోని అన్ని పట్టణాలను,నగరాలను స్మార్ట్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ పథకంలో చేరితే ఇక మీదట నగరానికి రూపాయిరాదు. ప్రతిపనీ నగరప్రజలు డబ్బులిచ్చి చేయించుకోవలసిందే. చివరకు నగరపాలనే అస్తవ్యప్తంగా మారుతుంది. నగర ప్రజలు ప్రజాతంత్ర హక్కులను కోల్పోతారు. కంపెనీల పాలన మొదలవుతుంది.
నగరాల అభివృధ్ధికి లక్షల కోట్ల రూపాయలు కావాలని, ప్రభుత్వాల వద్ద అంత డబ్బు లేదని అందుకే ప్రైవేటు వారిని ప్రోత్సహించాలని, ప్రైవేటు వారు సౌకర్యాలు ఏర్పాటు చేసి, వారిలాభాలతో సహా ప్రజలనుండి వారే వసూలు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఇది నిజం కాదు. గత 10 ఏళ్ళ కాలంలో కేంద్ర ప్రభుత్వం బడా కంపెనీలకు, బహుళ జాతి కంపెనీలకు రు|| 43 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చింది. జాతీయ బ్యాంకులలో 2014 డిశంబరు నాటికి ఉన్న మొండి బకాయీలు రు|| 2,60,531 కోట్లు. ఇవన్నీ బడా బాబులు ఎగ్గొట్టినవే. వీటన్నింటిలో 10 వ వంతు వసూలు చేసినా దేశంలోని పట్టణాలన్నింటినీ స్మార్ట్‌ గా మార్చవచ్చు. ఇలా లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు రాయితీలివ్వటం, బ్యాంకుల వద్దనున్న ప్రజాధనాన్ని ప్రజల అవసరాలకు కాకుండా కార్పొరేట్‌ అవసరాలకు వాడటం, వారు ఎగ్గొడితే చూస్తూ ఊరుకోవటం చేస్తుంటే ప్రభుత్వం వద్ద డబ్బెలా ఉంటుంది? కార్పొరేట్‌ కంపెనీలకిస్తున్న లక్షలకోట్ల పన్ను రాయితీలను రద్దు చేయటం, బ్యాంకులకు బకాయిలున్న సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసి ఆడబ్బును బ్యాంకులకు జమ చేయటం, జీవిత బీమా సంస్థ, బ్యాంకులలో ఉన్న ప్రజల ధనాన్ని ప్రజల సౌకర్యాల కోసం వాడటంచేస్తే ప్రభుత్వం వద్ద నగరాల అభివృధ్ధికి నిధులు సమకూరుతాయి. అప్పుడు స్మార్ట్‌ సిటీలు మాత్రమే కాదు గ్రామాలను కూడా స్మార్ట్‌ గా చేయవచ్చు. దేశమంతా సౌకర్యాలు కల్పించవచ్చు
స్మార్ట్‌ సిటీ గైడ్‌ లైన్స్‌లో ఇచ్చిన అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు జరపడం ప్రారంభించింది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతనంగా నిర్మించే రాజధానికి '' కాపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌'' పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేస్తూ 02.05.2015 న జీ.వో. నెం.109 ఇచ్చింది. అదేరోజు ఈ కంపెనీ కి కొన్ని అధికారాలు ఇస్తూ జీ.వో. నెం.110 ఇచ్చింది. ఈ జీవోలో నగరంలో యూజర్‌ చార్జీలు, నగర మెయింట్‌నెన్స్‌ చార్జీలు వసూలు చేసే అధికారాన్ని, మార్కెట్‌లో షేర్లు అమ్మే అధికారాన్ని, అప్పులు చేసే అధికారాన్ని ఆ కంపెనీకి ఇచ్చారు. చివరకు నగరంలో అభివృధ్ధి చేయాల్సిన స్థలాలను ఇతర కంపెనీలకు 99 ఏళ్లకు లీజుకు ఇచ్చే అధికారాన్ని కూడా ఈ కంపెనీకి కట్టబెట్టారు.
నగరంలో ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, నీటి కుళాయి కావాలన్నా. రోడ్డు కావాలన్నా, విద్యుత్‌ కావాలన్నా, ఏం కావాలన్నా స్మార్ట్‌ సిటీలో కంపెనీ దయాదాక్షిణ్యాల మీద ఆధార పడవలసిందే. స్మార్ట్‌ సిటీ గైడ్‌ లైన్స్‌లో ఇచ్చిన అంశాలన్నీ యధాతధంగా అమలు జరిగితే నగరం అత్యంత ఖరీదైనదిగా మారుతుంది. ఆ నగరంలో సామాన్యులకు బ్రతుకు ఉండదు. నిరంకుశత్వం నగరంమీద రాజ్య మేలుతుంది. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కాలపరిమితి 5 ఏళ్ళు మాత్రమే. కాని అది ఏర్పాటు చేసిన కంపెనీ మాత్రం శాశ్వితంగా ఉంటుంది, కంపెనీ పాలన శాశ్వితంగా కొనసాగుతుంది. అందుకే స్మార్ట్‌ సిటీ కంపెనీలకు, ధనవంతులకు స్మార్ట్‌. అత్యధికులైన సాధారణ ప్రజలకు నష్టం. ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. ఫెడరల్‌ వ్యవస్థకు విఘాతం.

                                                    -యం.వి. ఆంజనేయులు
                                                                సెక్రెటరీ
                                               టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌


Wednesday 5 August 2015

Debate by M.V.Anjaneyulu, Secretary, Tax Payers Association on Smart Cities on 10TV on 05.08.2015


స్మార్ట్ సిటీలు ఇప్పుడు భారత ప్రభుత్వం ఇస్తున్న సుందర నినాదమిది. మన దేశంలో 100 స్మార్ట్ సిటీలను నిర్మించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 6 నగరాలను స్మార్ట్ సిటీల కోసం ఎంపిక చేశారు. అయితే, ఈ స్మార్ట్ సిటీలు ఎలా వుండబోతున్నాయి? వీటి ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం వుంది? అసలు ఈ స్మార్ట్ సిటీల నిర్మాణం ఎవరి కోసం? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నేత ఆంజనేయులు విశ్లేషించారు.

Letter To Corporators of Viojayawada Municipal Corporation on SMART CITIES

                                                                                                  తేదీ: 31.07.2015
గౌరవనీయులైన కార్పొరేటర్‌ గారికి
ఆర్యా,
5.8.2015 న మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగ బోతున్నది. ఈ సమావేశంలో విజయవాడ నగరాన్ని స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో చేర్చటానికి కౌన్సిల్‌ ఆమోదం కోరుతూ ఆఫీసువారు ఒక ప్రతిపాదనను పెట్టి యున్నారు. అలా ప్రతిపాదన పెట్టమని రాష్ట్ర ప్రభుత్వం 30.06.2015 న గౌరవనీయులైన మున్సిపల్‌ కమీషనర్‌కు, గౌరవనీయులైన మేయర్‌గారికి ఒక సర్క్యులర్‌ పంపింది. దానికి అనుగుణంగానే ఈ ప్రతిపాదనను ఆఫీసువారు ఎజెండాలో పెట్టియున్నారు. ఈ ప్రతిపాదనను ఆమోదించకుండా, తిరస్కరించవలసిందిగా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మిమ్ములను కోరుతున్నాము. తిరస్కరించమని మిమ్ములను కోరటానికి గల కారణాలను ఈ లేఖద్వారా మీముందుంచదలుచుకున్నాము.
స్మార్ట్‌ సిటీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టినపథకం. ఈ పథకాన్ని 25.06.2015న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ పథకంలో ఉన్న ముఖ్యాంశాలు.
01. స్మార్ట్‌ సిటీ ద్వారా సమకూరే సదుపాయాలు:- నిరంతర నీటిసరఫరా, ఖచ్చితమైన విద్యుత్‌ సరఫరా, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంటు, రవాణాసదుపాయాలు, గృహనిర్మాణం, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, ఈ గవర్నెన్స్‌, పర్యావరణం, పౌరులకు రక్షణ, విద్యవైద్యంలాంటి సదుపాయాలు ఉంటాయి.
ఇవన్నీ వింటానికి బాగానే ఉన్నాయి. ఇందులో చాలవిషయాలు ఇప్పటికే ఉన్నవే. వీటిని ఏర్పాటు చేయవలసింది మున్సిపల్‌ కార్పొరేషన్‌ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చాలి. అందుకు భిన్నంగా స్మార్ట్‌ సిటీల పేరుతో ఏం చేయబోతున్నారన్నది దిగువన ఇస్తున్నాము.
02. మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేసే ఈ పనులను నిర్వహించటం కోసం, ఇకమీదట ప్రతిపనికీ ఒక కంపెనీని ఏర్పాటుచేస్తారు. అంటే నీటి నిర్వహణకు ఒక కంపెనీ, పారిశుధ్ద్యానికి ఒక కంపెనీ, రవాణాకు ఒక కంపెనీ- ఇలా ప్రతి పనికీ ఒక కంపెనీని ఏర్పాటు చేస్తారు. ఈ కంపెనీలను 2013 కంపెనీ చట్టం ప్రకారం ఏర్పాటు చేస్తారు. ఈ కంపెనీలు షేర్లు అమ్ముకోవచ్చు. షేర్లు అమ్మాలంటే ముందు కంపెనీలో కొంత ప్రారంభ పెట్టుబడి కావాలి. దానిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుతాయి.
03. ఈ కంపెనీలే నగరంలో పనులను నిర్వహిస్తాయి. పనులు నిర్వహించటమే కాదు. ఆ పనులకయ్యే ఖర్చును పూర్తిగా మననుండే వసూలు చేస్తాయి. ఇకమీదట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగరంలో అభివృధ్ధి పనులకు నిధులు ఇవ్వవు. పనులకయ్యే ఖర్చును, వాటి నిర్వహణకయ్యే ఖర్చును ఎంతయిందో లెక్కగట్టి, ఆ మొత్తాలను పూర్తిగా నగరప్రజలనుండే ఈ కంపెనీలు యూజర్‌ చార్జీలపేరుతో వసూలు చేస్తాయి. యూజర్‌ చార్జీలను నిర్ణయించేది వసూలు చేసేదీ ఈ కంపెనీలే తప్ప మున్సిపాలిటీ కాదు.
04.మున్సిపల్‌ చట్ట ప్రకారం ఈ పనులన్నీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేయాలి. కాని ఆపనులను కంపెనీలు చేయాలంటే చట్టం అడ్డు వస్తుంది. ఈ అడ్డు తొలగించుకోవటం కోసం ఏం వ్రాసి ఉందోచూడండి.
అ) స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కు సంబంధించిన పనులకు సంబంధించి మున్సిపల్‌ కౌన్సిల్‌ కు ఉన్న హక్కులు, బాధ్యతలు ఆకంపెనీలకు బదలాయించాలి.
ఆ) మున్సిపల్‌ చట్టప్రకారం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఉన్న నిర్ణయాలు చేసే హక్కును ఆ కంపెనీలకు బదలాయించాలి.
ఇ) పట్టణాభివృధ్ధి శాఖకు ఉన్న నిర్ణయం చేసేహక్కు ,ఆమోదించే హక్కులను ఆకంపెనీల బోర్డు డైరక్టెర్లకు బదలాయించాలి.
ఈ) రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అవసరమైన విషయాలలో, ఆమోదించే హక్కును రాష్ట్ర ప్రభుత్వాన్నుండి ఈ
స్మార్ట్‌ సిటీలకోసం ఏర్పడే రాష్ట్ర స్థాయి హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీకి బదలాయించాలి.
అంటే మున్సిపాలిటీకి, మున్సిపల్‌ శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులన్నీ ఈ కంపెనీలకు బదలాయించాలన్నమాట.
ఇందులో మేము వ్రాస్తున్న ప్రతి అంశము స్మార్ట్‌ సిటీ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన గైడ్‌ లైన్స్‌లో ఉన్నవే తప్ప మా సొంతంకాదు. ఇప్పుడు కార్పొరేషన్‌ అధికారులు చేసిన ప్రతిపాదనను కౌన్సిల్లో అమోదిస్తే వీటన్నింటికీ మీరు ఆమోదించడమమే అవుతుంది. ఇది మీరు ఆమోదిస్తే నగరం మొత్తం కంపెనీల పాలనలోకి వెళుతుంది. నగరపాలనకు సంబంధించి కౌన్సిల్‌, మున్సిపల్‌ డిపార్టుమెంటు, రాష్ట్ర ప్రభుత్వం తన హక్కులను పూర్తిగా కోల్పోతాయి.కార్పొరేషన్‌ ఇక చేయగలిగింది ఏముండదు. ఇక ఎన్నికైన కార్పొరేటర్‌గా మీరు ఏపని చేయాలన్నా కంపెనీ దయాదాక్షిణ్యాలమీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఏపని కావాలన్నా మున్సిపల్‌ అధికారులు కూడా ఆ కంపెనీలమీదనే ఆధారపడాలి. నగర ప్రజలమీద విపరీతంగా భారాలు పడతాయి. నగర ప్రజలు నిలువు దోపిడీకి గురవుతారు.
రాష్ట్రాభివృధ్ది కోసం ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు. ఆ పన్నులనుండి మన నగరాభివృధ్ధికి ఖచ్చితంగా వాటా ఇవ్వాలి. మననగరానికేకాదు. రాష్ట్రంలో అన్ని స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వాలి. ఎందుకంటే స్థానికంగా జరిగే అభివృధ్ధి లేకుండా రాష్ట్రాభివృధ్ధి ఉండదు. కనక స్థానిక అభివృధ్ధికి రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా నిధులు ఇవ్వవలసిందే. ఈ పథకంలో చేరితే ఇక మీదట నగరానికి రూపాయిరాదు. ప్రతిపనీ మనండబ్బులిచ్చి చేయించుకోవలసిందే. చివరకు నగరపాలనే అస్తవ్యప్తంగా మారుతుంది. గతంలో 2005 నుండి 2010 వరకు జరిగిన కౌన్సిల్‌లో జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం. పథకాన్ని సి.పి.యం సభ్యులు మినహా మిగతా అందరూ ఆమోదించారు. దాని షరతుల ఫలితంగా నగరపాలక సంస్థ ఎంత దెబ్బతిన్నదో చూచాము. ఇప్పుడు ఈ స్మార్ట్‌ సిటీ పథకాన్ని ఆమోదిస్తే నగర పరిస్థితి మరింత దిగజారుతుంది. నగర ప్రజలు ప్రజాతంత్ర హక్కులను కోల్పోతారు. కంపెనీల పాలన మొదలవుతుంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించే రాజధానికి '' కాపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌'' పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేస్తూ 02.05.2015 న జీ.వో. నెం.109 ఇచ్చింది. అదేరోజు ఈ కంపెనీ కి కొన్ని అధికారాలు ఇస్తూ జీ.వో. నెం.110 ఇచ్చింది. ఈ జీవోలో నగరంలో యూజర్‌ చార్జీలు, నగర మెయింట్‌నెన్స్‌ చార్జీలు వసూలు చేసే అధికారాన్ని, మార్కెట్‌లో షేర్లు అమ్మే అధికారాన్ని, అప్పులు చేసే అధికారాన్ని ఆ కంపెనీకి ఇచ్చారు. చివరకు నగరంలో అభివృధ్ధి చేయాల్సిన స్థలాలను ఇతర కంపెనీలకు 99 ఏళ్లకు లీజుకు ఇచ్చే అధికారాన్ని కూడా ఈ కంపెనీకి కట్టబెట్టారు. అలాగే పట్టణాలలో ఉన్న మున్సిపల్‌ ఖాళీ స్థలాలలను ప్రైవేటీకరించటం కోసం '' ఎ.పి. అర్బన్‌ గ్రీనింగ్‌ & బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌'' ఏర్పాటు చేశారు. దీనిక్రిందకు పట్టణాలలో ఉన్న మున్సిపల్‌ ఖాళీ స్థలాలు, ఇతర ఖాళీ స్థలాలు, పార్కులు, గ్రీన్‌ జోన్‌లో వస్తాయి. ఇవి కేవలం ప్రారంభంమాత్రమే. మీరు ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే మననగరం కూడా ఇలాగే కంపెనీల క్రిందకు పోతుంది. చివరకు ప్రజలు హక్కులు కోల్పోతారు. కంపెనీల ధనదాహానికి బలవుతారు. ప్రజాతంత్ర వ్యవస్థ నశించిపోతుంది. అందుకే ఈ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు ప్రతిపాదనను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము వ్యతిరేకిస్తున్నాము.

నగర ప్రయోజనాల రీత్యా ఈ స్మార్ట్‌ సిటీ ప్రతిపాదనను మీరు కూడా వ్యతిరేకించవలసిందిగా కోరుతున్నాము.
అభివందనాలతో

(యం.వి. ఆంజనేయులు)                            (వి.శ్రీనివాస్‌)
సెక్రెటరీ                                                 జాయింట్‌ సెక్రెటరీ