Monday 23 September 2013

Letter written to Chief Minister of AP on Information Technology Investment Region

                                                                   తేదీ: 23.09.2013

గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారికి,

ఆర్యా,

హైదరాబాద్‌ నగరంలో ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐ.టి.ఐ.ఆర్‌) ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిలో ఐ.టి., ఐటి ఆధారిత సేవలు మరియు ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమలు వస్తాయని. వీటిద్వారా రు. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, ప్రత్యక్షంగా 15 లక్షల మందికి, పరోక్షంగా 55.9 లక్షలమందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇంత భారీగా ఉపాధి లభించే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే ఆహ్వానించదగినదే. కాని ఈ పరిశ్రమలను హైదరాబాదు నగరంలో ఏర్పాటు చేయటాన్ని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము వ్యతిరేకిస్తున్నాము. రాష్ట్రంలోని ఇతర నగరాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాము. మా డిమాండ్‌కు గల కారణాలను మీముందుంచుతున్నాము.

సంస్కరణలపేరుతో గత తెలుగుదేశం ప్రభుత్వంనుండి నేటి మీ నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వరకు కేంద్రీకృత ఆర్ధిక విధానాలనే అమలు జరుపుతూవచ్చారు. ఫలితంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాలను బలిపెట్టి హైదరాబాదును అభివృధ్ధి చేశారు. రాష్ట్రం లోకి వచ్చిన పరిశ్రమలను, కేంద్ర ప్రభుత్వ సంస్ధలను అన్నింటినీ హైదరాబాదులోనే కేంద్రీకరించారు. ఈ పరిశ్రమలకోసమని మౌలిక సదుపాయాలను సైతం హైదరాబాదులోనే అభివృధ్ధి చేశారు. కేంద్రీయ యూనివర్శిటీలతో బాటుగా అనేక ముఖ్యమైన యూనివర్శిటీలను హైదరాబాదులోనే నెలకొల్పారు. చివరకు తెలుగు యూనివర్శిటీని సైతం ఉర్దూ ప్రాంతమైన హైదరాబాదులోనే నెలకొల్పారు. ఇప్పుడు మరల హైదరాబాదును ఎడ్యు కేషన్‌ హబ్‌గా తయారు చేస్తామని ప్రకటించారు. ఏ క్రొత్త పరిశ్రమ వచ్చినా దానిని హైదరాబాదుకే ఆహ్వానించటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఫలితంగా పరిశ్రమల కేంద్రీకరణ, విద్య కేంద్రీకరణ, సౌకర్యాల కేంద్రీకరణ, సంపద కేంద్రీకరణ అంతా హైదరాబాదులోనే జరిగింది. రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలు పారిశ్రామిక ఎడారులుగా మారాయి. ప్రపంచీకరణలో భాగంగా మీరనుసరించిన విధానాలవలన అప్పటివరకు రాష్ట్రంలో ఉన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, చేతివృత్తులు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని అన్నిపట్టణాలలో ఉపాధి తీవ్రంగా దెబ్బతిన్నది. పరిశ్రమలు, విద్య, సంపద, సౌకర్యాలు అన్నీ హైదరాబాదులో కేంద్రీకరించటం మూలంగా ఉపాధి అవకాశాలు హైదరాబాదులోనే పెరిగాయి. దీనితో ఉపాధి వెతుక్కుంటూ రాష్ట్రంలోని అన్ని పట్టణాలనుండి విద్యాధికులు, చేతివృత్తులవారు, కార్మికులు అందరూ హైదరాబాదుకు రావలసివచ్చింది. ఫలితంగా హైదరాబాదులో స్థలం చాలక చుట్టు ప్రక్కల ఉన్న మున్సిపాలిటీలను, గ్రామాలను కలిపి గ్రేటర్‌ హైదరాబాదు చేయవలసివచ్చింది. దీనిని స్వార్ధపరులు అవకాశంగా తీసుకొని తమకు ఉపాధి లేకపోవటానికి కారణం మరో ప్రాంతంవారేనని తెలంగాణా ప్రజలను రెచ్చ గొట్టారు. ఫలితంగా విభజన వాదం తలెత్తింది. రాష్ట్రం విడిపోతే తమ విద్య ఉపాధి పరిస్తితేమిటని కోస్తా రాయలసీమ ప్రాంత వాసులకు భయంపట్టుకున్నది. ఫలితంగా రాష్ట్రం అల్లకల్లోలంగా తయారైంది. రాష్ట్రంలోని అన్ని పట్టణాలను అభివృధ్ధి చేసినట్లయితే ఈ పరిస్థితి ఏర్పడి ఉండేదికాదు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృధ్ది కలిస్తే రాష్ట్రాభివృధ్ది అభివృధ్ధి అవుతుంది తప్ప, కేవలం హైదరాబాదు అభివృధ్ధే రాష్ట్రాభివృధ్ది కాదన్న విషయం మీకు తెలియందికాదు. తెలుగు దేశం, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అనుసరించిన ఈ కేంద్రీకరణ విధానాల వలననే రాష్ట్రానికి ఈ దుర్గతి దాపురించింది. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం ఈ కేంద్రీకరణ విధానాలు విడనాడి, పారిశ్రామిక వికేంద్రీకరణ, సౌకర్యాల వికేంద్రీకరణ. విద్యావికేంద్రీకరణ జరపాలని, రాష్ట్రంలోని 181 మున్సిపల్‌ పట్టణాలలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము డిమాండు చేస్తున్నాము. దీనివలన అన్ని పట్టణాలలో ఎక్కడివారికి అక్కడే ఉపాధి లభిస్తుందని, తద్వారా విభజన ఉద్యమాలు సమసిపోతాయని స్పష్టం చేస్తున్నాము.

ఇప్పటికే హైదరాబాదులో ఐటీ పరిశ్రమ ఉన్నది. లక్షల సంఖ్యలో ఉద్యోగులు వాటిలో పని చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి రాబోతున్న ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐ.టి.ఐ.ఆర్‌) ప్రత్యక్షంగా పరోక్షంగా మరో 70 లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. ఈ సంఖ్య హైదరాబాదులో ప్రస్తుతం ఉన్న జనసంఖ్యతో సమానం. ఇన్ని లక్షల మంది మరల హైదరాబాదుకు చేరితే హైదరాబాదుతో బాటుగా రాష్ట్రం మరింత ధ్వంసం అవుతుందని స్పష్టం చేస్తున్నాము.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఐ.టి.ఐ.ఆర్‌ పేరుతో రాష్ట్రానికి రానున్న ఐ.టి., ఐటి ఆధారిత సేవలు మరియు ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమలను ఒకే చోట కాకుండా, విభజించి, హైదరాబాద్‌లో కాకుండా రాష్ట్రంలోని ఇతర 18 మున్సిపల్‌ కార్పొరేషన్‌ నగరాలలో ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము.

ఇక మీదట ఏ పరిశ్రమ వచ్చినా హైదరాబాదులో కాకుండా రాష్ట్రంలోని ఇతర మున్సిపల్‌ పట్టణాలు,నగరాలలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. కొన్ని కేంద్ర ప్రభుత్వ ముఖ్య కార్యాలయాలను రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నాము.

విజయవాడలో ఐ.ఐ.టీ ని ఏర్పాటుచేయాలని, గన్నవరం ఐ.టి. పార్కును అభివృద్ధి చేయాలని, విజయవాడ పరిసర ప్రాంతాలలో ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమలను ఏర్పాటుచేయాలని డిమాండు చేస్తున్నాము.
                          అభివందనాలతో
(వి.సాంబిరెడ్డి)                                    (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు                                                  కార్యదర్శి