Tuesday, 11 April 2017

Press Meet Video on 10.04.2017


Press Meet on 10.04.2017

2017-2018 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను మొత్తం సంవత్సరానికి ఒకేసారి చెల్లించాలని డిమాండు చేస్తూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కరపత్రాలను పంపిణీ చేయటం పట్ల టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. సంవత్సరానికి ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించాలనటం చట్టవిరుధ్ధమని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఇది చట్ట విరుధ్ధమని తెలియజేస్తూ మున్సిపల్‌ కమీషనర్‌కు, మేయర్‌కు టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ లేఖలు వ్రాశింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955, సెక్షన్‌ 264 ప్రకారం ఆస్తి పన్నును అర్ధసంవత్సరానికి కాని లేక 3 నెలలకు ఒకసారి కాని వసూలు చేయాలే తప్ప సంవత్సరం మొత్తానికి ఒకేసారి కట్టమనే హక్కు కమీషనర్‌కు లేదు. మున్సిపల్‌ కౌన్సిల్‌కు సైతం అర్ధ సంవత్సరం లేదా 3 నెలలు మధ్య ఎంపిక చేసుకొని నిర్ణయం చేసే హక్కు మాత్రమే ఉన్నది తప్ప, సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించమని నిర్ణయం చేసే హక్కు కౌన్సిల్‌కు కూడా లేదు. కౌన్సిల్‌కు కూడా లేని హక్కును మున్సిపల్‌ అధికారులు ఎలా అమలు జరుపుతారని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది. చట్టాన్ని కాపాడవలసిన అధికారులే చట్ట విరుధ్ధమైన అంశాలను ప్రోత్సహించటం దారుణమని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడుతున్నది.
మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955, సెక్షన్‌ 269(2) మరియు సెక్షన్‌ 270ల ప్రకారం ఆస్తిపన్ను ఆలస్యంగా చెల్లిస్తే నెలకు 2 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తామని, అత్యవసర సర్వీసులు నిలిపివేయవచ్చునని, చరాస్తులను జప్తు చేసుకోవటం జరుగుతుందని కరపత్రంలో వ్రాసి ప్రచారం చేస్తున్నారు. ఇది సాధారణమైన పన్ను చెల్లింపుదారులను బెదిరించటమేనని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఏళ్ళ తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న ప్రజాప్రతినిధులపై, దశాబ్దానికి పైగా బకాయిలున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలపై, ప్రైవేటు సంస్థలపై, ట్రస్టులపై, మత సంస్థలపై ఈసెక్షన్లను ప్రయోగించి ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు తెలియజేయాలని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది. పన్నులు చెల్లించని ఇలాంటి వారిపై అధికారులు ఈ సెక్షన్‌ల ప్రకారం చర్యలు తీసుకోనందున కార్పొరేషన్‌ ఖజానాకు నష్టం వాటిల్లుతున్నది. వీరివలన కార్పొరేషన్‌ ఖజానాకు కలుగుతున్న నష్టానికి అధికారులే బాధ్యత వహించాలి.
ఆస్తి పన్ను ముందస్తుగా చలెల్లించకపోతే పోతే వడ్డీ వసూలు చేస్తామని, అత్యవసర సర్వీసులు నిలిపి వేస్తామని, చరాస్తులను జప్తు చేస్తామని బెదిరిస్తే సాధారణ పన్ను చెల్లింపుదారులు బెదిరిపోయి ఆస్తిపన్ను, దానితోబాటే నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు, యూజర్‌ చార్జీలను సంవత్సరం మొత్తానికీ ఒకేసారి కట్టేస్తారన్న వ్యూహంతోనే ఈ కరపత్రాలను పంచుతున్నారని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడుతున్నది. చట్టవిరుధ్దమైన అంశాలతో, బెదిరింపులతో కూడిన ఈ కరపత్రాల పంపిణీని తక్షణమే నిలిపి వేయాలని, మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955 సెక్షన్‌ 264 ప్రకారం అర్ద సంవత్సరానికే ఆస్తిపన్ను డిమాండు నోటీసులు జారీచేయాలని, ఇప్పటికే దశాబ్దాల తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న వారిపై వివక్షత లేకుండా మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955 సెక్షన్‌ 269(2)మరియు సెక్షన్‌ 270 ప్రకారం అత్యధిక మొత్తాలలో బకాయిలున్న వారితో ప్రారంభించి అవరోహణా క్రమం(Descending order) లో బకాయిదారులపై చర్యలు చేపట్టాలని, పూర్తి వివరాలతో ఆస్తిపన్ను బకాయిదారుల జాబితా ఎప్పటి కప్పుడు మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచటం ద్వారా ప్రజలకు తెలియజేయాలని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తున్నది.

వి.సాంబిరెడ్డి                                                  యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                         కార్యదర్శి











Saturday, 8 April 2017

ఆస్తిపన్ను సంవత్సరం మొత్తానికి ఒకేసారి చెల్లించాలని డిమాండు చేస్తూ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కరపత్రాల పంపిణీ చేయ‌టం పై అభ్యంతరం తెలియ‌జేస్తూ క‌మీష‌న‌ర్‌కు వ్రాశిన లేఖ‌


                                                                                                తేదీ: 06.04.2017 
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి, 
ఆర్యా, 
విషయం: 2017-2018 ఆర్ధిక సంవత్సరానికి ఆస్తిపన్ను సంవత్సరం మొత్తానికి ఒకేసారి చెల్లించాలని 
డిమాండు చేస్తూ కరపత్రాల పంపిణీపౖౖె అభ్యంతరం 
రిఫరెన్స్‌: 15.07.2016 న టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము వ్రాశిన లేఖ 
2017-2018 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను మొత్తం సంవత్సరానికి ఒకేసారి చెల్లించాలని, అదికూడా ఏప్రిల్‌ నెలలోనే చెల్లించాలని లేకుంటే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955, సెక్షన్‌ 269(2) ప్రకారం నెలకు 2శాతం చొప్పున పెనాలిటీ విధించబడుతుందని, అదేచట్టం సెక్షన్‌ 269(2) ప్రకారం అత్యవసర సర్వీసులు నిలిపి వేయ వచ్చునని, సెక్షన్‌ 270 ప్రకారం చరాస్తులను జప్తు చేసుకోవటం జరుగుతుందని పన్ను చెల్లింపుదారులను బెదిరిస్తూ విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌గా మీరు విజయవాడ నగరంలో కరపత్రాలను పంపిణి చేయిస్తున్నారు. పన్నుచెల్లింపుదారులను బెదిరిస్తూ మీరు కరపత్రాలను పంపిణీ చేయించటం పట్ల టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము అభ్యంతరం తెలియ జేస్తున్నాము. 

అభ్యంతరం 1:- ఇది చట్ట విరుధ్ధం (Against GHMC Act1955).. 

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955, సెక్షన్‌ 264 లో ఈ క్రింది విధంగా ఉన్నది. 

Collection of Taxes
Sec264: Property taxes how payable:- Each of the property taxes shall be payable in advance either in half-yearly or quarterly installments as the corporation may decide.
(2) In case of- 
(a) half-yearly installments, the taxes shall be payable in advance on each first day of    April and October 

(b) quarterly installments, the taxes shall be payable on each first day of April and July and each first day of October and January.
పై సెక్షన్‌ ప్రకారం ఆస్తిపన్ను అర్ధ సంవత్సరానికి ఒకసారి కాని లేదా మూడు నెలలకు ఒకసారి కాని వసూలు చేయాలి. అంతేకాని, సంవత్సరం మొత్తానికి ఒకేసారి వసూలు చేయమని చట్టంలో లేదు. అర్ధ సంవత్సరానికి ఒకసారి ఆస్తిపన్ను వసూలు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ ఏనాడో నిర్ణయించి ఇప్పటివరకు అమలు జరుపుతున్నది. ఈ నిర్ణయానికనుగుణంగానే, ఆస్తిపన్నును మదింపు చేసినప్పుడు అర్ధసంవత్సరానికి మదింపు చేసి స్పెషల్‌ నోటీసులను పంపారు. గృహ యజమానులు కూడా అంగీకరించారు. దానికనుగుణంగానే ఇప్పటివరకు కార్పొరేషన్‌ ప్రతి అర్ధ సంవత్సరం డిమాండు నోటీసులను జారీ చేసి పన్నులను వసూలు చేస్తున్నది. 
పై చట్టం ప్రకారం ఆస్తిపన్ను అర్ధ సంవత్సరానికి ఒకసారి కాని లేదా మూడు నెలలకు ఒకసారి కాని వసూలు చేయాలి. కౌన్సిల్‌కు సైతం అర్ధ సంవత్సరం లేదా 3 నెలలు మధ్య ఎంపిక చేసుకొని నిర్ణయం చేసే హక్కు మాత్రమే ఉన్నది. అంతేకాని సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించమని నిర్ణయం చేసే హక్కు కౌన్సిల్‌కు కూడా లేదు. కౌన్సిల్‌కు కూడాలేని హక్కును మీరు ఏచట్ట ప్రకారం అమలు జరుపుతున్నారని ప్రశ్నిస్తున్నాము. 2016-2017 ఆర్ధిక సంవత్సరానికి సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించమని డిమాండు నోటీసులు పంపించారు. అప్పుడే అలా నోటీసులు పంపటం చట్టవిరుధ్ధమన్న విషయాన్ని పైన రిఫరెన్స్‌లో చూపిన లేఖ ద్వారా మీదృష్టికీ, గౌరవ మేయర్‌గారి దృష్టికి తీసుక వచ్చాము. అయినప్పటికీ మీరు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో కూడా చట్టవిరుధ్ధంగా సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఆస్తిపన్ను వసూలు చేయటానికి నిర్ణయించుకున్నారని మీరు పంపిణీ చేయిస్తున్న కరపత్రాలనుబట్టి స్పష్టమవుతున్నది. చట్టాన్ని కాపాడవలసిన అధికారిగా మీరే చట్టవిరుధ్ధమైన అంశాలను ప్రోత్సహించటం సరికాదని స్పష్టం చేయదలుచుకున్నాము.  
అభ్యంతరం 2:- GHMC Act1955 సెక్షన్‌ 269(2) మరియు సెక్షన్‌ 270 అమలు: 
ఈ సెక్షన్ల ప్రకారం ఆస్తిపన్ను ఆలస్యంగా చెల్లిస్తే నెలకు 2 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తామని, అత్యవసర సర్వీసులు నిలిపివేయవచ్చునని, చరాస్తులను జప్తు చేసుకోవటం జరుగుతుందని కరపత్రంలో వ్రాశారు. సాధారణ పన్ను చెల్లింపుదారులకు వర్తించే ఈ సెక్షన్లు, కోట్లు, లక్షలరూపాయలు ఆస్తిపన్ను బకాయిలున్న వారికి ఇప్పటివరకు ఎందుకు వర్తింపచేయలేదని ప్రశ్నిస్తున్నాము. రైల్వేలు, ప్రభుత్వ కార్యాలయాలు కోట్లు రూపాయలు ఆస్తిపన్ను చెల్లించాలి. ఆస్తిపన్ను బకాయిదారులలో ప్రజాప్రతినిధులు ఉన్నారన్న పేరుతో ఆస్తిపన్ను బకాయిదారుల జాబితానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌ నుండి తొలగించారు. ఏళ్ళ తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న ప్రజాప్రతినిధులపై, దశాబ్దానికి పైగా బకాయిలున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలపై, ప్రైవేటు సంస్థలపై, ట్రస్టులపై, మత సంస్థలపై ఈసెక్షన్ల ప్రకారం చర్య తీసుకోకుండా ఉండటానికి GHMC Act1955 లో ఎలాంటి మినహాయింపులు లేవన్న విషయం మీకు తెలియంది కాదు. పన్నులు బకాయిపడిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో చట్టంలో ఎలాంటి మినహాయింపులు లేవన్నవిషయం తెలిసికూడా మీరు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. వారిపై చర్యలు తీసుకోకుండా, వారినుండి పన్నులు వసూలు చేయకపోవటం ద్వారా మీరు కార్పొరేషన్‌ ఖజానాకు నష్టం కలిగిస్తున్నారని మీకు స్పష్టం చేయదలిచాము. దశాబ్దాల తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న వీరెవ్వరిపై చర్య తీసుకోకుండా, వడ్డీ వసూలు చేస్తామని, అత్యవసర సర్వీసులు నిలిపివేస్తామని, చరాస్తులను జప్తు చేస్తామని కరపత్రం ద్వారా ప్రచారం చేయటం సాధారణమైన పన్ను చెల్లింపుదారులను బెదిరించటమేనని, ఇది సాధారణ పన్ను చెల్లింపుదారుల పట్ల వివక్షత చూపటమేనని స్పష్టం చేస్తున్నాము. చట్టం ముందు అందరూ సమానులే (Equality Before Law)అన్న సూత్రానికి మీచర్య విరుధ్ధమని తెలియజేస్తున్నాము. 
పై రెండు అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది డిమాండ్లను టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌గా మీముందుంచుతున్నాము. 
01. కరపత్రాల పంపిణీని తక్షణమే నిలిపి వేయాలి 
02. GHMC Act1955 సెక్షన్‌ 264 ప్రకారం అర్ద సంవత్సరానికే ఆస్తిపన్ను డిమాండు నోటీసులు జారీచేయాలి. 
03. ఇప్పటికే దశాబ్దాల తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న వారిపై వివక్షతలేకుండా GHMC Act1955  సెక్షన్‌ 269(2) మరియు సెక్షన్‌ 270 ప్రకారం అవరోహణా క్రమం(Descending order) లో చర్యలు చేపట్టాలి. తీసుకున్న చర్యలను  మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలకు తెలియజేయాలి 
04. పూర్తి వివరాలతో ఆస్తిపన్ను బకాయిదారుల జాబితా ఎప్పటికప్పుడు మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌ లో ఉంచటం ద్వారా ప్రజలకు తెలియజేయాలి. 

                                                   అభివందనాలతో 

వి.సాంబిరెడ్డి                                                                యంవి ఆంజనేయులు
అధ్యక్షులు                                                                       కార్యదర్శి 


CC to Sri Koneru Sridhar
         Hon'ble Mayor
Municipal Corporation
Vijayawada 




Friday, 17 March 2017

Press Meet on Metro Rail Project Vijayawada


ప్రచురణార్ధం:                                                                                                    తేదీ:17.03.2017 
మెట్రో రైల్‌ ప్రాజెక్టు డిజైన్‌లో ఎటువంటి మార్పులు జరగబోవని, బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డు మరియు కాల్వల పైన మెట్రో నిర్మాణం సాధ్యం కాదని అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (ఎ.యం.ఆర్‌.సి) ప్రకటించటాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఖండిస్తున్నది. మెట్రో రైల్‌ ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేయాలని, ఏలూరు రోడ్డులో కాకుండా మెట్రో రైలు బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డు ద్వారా నిర్మించాలని మెట్రో రైల్‌ ప్రాజెక్టు వలన భూములు కోల్పోయే బాధితులు కోరుతున్నారు. ఆ మేరకు ప్రాజెక్టు రుణం మంజూరు చేయటానికి ముందుకు వచ్చిన జర్మనీ, ఫాన్స్‌లకు చెందిన సంస్థలకు లేఖ ఇచ్చినట్లుగా పత్రికలలో వచ్చింది. మెట్రో రైల్‌ ప్రాజెక్టు బాధితుల అభిప్రాయానికి టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ మద్దత్తు తెలియ జేస్తున్నది. 
టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కూడా మెట్రో రైలు రూట్లను మార్చాలని కోరింది. ఈ మేరకు జనవరి 31 వతేదీన అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (ఎ.యం.ఆర్‌.సి) ఛైర్మెన్‌కు లేఖ వ్రాశింది. మెట్రో రైల్‌ లక్ష్యాన్ని కేవలం ట్రాఫిక్‌ నియంత్రణకే పరిమితం కాకుండా, నగర విస్తరణ లక్ష్యంగా ఏర్పాటు చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేన్‌ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఆ లేఖలో కొన్ని రూట్లను కూడా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేన్‌ ప్రతిపాదించింది. విజయవాడ- ఆగిరిపల్లి, విజయవాడ -పెద అవుట్‌పట్లి, విజయవాడ - జి.కొండూరు లేదా మైలవరం, విజయవాడ -కంకిపాడు. విజయవాడ - కంచిక చర్ల లేదా నందిగామ, విజయవాడ - అమరావతి (రాజధాని) మార్గాలను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేన్‌ ప్రతిపాదించింది. ఇంతమంది కోరినా, ప్రత్యామ్నాయ మార్గాలున్నా, వేటినీ పట్టించుకోకుండా, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులలోనే వేయాలని నిర్ణయించటం నియంతృత్వమే అవుతుందని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. 
మెట్రో రైల్‌ నిర్మాణానికిి అయ్యే ఖర్చును రాబట్టడం కోసం రాష్ట్రంలోని పెట్రోల్‌ డీజిల్‌పై మెట్రో సెస్‌ విధించాలని, ఆస్తి పన్ను మీద అదనపు సెస్‌ విధించాలని, వాహనాల రిజిస్ట్రేషన్‌ చార్జీలపై అదనంగా మెట్రో చార్జి విధించాలని, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాహనాలపై ఒకసారి గ్రీన్‌ సెస్‌ విధించాలని డి.పి.ఆర్‌. లో చేసిన ప్రతిపాదనలను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ వ్యతిరేకించింది. విజయవాడలో మెట్రో రైల్‌ నిర్మిస్తూ రాష్ట్ర ప్రజలందరి మీద సెస్‌ విధించాలనటం అన్యాయమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఎ.యం.ఆర్‌.సి కి స్పష్టం చేసింది. ఢిల్లీ, చెన్నై, కొచ్చిన్‌ లలో మాదిరిగా విజయవాడ మెట్రోరైలును కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చుతోనే నిర్మించాలని, ప్రైవేటు యాజయాన్యానికి అప్పగించటం, ప్రజలపై భారాలు విధించటం చేయరాదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేసింది. మెట్రో రైల్‌ కోసం భూములు కోల్పోయేవారికి కొచ్చిన్‌ మెట్రో రైలు మాదిరిగా సెంటుకు గరిష్టంగా రు.52 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేసింది. 
విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టు ప్రకటన నాటి నుండి నేటివరకు జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండానే, నియంతృత్వ రీతిలో నడుస్తున్నాయని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. మెట్రో రైలు మొత్తం పట్టణ రవాణాలో ఒక భాగం. కాని విజయవాడ నగరంలో ఏర్పాటుచేసే మెట్రో రైలు గురించి విజయవాడలో ఎలాంటి చర్చ జరగలేదు. విజయవాడ నగరపాలక సంస్థలో దీనిపై చర్చ జరగలేదు. విజయవాడ నగర ప్రజలనుగానీ, నగరంలోని రాజకీయపార్టీలనుగానీ , ప్రజాసంఘాలను, అసోసియేషన్లనుగానీ కనీసం సంప్రదించలేదు, పబ్లిక్‌ హియరింగ్‌ జరపలేదు. ప్రజాభిప్రాయం కోరలేదు. ఎక్కడా చర్చ లేకుండా, ప్రజలు, సంస్థలు తమ అభిప్రాయాలు తమంతటతాము చెప్పినా వినిపించుకోకుండా ముందుకు సాగటం ప్రజాస్వామ్యవిరుధ్ధమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఇప్పటికైనా మించిపోయింది లేదని, పబ్లిక్‌ హియరింగ్‌ జరిపి, ప్రజాభిప్రాయం కోరాలని, దాని ఆధారంగానే మెట్రో రైల్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది. 


(వి.సాంబిరెడ్డి)                                                                                                  (యం.వి.ఆంజనేయులు) 
అధ్యక్షులు                                                                                                               కార్యదర్శి








Friday, 17 February 2017

17.02.2017 విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై న జ‌రిగిన ప్రెస్‌మీట్‌

ప్రచురణార్ధం:                                                                                          తేదీ:17.02.2017
రేపు విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌లో ప్రవేశపెట్టబోతున్న 2017-2018 వార్షిక బడ్జెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, సమగ్రమైన బడ్జెట్‌ను రూపొందించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ నగర కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నది. ఈ రోజు బడ్జెట్‌పై తన విశ్లేషణను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ విడుదల చేస్నున్నది. బడ్జెట్‌ ప్రతిపాదననలో అనేక లోపాలు ఉన్నట్లుగా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ గుర్తించింది. అనేక అంశాలకు సంబంధించి అంచనాలు రూపొందించటంలో తార్కికత లేకపోవటాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ గమనించింది.కొన్ని చోట్ల ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా చూపారు. ఉదాహరణకు 2015-16 లో రోడ్డు గ్రాంటు ఆదాయం సున్న. అంటే రోడ్డు గ్రాంటు ఏమీ రాలేదు. అయినా రు.4 కోట్లు ఖర్చు చేసినట్లుగా చూపారు. 2016-17లో రోడ్డు గ్రాంట్‌ సవరించిన ఆదాయం రు. 3 కోట్లుగా చూపి, ఖర్చు రు.7 కోట్లుగా చూపారు. ఇక 2017-18 ఆదాయం అంచనా రు. 10 కోట్లుగా చూపి. ఖర్చు అంచనా రు. 20 కోట్లుగా చూపారు. ఒకే పద్దు క్రింద ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా చేయటం ఎలా సాధ్యమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది. అదేవిధంగా బుడమేరు అభివృధ్ధి పనుల నిధులు 2015-16లో ఆదాయంలో లేదు. కాని ఖర్చులో రు. 16 కోట్లు చూపారు. 2016-17 బడ్జెట్‌లో ఆదాయం అంచనాలలో సున్న చూపి, ఖర్చులో రు.28,55,29,055లు గా చూపారు. రాని, లేని నిధులను ఎలా ఖర్చు చేస్తారు? గత అనుభవాలను కూడా పట్టించుకోకుండా కొన్ని చోట్లు ఆదాయాలలో అతిగా చూపారు. ఉదాహరణకు సివరేజి చార్జీలు 2013-14నుండి 2016-17 సవరించిన అంచనాలవరకు ఏ సంవత్సరమూ 17 కోట్లకు చేరలేదు. అనుభవం ఇలా ఉండగా 2017-18లో మరల రు. 49.5 కోట్లు గా చూపించారు. అదేవిధంగా రోడ్‌ కటింగ్‌ చార్జీలు 2013-14లో రు.10.24లక్షలు 2014-15లో సున్న, 2015-16లో రు.35 వేలు 2016-17లో రు. 52 వేలుగా ఉన్నది. వాస్తవం ఇలా ఉండగా 2017-18 అంచనాలలో ఏకంగా రు.50లక్షలు చూపారు. ఇలా తార్కికతలేని అతి అంచనాలు అనేకం ఉన్నాయి.
2016 లో కార్పొరేటర్లు స్టడీ టూర్‌ పేరుతో చేసిన యాత్ర సర్వత్ర విమర్శలకు దారితీసింది. అధికారులు, కార్పొరేటర్లు చేసిన టూర్లకు రు. 53 లక్షలకు పైగా ఖర్చయిందని బడ్జెట్‌ తెలియజేస్తున్నది. 2017లో మరో యాత్రకు కార్పొరేటర్లు సిధ్ధమవుతున్నారని ప్రస్తుత బడ్జెట్‌లో రు.60 లక్షలు కేటాయించటం ద్వారా అర్ధమవుతున్నది. కాని మందుల కొనుగోళ్ళకు, ఆసుపత్రుల నిర్వహణకు సగానికి సగం కేటాయింపులు తగ్గించడం ద్వారా కార్పొరేటర్ల యాత్రలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజారోగ్యానికి కార్పొరేషన్‌ పాలకులు ఇవ్వటం లేదని అర్ధమవుతున్నది. ఆట స్ధలములు, స్టేడియంల నిర్వహణ మరియు యువజనోత్సవాలకు 2012-13, 2013-14, 2015-16లో ఏమీ ఖర్చు చేయకపోవటం, 2016-17లో బడ్జెట్‌లో రు.15 ల్షలుగా చూపి, సవరించిన అంచనాలలో సున్న చూపటం, క్రీడల పట్ల, యువజనుల పట్ల కార్పొరేషన్‌ పాలకుల నిర్లక్ష్యధోరణి స్పష్టంగా కనుపిస్తున్నది. 2017-18 అంచనాలలో మరల రు. 15 లక్షలు కేటాయించినా అనుభవాన్ని బట్టి చూస్తే ఖర్చు చేయటం సందేహాస్పదమే.
కార్పొరేషన్‌ నూతన భవనాలకు 26.75 కోట్లు కేటాయించారు. కాని వన్‌ టౌన్‌ ప్రాంతంలో జనరల్‌ ఆసుపత్రి నిర్మాణానికి (షేక్‌ రాజా ఆసుపత్రి)గాని, కుట్టు శిక్షణా కేంద్రాలకుగాని, హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌ అభివృధ్ధికిగానీ, మోడల్‌ చేపల మార్కెట్ల నిర్మాణాలకుగానీ, శానిటేషన్‌ పరికరాలకుగాని, ఒక్కరూపాయికూడా కూడా కేటాయించలేదు. వి.యం.సి.స్కూళ్ళలో ఫర్నిచర్‌ కొనుగోలు కొరకు అన్న పద్దు క్రింద ఏమీ కేటాయింపులు లేవని సున్న చూపారు. న్యూ రాజరేశ్వరీపేటలో నూతన హైస్కూల్‌ భవనానికి ప్రహరీ కట్టిస్తే, కోట్ల రూపాయల విలువైన భవనం వినియోగంలోకి వస్తుంది. దానికి కేటాయింపులు లేవు.
మధ్య నియోజక వర్గంలో నీటి సరఫరా సౌకర్యముల అభివృధ్ధి మరియు తూర్పు నియోజక వర్గంలో తాగునీటి సౌకర్యముల అభివృధ్ధి అనే రెండు పద్దుల క్రింద రాష్ట్ర ప్రభుత్వంనుండి వస్తాయని గతమూడు సంవత్సరాలుగా బడ్జెట్‌ అంచనాలలో కొంత మొత్తాలను చూపుతున్నారు. కానిఆదాయం మాత్రం రావటంలేదు. అయినా సరే 2017-18 బడ్జెట్‌ అంచనాలలోకూడా ఈ పద్దుల క్రింద రు.52 లక్షలు, రు.43లక్షలు చూపెట్టారు. ఈ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందనుకోవటానికి ఆధారం ఏమిటో కార్పొరేషన్‌ పాలకులు వివరించాలి. పశ్ఛిమ నియోజకవర్గాన్ని గురించి బడ్జెట్‌లలో ఎందుకు ప్రతినాదనలు ఉండటంలేదో పాలకులు చెప్పాలి.
ఆస్తిపన్నుపై ఆదాయం 2014 మార్చినాటికి రు.70 కోట్లుగా ఉంటే అది నేటికి రు.143 కోట్లు అయింది. 2014 మార్చినాటికి రు.17.91 కోట్లుగా ఉండే నీటి చార్జీల ఆదాయం 2017-18 నాటికి రు.36.5 కోట్లు గా ఉండబోతున్నది. అంటే ఈ కౌన్సిల్‌ కాలంలో ఈ రెండూ రెట్టింపయ్యాయి. నగరంలో మరల ఆస్తిపన్ను పెంచబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఆస్తిపన్ను పెరిగితే దానితోపాటే నీటి చార్జీలు కూడా పెరుగుతాయి. ఇదే జరిగితే ఇవి ప్రజలకు శాపంగా మారతాయటంలో సందేహంలేదు.
ఇలాంటి అవకతవకలు ఈ బబ్జెట్‌లో అనేకం ఉన్నాయి. నగరపాలక సంస్థ బడ్జెట్‌ వాస్తవికతకు దగ్గరగా ఉండాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను పట్టించుకోకపోవటం, స్థానిక సంస్థల పాలకులకు ప్రజల పాట్లపట్ల శ్రధ్ధలేక పోవటం ఈ బడ్జెట్‌లో ప్రతిబింబిస్తున్నాయని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది. అందువలన ఈ విషయాలన్నింటినీ కౌన్సిల్లో చర్చించి, సమగ్రమైన బడ్జెట్‌ను రూపొందించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నది.