Sunday, 9 October 2016

09.10.2016 న‌ సింగ్ న‌గ‌ర్ ఎక్సెల్ ప్లాంట్ లో చెత్త‌ డంపింగ్ ప్రాంతంలో న్యాయ‌వాదులు, టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ నాయ‌కుల ప‌ర్య‌ట‌న- న్యాయ‌పోరాటం చేయాల‌ని నిర్ణ‌యం.

ఈరోజు న్యాయ‌వాదులు, టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ నాయ‌కులతో కూడిన బృందం  సింగ్ న‌గ‌ర్ ఎక్సెల్ ప్లాంట్ లో చెత్త‌ డంపింగ్ జ‌రుగుతున్న‌ ప్రాంతంలో ప‌ర్య‌టించింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో న్యాయ‌వాదులు శ్రీ‌మ‌తి యం.వ‌సంత‌గారు, శ్రీ సోముకృష్ణ‌మూర్తిగారు, శ్రీ వ‌ల్ల‌భ‌నేని స‌త్య‌న్నారాయ‌ణ‌గారు, టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు శ్రీ వి.సాంబిరెడ్డి గారు, కార్య‌ద‌ర్శి యం.వి.ఆంజ‌నేయులు గారు, స‌హాయ కార్య‌ద‌ర్శి శ్రీ వేదాంతం శ్రీ‌నివాస్ గారు పాల్గోన్నారు. ఎక్సెల్ ప్లాంట్ లోప‌ల‌కు వెళ్ళి చెత్త‌ డంపింగ్ చేస్తున్న వైనాన్ని ప‌రిశీలించారు. అక్క‌డ స్తానికుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. చెత్త‌డంపింగ్‌వ‌ల‌న త‌మ ఆరోగ్యాలు  చెడిపోతున్నాయని స్తానికులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చెత్త‌ డంపింగ్ వ‌ల‌న వెలువ‌డుతున్న దుర్గంధాన్ని తాము భ‌రించ‌లేక పోతున్నామ‌ని, భోజ‌నంకూడా చేయ‌లేక పోతున్నామ‌ని, శ‌రీరంపై దుర‌ద‌లు వ‌స్తున్నాయ‌ని అన్నారు.  కుక్క‌లు చెత్త‌ను, చెత్తోబాటు కుళ్ళిన జంతు శ‌రీర‌భాగాల‌ను తీసుక‌వ‌చ్చి రోడ్డు మీద ప‌డేస్తున్నాయ‌ని, పిల్ల‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని అన్నారు. తినేప‌దార్ధాల‌పై దుమ్ము ప‌డుతుంద‌ని అన్నారు. దుర్వాస‌న‌కు భ‌రించ‌లేక కొంత‌మంది ఇళ్ళు ఖాళీచేసి వెళ్ళిపోతున్నార‌ని, చుట్టాలుకూడా త‌మ ఇళ్ళ‌కు రావ‌టానికి భ‌య‌ప‌డుతున్నార‌ని అన్నారు.. చెత్త‌ డంపింగ్‌ను ప‌రిశిలించి,  స్తానికుల బాధ‌ల‌న్నీ విన్న బృందం జ‌నావాసాల మ‌ధ్య చెత్త‌పోయ‌టం అంటే అక్క‌డి ప్ర‌జ‌ల‌ జీవించే హ‌క్కును కాల‌రాయ‌ట‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘ‌న క్రింద‌కు వ‌స్తుంద‌ని భావించింది. త‌క్ష‌ణ‌మే అక్క‌డ చెత్త‌డంపింగ్ చేయ‌టాన్ని నిలిపివేసి, డంపింగ్ యార్డును అక్క‌డ‌నుండి తొల‌గించాల‌ని డిమాండు చేసింది. న్యాయ‌వాది శ్రీ‌మ‌తి వ‌సంత‌గారు మాట్లాడుతూ, డంపింగ్‌యార్డును అక్క‌డ‌నుండి తొల‌గించాలి లేదా అధికారుల‌కు ఈ యార్డు ప్ర‌క్క‌న నివాసాలు ఇవ్వాల‌ని డిమాండు చేశారు. డంపింగ్‌యార్డును అక్క‌డ‌నుండి తొల‌గించ‌క‌పోతే యం.య‌ల్‌.ఎలు, ఎం.పి.లుకూడా ఈ యార్డు ప్ర‌క్క‌నే జ‌నంతో పాటు నివాసం  ఉండాల‌ని డిమాండు చేశారు. ప్ర‌జా సేవ‌కులుగా ఉండే యం.య‌ల్‌.ఎలు, ఎంపిలు, అధికారులు  మాత్రం కాలుష్యంలేకుండా సుఖంగా ఉంటూ , ప్ర‌జ‌లనుమాత్రం కాలుష్యంలో ముంచ‌టం దారుణ‌మ‌ని అన్నారు. మ‌రో న్యాయ‌వాది శ్రీ సోముకృష్ణ‌మూర్తిగారు మాట్లాడుతూ దీనిపై న్యాయ‌పోరాటం చేద్దామ‌న్నారు. హానిక‌ర‌మైన ఈ డంపింగ్ యార్డుకు వ్య‌తిరేకంగా  స్తానికులు చేస్తున్న‌పోరాటాల‌కు  మ‌ద్ద‌త్తునిస్తూ, న్యాయ‌పోరాటం చేయాల‌ని ఈ బృందం నిర్ణ‌యించింది.








Friday, 15 July 2016

ఆస్తి ప‌న్నుసంవ‌త్స‌రానికి ఒకేసారి క‌ట్టాల‌ని నోటీసులు పంప‌టం చ‌ట్ట‌విరుధ్ద‌మ‌ని తెలియజేస్తూ మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్‌కు, మేయ‌ర్‌కు వ్రాశిన లేఖ‌

                                                                

ప్రెస్ మీట్‌లో లేఖ‌ను విడుద‌ల చేస్తున్న టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ నాయ‌కులు  


                                      లేఖ‌                                                 

                                                       తేదీ: 15.07.2016
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి,

ఆర్యా,
విషయం: ఆస్తిపన్ను సంవత్సరం మొత్తానికి ఒకేసారి చెల్లించాలని డిమాండు పంపటం చట్టవిరుధ్ధమని తెలియజేస్తూ వ్రాస్తున్న లేఖ.

                 2016-2017 ఆర్ధిక సంవత్సరంలో మొదటి అర్ధ సంవత్సరానికి చెల్లించవలశిన ఆస్తిపన్ను నోటీసులను పంపుతున్నారు. అయితే ఆ నోటీసులలో మొదటి అర్ధ సంవత్సరానికి బదులుగా అనగా 01.04.2016 నుండి 30.09.2016 వరకు చెల్లించవలసిన ఆస్తిపన్ను, నీటి చార్జీలు , డ్రైనేజి చార్జీలు, యూజర్‌ చార్జీలు, సర్వీస్‌ చార్జీల తోబాటుగా 01.10.2016 నుండి 31.03.2017 వరకు చెల్లించవలసిన ఆస్తిపన్ను, నీటి చార్జీలు , డ్రైనేజి చార్జీలు, యూజర్‌ చార్జీలు, సర్వీస్‌ చార్జీలు కలిపి మొత్తం సంవత్సరానికి ఒకేసారి చెల్లించాలని ఆదేశిస్తూ డిమాండు నోటీసులను పంపుతున్నారు. ఇది చట్టవిరుధ్ధమన్న విషయాన్ని మీదృష్టికి తీసుక వస్తున్నాము.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955, సెక్షన్‌ 264 లో ఈ క్రింది విధంగా ఉన్నది.
                                Collection of Taxes
Sec264: Property taxes how payable:- Each of the property taxes shall be payable in advance either in half-yearly or quarterly installments as the corporation may decide.
(2) In case of-
(a) half-yearly installments, the taxes shall be payable in advance on each first day of    April and October
(b) quarterly installments, the taxes shall be payable on each first day of April and July and each first day of October and January.

                     పై సెక్షన్‌ ప్రకారం ఆస్తిపన్ను అర్ధ సంవత్సరానికి కాని లేదా మూడు నెలలకు ఒకసారి కాని వసూలు చేయాలి. అంతేకాని, సంవత్సరానికి ఒకేసారి వసూలు చేయమని చట్టంలో లేదు. అర్ధ సంవత్సరానికి ఒకసారి ఆస్తిపన్ను వసూలు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ ఏనాడో నిర్ణయించి ఇప్పటివరకు అమలు జరుపుతున్నది. ఈ నిర్ణయానికనుగుణంగానే, ఆస్తిపన్నును మదింపు చేసినప్పుడు అర్ధసంవత్సరానికి మదింపు చేసి స్పెషల్‌ నోటీసులను పంపారు. గృహ యజమానులు కూడా అంగీకరించారు. దానికనుగుణంగానే ఇప్పటివరకు కార్పొరేషన్‌ ప్రతి అర్ధ సంవత్సరం డిమాండు నోటీసులను జారీ చేసి పన్నులను వసూలు చేస్తున్నది. 2016-2017 లో అందుకు భిన్నంగా సంవత్సరానికి ఒకేసారి ఆస్తిపన్ను కట్టమని నోటీసులను పంపుతున్నారు. ఒకసారి మదింపు చేసి పంపిన ఆస్తిపన్ను నోటీసులను మార్చాలంటే ముందుగా కౌన్సిల్‌లో నిర్ణయం చేయాలి. సవరణ నోటీసులను పంపటం ద్వారా గృహ యజమానులకు తెలియ జేయాలి. వారి నుండి అభ్యంతరాలను స్వీకరించాలి. పరిష్కరించాలి. ఇవేవీ చేయకుండా 2016-2017 లో సంవత్సరానికి ఒకేసారి కట్టమని ఆస్తిపన్ను నోటీసులను పంపటం చట్టవిరుధ్ధం.

                      సంవత్సరానికి ఒకేసారి కట్టమని ఆస్తిపన్ను నోటీసులను పంపటం వెనుక, నిజాయితీగా క్రమం తప్పకుండా ఆస్తిపన్ను చెల్లించేవారిపైననే భారంమోపి వారినుండి ఒకేసారి ఆస్తిపన్ను రాబట్టుకోవాలన్న ఆతృత కనుపిస్తున్నది. కాని దశాబ్దాలతరబడి ఆస్తిపన్నును చెల్లించకుండా బకాయీలు పడిన వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల నుండి ఆస్తిపన్ను రాబట్టడానికి ఇంత ఆతృత ఎందుకు చూపటంలేదని ప్రశ్నిస్తున్నాము.

                పైవిషయాలను దృష్టిలో ఉంచుకొని, సంవత్సరానికి ఒకేసారి కట్టమని ప్రస్తుతం జారీ చేస్తున్న ఆస్తిపన్ను డిమాండు నోటీసులను ఉపసంహరించుకొని, అర్ధ సంవత్సరానికి చెల్లించేవిధంగా డిమాండు నోటీసులను జారీ చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా దశాబ్దాలతరబడి ఆస్తిపన్నును చెల్లించకుండా బకాయీలు పడిన వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల నుండి ఆస్తిపన్ను రాబట్టడానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నాము.
                                        అభివందనాలతో

వి.సాంబిరెడ్డి                                              యంవి ఆంజనేయులు
అధ్యక్షులు                                                            కార్యదర్శి

గ‌మ‌నికః ఇదే లేఖ‌ను న‌గ‌ర మేయ‌ర్ గారికి కూడా పంపించాము.

Sunday, 22 May 2016

Press Clippings 23.05.2016








Open Letter

                                                                                                తేదీ: 22.05.2016
అధ్యయన యాత్రకు వెళ్ళిన విజయవాడ కార్పొరేటర్లకు 
టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ బహిరంగ లేఖ. 
ఆర్యా! 
మీరు 29.04.2016 నుండి 13.05.2016 వరకు అధ్యయన యాత్రపేరుతో ఉత్తర భారతదేశంలోని 7 కార్పొరేషన్లను సందర్శించారు. ప్రజలు చెల్లించిన పన్నులనుండి ఖర్చు చేసి మీరు ఈ యాత్రకు వెళ్ళారన్న విషయం మీకు తెలియంది కాదు. కనుక మీ అధ్యయనం విజయవాడ నగర ప్రజలకు ఉపయోగపడాలి. అందువలన మీ యాత్రలో మీరు అధ్యయనం చేసిన విషయాలు, అవి విజయవాడ నగరానికి ఎలా ఉపయోగపడతాయో నగరప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మీమీద ఉన్నది. 

ముందుగా మీ టూర్‌కు నిర్దేశించిన అంశాలు ఏమిటి? ఏఏ అంశాలను అధ్యయనం చేయటానికి మిమ్ములను టూర్‌కు పంపారు? అన్న విషయాలను బహిర్గతం చేయవలసిందిగా కోరుతున్నాము. సాధారణంగా అధ్యయనానికి కొద్దిమంది వెళ్తే సరిపోతుంది. కాని 35 మంది కార్పొరేటర్లు టూర్‌కు వెళ్ళారు. ఎక్కువ మంది వెళితే అధ్యయనం మరింత ఎక్కువగా జరిగుండాలి. అది విజయవాడ నగర ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాము. అందువలన మీ అధ్యయనానికి సంబంధించి కొన్ని అంశాలను మీనుండి తెలుసుకోగోరుతున్నాము. 

01. మన విజయవాడనగరం కృష్ణా నది ఒడ్డున ఉన్న విధంగానే, ఢిల్లీ నగరం యమునా నది ఒడ్డున ఉన్నది. ఢిల్లీ జనాభా 1.86 కోట్లు. అంటే సుమారు 37 లక్షల 20 వేల కుటుంబాలు ఉన్నాయి. అంత జనాభా ఉన్న ఢిల్లీ నగరంలో ప్రతి ఇంటికీ నెలకు 20 కిలో లీటర్లు ( మనిషికి రోజుకు సుమారు 150 లీటర్లు) నీరు ఉచితంగా ఇస్తున్నారు. అంటే నెలకు సుమారు 7.44 కోట్ల కిలో లీటర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఢిల్లీ లాంటి మహానగరంలో అది ఎలా సాధ్యపడుతుందో అధ్యయనం చేశారా? మన విజయవాడ నగరంలో నీరు ఉచితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే ఎందుకు లేవో వివరించగలరు. 

మన విజయవాడ నగరంలో అపార్టుమెంట్లకు నీటి మీటర్లు ఉన్నాయి. మనకు ప్రస్తుతం ఉన్న నీటి చార్జీల రేట్ల ప్రకారం 20 కిలోలీటర్లు వాడితే రు.505.94 అవుతుంది. కాని ఢిల్లీలో గృహ అవసరాలకు 20 కిలోలీటర్ల వరకు కిలోలీటరు కనీస చార్జీ రు.4.39 గా నిర్ణయించికూడా ఉచితంగానే ఇస్తున్నారు. పూనేలో 22.5 కిలో లీటర్ల వరకు కిలోలీటరు రు.4.50కు ఇస్తున్నారు. సిమ్లా టౌన్‌లో కిలోలీటర్‌ రు.2.50కి ఇస్తున్నారు. ఛండీఘర్‌లో 15 కిలో.లీ. వరకు కిలో లీటర్‌ రు.2.లు, ఆపైన 30 కిలో.లీ.వరకు కిలోలీటర్‌ రు.4లకు ఇస్తున్నారు. ఇవన్నీ మన విజయవాడ నగరంలోని నీటి చార్జీలకంటే బాగా తక్కువ. వీటన్నింటిని పరిశీలిస్తే మన నగరంలో అపార్టుమెంట్ల వారికి నీటి చార్జీలు తగ్గించడానికి అవకాశాలున్నాయని స్పష్టమవుతున్నది. నీటి చార్జీలు తక్కువగా ఉంచడానికి ఆయా మున్సిపల్‌ కార్పొరేషన్లు తీసుకుంటున్న చర్యలేమిటీ? అక్కడ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేమిటీ? ఆయా మున్సిపల్‌ కార్పొరేషన్ల అనుభవాలను, పధ్ధతులను మీరేం అధ్యయనం చేశారు? అధ్యయనం వివరాలను బహిర్గతం చేయాలని కోరుతున్నాము. 

02. విజయవాడ నగరంలో 3 కొండలు ఉన్నాయి. నగర జనాభాలో సుమారు 10 శాతం మంది కొండలమీద నివశిస్తున్నారు. మిగిలిన 90 శాతం జనాభా మైదాన ప్రాంతాలలో నివశిస్తున్నారు. కొండల మీద నివశించేవారికి దశాబ్దాల క్రితం నుండే బూస్టర్ల ద్వారా నీటిని అందిస్తున్న చరిత్ర విజయవాడ నగరపాలక సంస్థకు ఉన్నది. విజయవాడ నగరానికి భిన్నంగా సిమ్లా నగరం పూర్తిగా కొండలపైన ఉన్నది. అక్కడ నీటి సౌకర్యాలను ఎలా కల్పిస్తున్నారు? నీటి చార్జీలు ఎలా ఉన్నాయి? మనకంటే మెరుగ్గా అక్కడి నీటి వ్యవస్థ ఎలా ఉన్నది? 

హిమాచల్‌ ప్రదేశ్‌ ఇరిగేషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డిపార్టుమెంట్‌ సిమ్లా మున్సిపల్‌ కార్పొరేషన్‌కు నీరు సరఫరా చేస్తున్నది. ఏ ధరకు నీరు సరఫరా చేస్తున్నది? సిమ్లా మున్సిపల్‌ కార్పొరేషన్‌కు నిర్వహణ చార్జీలు ఎంతవుతున్నాయి? గృహావసరాలకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏ ధరకు నీరు సరఫరా చేస్తున్నది అధ్యయనం చేశారా? అంత కొండలమీదకు సైతం నీటిని చౌకగా ఎలా ఇవ్వగలుగుతున్నారో అధ్యయనం చేశారా? వివరాలను బహిర్గతం చేయాలని కోరుతున్నాము. 
03. జాతీయ రాజధానిగా ఉన్న ఢిల్లీలో 80 శాతం పాఠశాలలకు ఆటస్థలాలు ఉన్నాయి. మన విజయవాడ నగరంలో అనేక పాఠశాలలకు ఆటస్థలాలు లేవు. వీటిని మీరు అధ్యయనం చేశారా? అక్కడ '' రైట్‌ టు ప్లే'' అన్న నినాదంతో మరిన్ని గ్రౌండ్స్‌ కోసం ప్రజలు డిమాండు చేస్తున్న విషయాన్ని మీరు అధ్యయనం చేశారా? మన విజయవాడలో మన పిల్లలకు '' రైట్‌ టు ప్లే'' (ఆడుకునే హక్కు) ఎందుకు అమలు చేయలేము? 

04. ఢిల్లీలో అనేక వీధులలో 40 అడుగుల రోడ్లలో సైతం రెండు వైపుల 10 అడుగుల వెడల్పు గలిగిన ఫుట్‌ పాత్‌లు వేశారు. అవి ఎలా వేశారో, వాటి ప్రయోజానాలేమిటో, అవి ట్రాఫిక్‌ నియంత్రణకు ఎలా ఉపయోగ పడుతున్నాయో అధ్యయనం చేశారా? మన విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణకు అలాంటి ఫుట్‌ పాత్‌లు ఎందుకు వేయలేకపోతున్నామో అధ్యయనం చేశారా? 

05. ఢిల్లీ నగరంలో ఫుల్‌పాత్‌ల మీద వృక్షజాతి మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మన నగరంలో వృక్షజాతి మొక్కలను నరికి వేశి, చిన్న చిన్న మొక్కలను నాటుతున్నారు. ఢిల్లీ మాదిరిగా విజయవాడలో వృక్ష జాతి మొక్కలను ఎందుకు నాటలేము? వృక్ష జాతి మొక్కలను నాటడానికి ఢిల్లీలో ఉన్న అవకాశాలు ఏమిటీ? విజయవాడలో లేనివి ఏమిటి? 

06. ఢిల్లీ నగరంలో పురాతన వారసత్వ సంపదను కాపాడుతున్నారు. అమృతసర్‌లో జలియన్‌ వాలా బాగ్‌లాంటి చారిత్రక ప్రదేశాలను కాపాడుతున్నారు. సిమ్లాలో ఇండియా-పాకిస్తాన్‌ ఒప్పందం జరిగిన ప్రదేశాలను, బ్రిటీష్‌వారి విడిది ప్రదేశాలను చారిత్రక స్థలాలుగా కాపాడుతున్నారు. జైపూర్‌లో అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిని కాపాడుకుంటున్నారు. అందుకు భిన్నంగా మన విజయవాడ నగరంలో చారిత్రకంగా ఉన్న స్వరాజ్య మైదానాన్ని సైతం లేకుండా చేయబోతున్నారు. అవి చూచిన తరువాత స్వరాజ్య మైదానాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీకు ఉన్నదనిపిస్తున్నదా? లేదా? 

07. ఢిల్లీ నగరంతోబాటుగా, కొండల మీద ఉన్న నగరం సిమ్లాలో సైతం వివిధ అవసరాలకోసం గ్రౌండ్లను ఏర్పాటుచేసి కాపాడుతున్నారు. చండిఘర్‌లో విస్తారమైన గ్రౌండ్‌లు ఉన్నాయి. మన నగరంలో ఉన్న గ్రౌండ్లను కూడా లేకుండా చేస్తున్నారు. గ్రౌండ్లను కాపాడుకోవటం, క్రొత్త గ్రౌండ్లను ఏర్పాటు చేయటంపై మీరేమి అధ్యయనం చేశారు? 

08. ఢిల్లీ నగరంలో బి.ఆర్‌.టి.యస్‌. ఎక్కడనుండి ఎక్కడవరకు ఎన్ని కిలోమీటర్లు వేశారు. అది జయప్రదమయిందా లేక విఫలమయిందా? జయప్రదమయితే ఎలా జయప్రదమైంది, విఫలమయితే ఎందుకు విఫలమయింది, మన విజయవాడలో బి.ఆర్‌.టి.యస్‌.కు, ఢిల్లీ బి.ఆర్‌.టి.యస్‌.కు ఉన్న సారూప్యత ఏమిటీ, విజయవాడలో బి.ఆర్‌.టి.యస్‌.ను జయప్రదం చేయటానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు తదితర అంశాలను అధ్యయనం చేశారా? చేస్తే వివరాలను బహిర్గతం చేయగలరు. 

09. మన విజయవాడ నగరంలో మెట్రోరైలు వేయాలని నిర్ణయించారు. ఢిల్లీ నగరంలో ఇప్పటికే మెట్రోరైలు వేశారు. ఢిల్లీలో ఎంత నిడివి వేశారు? ఎన్ని స్టేషన్లలతో వేశారు? అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత? ఢిల్లీ మెట్రో లాభాలలో ఉన్నదా? లేక నష్టాలలో ఉన్నదా? నష్టాలలో ఉంటే ఆనష్టాలను ఎలా పూడ్చగలుగుతున్నారు? గత 5 సంవత్సరాలుగా ఢిల్లీ మెట్రో చార్జీలను పెంచారా? మీ అధ్యయన వివరాలను బహిర్గతం చేయగలరు. 
10. ఢిల్లీ నగరంలో ఒక ప్రైవేటు సంస్థ కూడా మెట్రోరైలు వేశింది. ఎక్కడనుండి ఎక్కడకు వేశారు? చార్జీలు ఎలా ఉన్నాయి? ఆ రైలు లాభాలలో ఉన్నదా లేక నష్టాలలో ఉన్నదా? ఆ ప్రైవేటు సంస్థ ఆ రైలును నడపగలుగుతున్నదా? ఢిల్లీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ వేశిన మెట్రోరైలుకు, ప్రైవేటు సంస్థ వేశిన మెట్రోరైలుకు మధ్య తేడా ఏమిటి? ఈ విషయాలను అధ్యయనం చేశారా? వివరాలను బహిర్గతం చేయగలరు. 

11. ఢిల్లీలో మెట్రో రైలు పరిస్ధితిని అధ్యయనం చేసిన తర్వాత, మన విజయవాడ నగరంలో వేయబోతున్న మెట్రోరైలు లాభాలలో ఉంటుందని అనుకుంటున్నారా? నగర ప్రజలకు చౌకైన రవాణాగా ఉంటుందని మీరు భావిస్తున్నారా? భావిస్తే ఎలాగో వివరించగలరు? 

12. మెట్రో రైలు వలన ఢిల్లీ నగర ప్రజలపై భారాలేమైనా పడ్డాయా? పడితే ఏవిధంగా భారాలు పడ్డాయి? వివరించగలరు. 

13. విజయవాడ నగరానికి పనికి వచ్చే క్రొత్త అంశాలు ఇంకేమేం అధ్యయనం చేశారు? వివరాలను బహిర్గతం చేయగలరు. 
                                         అభివందనాలతో 

(వి.సాంబిరెడ్డి)                                                      (యంవి ఆంజనేయులు)
అధ్యక్షులు                                                                  కార్యదర్శి